ETV Bharat / bharat

'భూములిస్తే ఉద్యోగాలు'.. ఆ రైల్వే స్కాంలో లాలూ అనుచరుడు అరెస్ట్​

author img

By

Published : Jul 27, 2022, 2:30 PM IST

CBI arrests Lalu Prasad's 'man Friday' Bhola Yadav in land-for-jobs scam in railways
CBI arrests Lalu Prasad's 'man Friday' Bhola Yadav in land-for-jobs scam in railways

CBI Arrests Bhola Yadav: బిహార్​ మాజీ ముఖ్యమంత్రి, ఆర్​జేడీ అధినేత లాలూ ప్రసాద్​ యాదవ్​.. కీలక అనుచరుడు భోళా యాదవ్​ను సీబీఐ బుధవారం అరెస్టు చేసింది. యూపీఏ హయాంలో లాలూ కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో జరిగిన రైల్వే స్కాంకు సంబంధించి ఈయనను అదుపులోకి తీసుకుంది. గ్రూప్​-డి ఉద్యోగాలు ఇప్పించేందుకు అభ్యర్థుల నుంచి లాలూ కుటుంబం భూములు తీసుకుందని.. గతంలో సీబీఐ కేసు నమోదు చేసింది.

CBI Arrests Bhola Yadav: యూపీఏ హయాంలో రైల్వే స్కాంకు సంబంధించి.. బిహార్​ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్​ యాదవ్​ అనుచరుడు భోళా యాదవ్​ను అరెస్టు చేసింది కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ). రైల్వేలో ఉద్యోగాలు ఇప్పించేందుకు కొందరు అభ్యర్థుల నుంచి భూములు తీసుకున్నారన్నది ప్రధాన అభియోగం.

భోళా యాదవ్​ను రాష్ట్రీయ జనతాదళ్​ మద్దతుదారులు.. హనుమాన్​, లాలూ నీడగా పిలుస్తుంటారు. ఉద్యోగార్థులకు రైల్వే గ్రూప్​-డి జాబ్స్​ ఇప్పించి.. భూముల్ని లాలూ కుటుంబానికి బదిలీ చేయడంలో భోళా యాదవ్​ కీలకంగా వ్యవహరించారని సీబీఐ అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం పట్నా, దర్భంగలోని ఆయనకు చెందిన ప్రదేశాల్లో విస్తృత సోదాలు నిర్వహించింది. అనంతరం అరెస్టు చేసింది.

CBI arrests Lalu Prasad's 'man Friday' Bhola Yadav in land-for-jobs scam in railways
భోళా యాదవ్​

ఈ స్కాం జరిగిన సమయంలో లాలూ రైల్వే శాఖ మంత్రిగా ఉన్నారు. భోళా యాదవ్​ అప్పట్లో లాలూకు ఓఎస్​డీగా విధులు నిర్వర్తించారు. అనంతరం ప్రత్యక్ష రాజకీయాల్లోకి కూడా ప్రవేశించారు. 2015 బిహార్​ అసెంబ్లీ ఎన్నికల్లో.. ఆర్​జేడీ టికెట్​పై పోటీ చేసి బహదూర్​పుర్​ సీటు గెల్చుకున్నారు. 2020లో భోళా యాదవ్​.. వేరే చోటు నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

2004 నుంచి 2009 వరకు కేంద్రంలో యూపీఏ హయాంలో లాలూ రైల్వే మంత్రిగా ఉన్నారు. ఆ సమయంలోనే రైల్వే ఉద్యోగాలకు నియామక ప్రక్రియ జరగ్గా.. అందులో కొన్ని అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. కొందరు అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు వారి నుంచి లాలూ కుటుంబం భూములు, ఇతర ఆస్తులను లంచంగా తీసుకున్నట్లు ఆరోపణలు రాగా సీబీఐ కేసు నమోదు చేసింది. లాలూ, ఆయన భార్య రబ్రీ దేవి, కూతుళ్లు మిసా భారతి, హేమా యాదవ్​ సహా మరో 12 మందిని ఎఫ్​ఐఆర్​లో చేర్చింది.
ఉద్యోగార్థుల కుటుంబాల నుంచి దాదాపు లక్ష చదరపు అడుగుల భూముల్ని లాలూ కుటుంబం అక్రమంగా పొందిందని అభియోగాలు మోపింది సీబీఐ.

ఐదేళ్లు జైలు శిక్ష విధించిన సీబీఐ కోర్టు.. దాణా కుంభకోణం కేసులో ఆర్​జేడీ అధినేత, బిహార్​ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్​ యాదవ్​కు ఇప్పటికే శిక్ష ఖరారైంది. రాంచీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఆయనకు ఐదేళ్లు జైలు శిక్ష, రూ.60 లక్షలు జరిమానా విధిస్తున్నట్లు ఫిబ్రవరి 21న తీర్పు వెలువరించింది. దాణా కుంభకోణానికి సంబంధించి ఇప్పటికే నాలుగు కేసుల్లో లాలూ దోషిగా తేలారు. దోరండా ఖజానా నుంచి రూ.139.35కోట్లు దుర్వినియోగం కేసు ఐదోది, చివరిది.

జులై 3న మెట్లపై నుంచి జారిపడిన లాలూప్రసాద్ యాదవ్ ఆరోగ్యం క్షీణించింది. భుజం విరగ్గా.. తొలుత ఆయన్ను పట్నాలోని ఎయిమ్స్​, తర్వాత దిల్లీ ఎయిమ్స్​కు తరలించి చికిత్స అందించారు. కొద్దిరోజులకు ఆయన ఆరోగ్యం కాస్త మెరుగుపడినట్లు ఆయన కుమార్తె మిసా భారతి తెలిపారు.

ఇవీ చూడండి: లాలూ గదిలో అగ్నిప్రమాదం.. అల్పాహారం చేస్తుండగా మంటలు చెలరేగి..

లాలూ ఆరోగ్యంపై తేజస్వీ కీలక ప్రకటన.. ఆ రూమర్స్​ నమ్మొద్దంటూ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.