అక్కడికి వెళ్తే సీఎం పోస్ట్​ ఫట్​!.. సెంటిమెంట్​ రిపీట్​

author img

By

Published : May 14, 2023, 11:54 AM IST

karnataka election results 2023

Karnataka Election Results 2023 : కన్నడనాట కొన్ని రాజకీయ సంప్రదాయాలు ఈ సారి కూడా కొనసాగాయి. అధికార పార్టీ వరుసగా రెండోసారి మెజార్టీ సాధించని ఆనవాయితీ ఈ ఎన్నికల్లో కూడా కొనసాగింది. చామరాజనగరలో పర్యటించే సీఎం.. పదవి కోల్పోయే రివాజు పునరావృతమైంది. కర్ణాటకలో ఇప్పటివరకు 16 సార్లు ఎన్నికలు జరిగితే.. ఇద్దరు సీఎంలు మాత్రమే పూర్తిగా ఐదేళ్లు అధికారంలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 136 స్థానాల్లో గెలుపొందింది. ఓ రాజకీయపార్టీ ఈస్థాయి మెజార్టీ సాధించటం 34 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి. కర్ణాటక ఎన్నికల ఫలితాల ప్రత్యేకతలపై ప్రత్యేక కథనం.

Karnataka Election Results 2023 : కన్నడనాట గత 38 ఏళ్ల నుంచి ఏ పార్టీ కూడా వరుసగా రెండోసారి తమ అధికారాన్ని నిలబెట్టుకోలేదు. ఈసారి జరిగిన ఎన్నికల్లో ఆ సంప్రదాయం పునరావృతమైంది. అప్పట్లో 1983, 1985 శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ వరుసగా రెండుసార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత నుంచి మళ్లీ ఏ ప్రభుత్వం కూడా రెండోసారి అధికారంలోకి రాలేదు. అయితే 2013లో కాంగ్రెస్​ గెలవగా.. 2018 ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయినప్పటికీ జేడీఎస్​తో కలిసి కాంగ్రెస్​ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి వరుసగా రెండోసారి నిలబెట్టుకునే ప్రయత్నాన్ని చేసింది. అయితే సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవటం వల్ల బీజేపీ ఆ అధికారాన్ని చేపట్టింది. ఈ ఎన్నికల్లోనూ ఓటర్లు అదే సంప్రదాయాన్ని కొనసాగించారు. కన్నడిగులు హస్తం పార్టీకే పట్టం కట్టారు.

Chamarajnagar Sentiment In Karnataka : చామరాజనగర్ జిల్లా.. కర్ణాటక సీఎంల పాలిట శాపంగా మారిందనే అపవాదును దశాబ్దాల నుంచి ఎదుర్కొంటోంది. చామరాజనగర్​లో అడుగుపెట్టిన సీఎం కచ్చితంగా పదవి కోల్పోతారనే నమ్మకం కర్ణాటకలో పాతుకుపోయింది. ఇక తాజా ఫలితాలతో ఇదే విషయం మరోసారి రుజువైంది. ఈ ఎన్నికలకు ముందు సీఎం బసవరాజ్​ బొమ్మై రెండుసార్లు ఈ జిల్లాలో పర్యటించారు. అయితే బీజేపీ ఓటమిపాలవ్వడం వల్ల బొమ్మై సీఎం పీఠం దిగకతప్పట్లేదు.

మరోవైపు ఈ నెల 10వ తేదీన జరిగిన కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో.. మొత్తం 73.19 శాతం పోలింగ్ నమోదైంది. 2013లో 71.83 శాతం, 2018లో 72.13 శాతం పోలింగ్​ నమోదైంది. ఈసారి పట్టణాల కంటే గ్రామీణ ప్రాంతాల్లో అత్యధిక మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఇది కూడా హస్తం పార్టీకి కలిసొచ్చినట్లు తెలుస్తోంది. పట్టణాల్లో బీజేపీ ఓటు షేరు 46 శాతంగా ఉండగా కాంగ్రెస్​కు 43 శాతం షేరు దక్కింది. సెమీ అర్బన్​ ప్రాంతాల్లో కాంగ్రెస్​కు 39.9శాతం ఓట్లు పడగా.. బీజేపీకి 36 శాతం ఓటు షేరు దక్కింది. గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ ఓటు షేరు 44 శాతం ఉండగా.. బీజేపీకి 36 శాతం ఓట్లు దక్కాయి. ఇక సెమీ రూరల్​ ప్రాంతాల్లో కాంగ్రెస్​కు 44 శాతం ఓట్లు పడగా బీజేపీకు 29 శాతం ఓటు షేరు దక్కింది.

కర్ణాటకలో ఇప్పటివరకు 16 సార్లు శాసనసభ ఎన్నికలు జరిగాయి. కానీ ఇద్దరు నేతలు మాత్రమే పూర్తి స్థాయిలో ఐదేళ్ల సీఎంగా కొనసాగారు. 1972లో దేవ్​రాజ్​ ఉర్స్​​ నేతృత్వంలో కాంగ్రెస్​ ప్రభుత్వం ఏర్పడగా.. ఆయన ఐదేళ్లపాటు సీఎంగా ఉన్నారు. 2013లో కాంగ్రెస్​ మెజార్టీ సాధించటం వల్ల ఆ పార్టీ సీనియర్​ నేత సిద్ధరామయ్య ఐదేళ్లు సీఎంగా కొనసాగారు. మిగతా అన్ని సందర్భాల్లో సీఎం కుర్చీని నేతలు, పార్టీలు పంచుకోవడం లేదా ముందస్తు ఎన్నికలకు వెళ్లడం జరిగింది. కానీ ఈ సారి ఎన్నికల్లో కాంగ్రెస్ 136 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది.

ఓ పార్టీకి ఈ స్థాయిలో మెజార్టీ దక్కడం అనేది 34 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి. అయితే 1989లో కాంగ్రెస్ 178 స్థానాల్లో విజయం సాధించింది. 1994లో జనతాదళ్​కు 115 స్థానాలు దక్కగా.. 1999లో కాంగ్రెస్ 132 సీట్లు గెలుచుకుంది. 2004, 2008 ఎన్నికల్లో హంగ్ ఏర్పడింది. 2013లో కాంగ్రెస్ 122 స్థానాలు దక్కించుకోగా.. 2018 ఎన్నికల్లో మళ్లీ హంగ్​ వచ్చింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.