ETV Bharat / bharat

పెళ్లింట పెను విషాదం.. బస్సు నదిలో పడి 33 మంది మృతి

author img

By

Published : Oct 5, 2022, 6:30 AM IST

Updated : Oct 5, 2022, 9:23 PM IST

బంధుమిత్రుల ముచ్చట్లు, పిల్లల ఆటపాటలతో అప్పటివరకు సరదాగా సాగిన ప్రయాణం.. విషాదాంతమైంది. ఇంకాస్త దూరం ప్రయాణిస్తే కల్యాణ మండపానికి చేరుకుంటామనేలోపే మృత్యువు వారిని కబళించింది. పెళ్లి బృందంతో వెళ్తున్న బస్సు నదిలో పడిపోగా.. 33 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఉత్తరాఖండ్​లోని పౌడీ జిల్లాలో మంగళవారం రాత్రి జరిగింది.

Bus Accident in Kotdwar
పెళ్లింట పెను విషాదం

ఉత్తరాఖండ్​ పౌడీ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 33 మంది మృతి చెందారు. 18 మంది గాయపడ్డారు. ధూమకోట్ వద్ద రిఖినికల్- బిరోఖాల్ రహదారిపై వెళ్తున్న ఓ పెళ్లి బస్సు అదుపుతప్పి 500 మీటర్ల లోతున్న న్యార్ నదిలో పడిపోయింది. మంగళవారం రాత్రి 7.30 సమయంలో జరిగిన ఈ దుర్ఘటన.. అనేక కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది.

పెళ్లికి వెళ్తూ..
ప్రమాదానికి గురైన బస్సు.. పెళ్లి బృందంతో వెళ్తోంది. హరిద్వార్​లోని లాల్​గఢ్​కు చెందిన నంద్​ రామ్​ అనే యువకుడి వివాహం కోసం.. అతడి బంధుమిత్రులు దాదాపు 46 మంది కలిసి మంగళవారం మధ్యాహ్నం పౌడీ జిల్లాలోని కాండా గ్రామానికి బస్సులో బయలుదేరారు. మంగళవారం ఏడున్నర గంటలయ్యే సరికి.. వారు గమ్యస్థానానికి దాదాపు చేరువయ్యారు. ఇంతలోనే అనూహ్య సంఘటన జరిగింది. వేగంగా వెళ్తున్న బస్సుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. బిరోఖాల్ ప్రాంతంలోని సిమ్డీ గ్రామం వద్ద రోడ్డు పక్కనున్న న్యార్​ నదిలో పడిపోయింది.

ఈ ఘటనలో అనేక మంది అక్కడికక్కడే మరణించారు. గాయపడ్డవారిలో కొందరు.. అతి కష్టం మీద కొండ ఎక్కి, రోడ్డుపైకి వచ్చి.. అటుగా వెళ్తున్న వారికి విషయం చెప్పారు. వారి సాయంతో పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు, రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం(ఎస్​డీఆర్​ఎఫ్​) సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బుధవారం సాయంత్రం సహాయక చర్యలు ముగిసినట్లు ఎస్​డీఆర్ఎఫ్ ప్రకటించింది. ఈ మేరకు 33 మంది చనిపోయినట్లు తెలిపింది.18 మంది గాయపడ్డారని స్పష్టం చేసింది.

అయితే.. బస్సు ఉన్న ప్రదేశం చాలా లోతుగా ఉండడం, మొత్తం చీకటిగా ఉండడం వల్ల సహాయక చర్యల్లో తీవ్ర ఇబ్బంది ఎదురైంది. స్థానికులు ఫ్లాష్​లైట్లు వేయగా.. ఆ వెలుతురులోనే బాధితుల కోసం పోలీసులు, ఎస్​డీఆర్​ఎఫ్​ సిబ్బంది లోయలో వెతికారు. రాత్రంతా నిర్విరామంగా శ్రమించి.. మొత్తం 21 మంది రక్షించారు. గాయపడ్డ వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు.

సీఎం పర్యవేక్షణలో..
మంగళవారం ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే.. దెహ్రాదూన్​లోని కంట్రోల్ రూమ్​కు చేరుకున్నారు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ. సహాయక చర్యల్ని స్వయంగా పర్యవేక్షించారు. బాధితులకు పూర్తిస్థాయిలో అండగా నిలవాలని అధికారుల్ని ఆదేశించారు.

రాష్ట్రపతి, ప్రధాని సంతాపం
బస్సు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.

Last Updated : Oct 5, 2022, 9:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.