ETV Bharat / bharat

కలెక్టర్​ ఆస్తులు జప్తునకు కోర్టు ఆదేశం.. 40 ఏళ్లుగా న్యాయ పోరాటం

author img

By

Published : Apr 5, 2023, 9:03 PM IST

court order to seize collector assets
court order to seize collector assets

40 ఏళ్లనాటి ఓ భూ వివాదం కేసులో కలెక్టరేట్​ చరాస్తులను జప్తు చేయాలంటూ కోర్టు ఆదేశించింది. అయితే బాధితుడు ఇన్నేళ్ల పాటు ప్రభుత్వాధికారులతో.. తనకు న్యాయం చేయాలంటూ కోరడం విశేషం. దీంతో బాధితుడు ఫిర్యాదు మేరకు మహారాష్ట్రలోని ఓ సివిల్​ కోర్టు కలెక్టరేట్ చరాస్తులను జప్తు చేయాలంటూ తీర్పునిచ్చింది. అసలు ఆ కేసు ఏంటో తెలుసుకుందామా మరి!

మహారాష్ట్రలో ఓ జిల్లా కలెక్టరేట్​లోని చరాస్తులను జప్తు చేయాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దాదాపు 40 ఏళ్ల నాటి ఓ భూ వివాదం కేసులో బాధితుడికి నష్ట పరిహారం విషయంలో జాప్యం చేసినందుకు గాను కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో కలెక్టరేట్​లో ఉన్న కారు, కుర్చీ, టేబుల్​ వంటి వస్తువులను జప్తు చేయాలని ఆదేశించింది. 2017లో రోడ్డు పనుల్లో భాగంగా తన భూమిని కోల్పోయిన ఓ వ్యక్తి పిటిషన్​ మేరకు.. కలెక్టరేట్​ ఆస్తులను అమ్మి బాధితుడికి నష్ట పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది.

అసలేంటా కేసు?
కొల్హాపుర్​ జిల్లాలోని కురుంద్​వాడ్​ మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు చేయడానికి 1984లో అక్కడ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా కురుంద్​వాడ్​లో 60 మీటర్ల వెడల్పుతో రోడ్డు పనులు ప్రారంభించింది. అయితే రోడ్డు పనుల్లో వసంత్​ రాజా​రామ్​ సంక్​పాల్​ అనే వ్యక్తి 1984లో కొంత భూమిని కోల్పోయాడు. దీంతో వసంత్​ రాజారామ్​ ఆ రోడ్డు పనులు ప్రభుత్వం ఆదేశాల మేరకు జరుగుతున్నాయే లేదో తెలుసుకునేందుకు.. స్థానిక మున్సిపల్​ కౌన్సిలర్​ను అడిగాడు. ఈ విషయంలో మున్సిపల్ కౌన్సిలర్​కు, వసంత్​ రాజారామ్​కు మధ్య వివాదం చెలరేగింది. ఈ వివాదం కాస్త పెద్దదై బాంబే హైకోర్టు వరకు వెళ్లింది. అయితే, మున్సిపల్​ కౌన్సిల్​ ఆమోదించిన ప్లాన్​ ప్రకారమే రోడ్డు పనులు జరిగాయా లేదా, ఆ పనుల్లో భాగంగానే వసంత్​ రాజారామ్ భూమిని కోల్పోవాల్సి వచ్చిందా లేదా అన్న విషయాన్ని సివిల్​ కోర్టు తేల్చి చెప్పాలని బాంబే హైకోర్టు 2017 జూలై 31న ఆదేశించింది.

దీని ప్రకారం వసంత్​ రాజారామ్​ 2018లో సివిల్​ కోర్టులో దావా​ వేశారు. ఆ కేసు విచారణ చేపట్టిన సివిల్​ కోర్టు.. ప్రభుత్వ ఆదేశాల మేరకు కురుంద్​వాడ్​లో రోడ్డు పనులు జరిగినట్లు కోర్టు తెల్చి చెప్పింది. ప్రస్తుతం వివాదంలో ఉన్న వసంత్​ రాజారామ్​ భూమి కూడా రోడ్డు పనుల్లో భాగంగానే కోల్పోవాల్సి వచ్చినట్లు తెలిపింది. అయితే భూమిని కోల్పోయిన వసంత్​ రాజారామ్​కు మూడు నెలల్లోగా నష్టపరిహారం చెల్లించాలని కొల్హాపుర్​ కలెక్టర్​, స్పెషల్​ అక్విజేషన్​ ఆఫీసర్​కు 2019 జూన్​ 27న సివిల్​ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

అయితే దాదాపు సంవత్సరం గడిచినా సంబంధిత అధికారులు వసంత్ రాజారామ్​కు ఎటువంటి నష్టపరిహారం చెల్లించలేదు. దీంతో వసంత్​ రాజారామ్​ మళ్లీ సివిల్​ కోర్టును ఆశ్రయించారు. కోర్టులో పిటిషన్ వేసినప్పటికీ కలెక్టర్​, సంబంధిత అధికాలను నుంచి ఎటువంటి స్పందన లేదు. దీంతో కొల్హాపుర్​ కలెక్టర్ కార్యాలయంలోని చరాస్తులను జప్తు చేయాలని డిమాండ్​ చేస్తూ 2023 జనవరి 5న కోర్టుకు దరఖాస్తు చేశారు వసంత్​ రాజారామ్​. దీనిపై విచారించిన కోర్టు ఫిబ్రవరి 16న కొల్హాపుర్​ కలెక్టర్​, స్పెషల్​ అక్విజేషన్​ ఆఫీసర్​ కార్యాలయాలకు సంబంధించిన చరాస్తులను జప్తు చేయాలని ఆదేశించింది. దీనిలో భాగంగా రూ.3 లక్షల విలువైన కలెక్టర్​ కారు, రూ.20,000 విలువ చేసే కుర్చీ, రూ.20,000 విలువ చేసే టేబుల్​, అల్మారా, ఫ్యాన్​, కూలర్ వంటి ఆస్తులను జప్తు చేయాలంటూ తీర్పునిచ్చింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.