ETV Bharat / bharat

'టీఎంసీ అభ్యర్థులపై భాజపా దాడులు!'

author img

By

Published : Apr 6, 2021, 3:54 PM IST

భాజపా నేతలు తమ అభ్యర్థులపై దాడులు జరుపుతున్నారని ఆరోపించారు బంగాల్​ సీఎం, తృణమూల్​ కాంగ్రెస్​ అధినేత్రి మమతా బెనర్జీ. పలు చోట్ల భద్రతా సిబ్బంది కూడా తమ అభ్యర్థులను పోలింగ్​ కేంద్రానికి రానివ్వకుండా అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు.

bengal elections third phase mamata banerjee, బెంగాల్​ ఎన్నికల మూడో దశ
మమతా బెనర్జీ

బంగాల్ మూడో దశ ఎన్నికల్లో భాజపా నేతలు తమ కార్యకర్తలు, అభ్యర్థులపై దాడులు జరుపుతున్నారని, పోలింగ్​ కేంద్రాలను ఆక్రమిస్తున్నారని ఆరోపించారు టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ. ఆరంబాగ్​ నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రానికి వచ్చిన తమ అభ్యర్థి, దళిత మహిళ సుజాత మొండల్​పై వెంటపడి మరీ దాడి చేశారన్నారు. ఈ క్రమంలో ఆమె తలపై తీవ్ర గాయాలయ్యాయని పేర్కొన్నారు. ఖనాకుల్​లోనూ తమ అభ్యర్థిపై దాడి జరిపారని తెలిపారు. అలిపుర్​దౌర్​ జిల్లాలో పర్యటన సందర్భంగా మంగళవారం ఈ వ్యాఖ్యలు చేశారు మమత.

"బంగాల్​లో ఆశించినంత స్పందన రాకపోవడం వల్లే భాజపా ఈ విధంగా కుట్ర పన్నుతోంది. ఎన్నికలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు నలుగురు తృణమూల్ కాంగ్రెస్​ కార్యకర్తలు హత్యకు గురయ్యారు. కానీ దీనిపై అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. మీరు మమ్మల్ని భయపెట్టలేరు. మేము ఇలాంటి ఘటనలకు బెదరం. "

-మమతా బెనర్జీ, బంగాల్​ ముఖ్యమంత్రి

అభ్యర్థులను అడ్డుకుని..

తూర్పు క్యానింగ్​లో తమ అభ్యర్థి షకౌత్​ మోల్లాను పోలింగ్​ కేంద్రానికి రానివ్వకుండా భద్రతా దళాలు అడ్డుకున్నాయని మమత ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ తరహా ఘటనలు చాలా జరుగుతున్నాయని, ఉదయం నుంచి ఇప్పటివరకు సుమారు 100కుపైగా ఫిర్యాదులు వచ్చాయని పేర్కొన్నారు. ఈ ఘటనలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని, అయినా ఎలాంటి ప్రయోజనం లేదని వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి : టీఎంసీ, భాజపా కార్యకర్తల మధ్య ఘర్షణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.