ETV Bharat / bharat

కళ్లల్లో కారం కొట్టి రూ.కోటి చోరీ.. పట్టపగలే నడిరోడ్డుపై..

author img

By

Published : Apr 19, 2022, 1:33 PM IST

Cash van loot in India: బ్యాంక్​లో డిపాజిట్​ చేసేందుకు వెళ్తున్న క్యాష్​ వ్యాన్​ను దుండగులు లూటీ చేశారు. గార్డుల కళ్లల్లో కారం కొట్టి, తుపాకులతో బెదిరించి కోటి రూపాయలు ఎత్తుకెళ్లారు. హరియాణా గురుగ్రామ్​లో సోమవారం జరిగిందీ ఘటన.

cash van loot in india
కళ్లల్లో కారం కొట్టి రూ.కోటి చోరీ.. పట్టపగలే నడిరోడ్డుపై..

Cash van loot in India: హరియాణా గురుగ్రామ్​లో పట్టపగలే భారీ దోపిడీ జరిగింది. కొందరు దుండగులు కలిసి క్యాష్ కలెక్షన్​ కంపెనీకి చెందిన వ్యాన్​ గార్డులు, సిబ్బందిని బెదిరించి రూ.కోటి నగదు ఎత్తుకెళ్లారు. సోమవారం గురుగ్రామ్​లోని సుభాష్​ చౌక్ ప్రాంతంలో జరిగిందీ ఘటన. సీసీటీవీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు.

ఉదయం నుంచి ఫాలో అవుతూ..: పోలీసుల కథనం ప్రకారం.. ఎస్​&ఐబీ అనేది ఓ ప్రైవేట్ క్యాష్ కలెక్షన్ కంపెనీ. వేర్వేరు వ్యాపార సంస్థల కార్యాలయాలు, పెద్ద దుకాణాల నుంచి రోజూ నగదు తీసుకెళ్లి.. బ్యాంకులో డిపాజిట్ చేయడం ఆ సంస్థ పని. సోమవారం ఉదయం కూడా యథావిధిగా డ్యూటీ చేస్తున్నారు ఎస్​&ఐబీ క్యాష్ వ్యాన్ సిబ్బంది. గార్డుల పర్యవేక్షణలో అప్పటికే 10-11 కార్యాలయాలకు వెళ్లి నగదు తీసుకున్నారు. ఆ మొత్తం రూ.కోటిపైనే ఉంది.

అయితే.. ఉదయం నుంచి తమ వ్యాన్​ను కొందరు ఫాలో అవుతున్నారని గార్డులు, సిబ్బంది గుర్తించలేకపోయారు. సుభాష్ చౌక్​ వద్ద సోహ్నా రోడ్​లోని మారుతి షోరూం నుంచి క్యాష్​ కలెక్ట్ చేసుకునేందుకు వెళ్లారు. అప్పుడే నలుగురైదుగురు దుండగులు మెరుపు వేగంతో వచ్చారు. గార్డులు, సిబ్బంది కళ్లల్లో కారం కొట్టారు. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే వారి తలలకు తుపాకులు గురిపెట్టారు. వ్యాన్​లోని డబ్బు మొత్తాన్ని క్షణాల్లోనే తమ వాహనంలో వేసుకుని పరారయ్యారు. "క్యాష్​ వ్యాన్ సిబ్బంది చెప్పిన వివరాలు, నేరం జరిగిన ప్రదేశంలోని సీసీటీవీ కెమెరాల దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నాం. దొంగలు వాడిన వాహనం నంబర్ ప్లేట్​ కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నాం." అని తెలిపారు గురుగ్రామ్​ ఈస్ట్ జోన్​ డీసీపీ వీరేంద్ర విజ్.

వారం వ్యవధిలోనే..: గత శుక్రవారం ఇదే తరహా ఘటన జరిగింది. హరియాణా రోహ్​తక్​లో ఏటీఎంలలో నింపేందుకు డబ్బు తీసుకెళ్తున్న క్యాష్ వ్యాన్​ను దొంగలు దోచుకున్నారు. బైక్​పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు.. తొలుత సెక్యూరిటీ గార్డులపై కాల్పులు జరిపారు. అతడి దగ్గరున్న ఆయుధాన్ని లాక్కున్నారు. ఏటీఎంలో నగదు నింపుతున్న సిబ్బంది.. ఈ దాడిని చూసి భయపడి పారిపోయారు. ఇద్దరు దొంగలు కలిసి రూ.2 లక్షల 62 వేలను సంచిలో నింపుకుని, పరారయ్యారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.