ETV Bharat / bharat

మణిపుర్​ సీఎంగా మళ్లీ బీరేన్​ సింగ్- ఎన్నిక ఏకగ్రీవం

author img

By

Published : Mar 20, 2022, 4:53 PM IST

Updated : Mar 20, 2022, 9:46 PM IST

Biren Singh: మణిపుర్​ ముఖ్యమంత్రిగా మరోసారి బీరేన్​ సింగ్​ ఎన్నికయ్యారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ భాజపా ఘనవిజయం సాధించింది.

Manipur's acting CM N Biren Singh unanimously elected as the Chief Minister of the State
Manipur's acting CM N Biren Singh unanimously elected as the Chief Minister of the State

Biren Singh: మణిపుర్​ ముఖ్యమంత్రిగా మళ్లీ బీరేన్​ సింగ్​ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇంఫాల్​లో ఆదివారం జరిగిన మణిపుర్​ భాజపా శాసనసభాపక్ష సమావేశంలో.. తదుపరి ముఖ్యమంత్రిగా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 60 స్థానాలకుగానూ.. భాజపా ఒంటరిగా పోటీ చేసి 32 చోట్ల గెలుపొందింది. 2017లో నాగా పీపుల్స్​ ఫ్రంట్​, నేషనల్స్​ పీపుల్స్​ పార్టీల మద్దతుతో భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం గమనార్హం. ఈసారి మాత్రం సింగిల్​గానే మేజిక్​ ఫిగర్​ను చేరుకుంది.

బీరేన్​ సింగ్​.. హెయ్​గాంగ్​ నియోజకవర్గంలో గెలుపొందారు. ఆయన ప్రత్యర్థి, కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థి పంగిజం శరత్​చంద్ర సింగ్​పై 17 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో విజయ దుందుభి మోగించారు. దీంతో వరుసగా ఐదోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు సింగ్​.

గవర్నర్​ను కలిసిన భాజపా నేతలు

మణిపుర్​లో ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రక్రియలో భాగంగా భాజపా నేతలు ఆ రాష్ట్ర గవర్నర్​ లా గణేషన్​ను కలిశారు. తమ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధమని గవర్నర్​కు పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో.. భాజపా పరిశీలకులు నిర్మలా సీతారామన్​, కిరణ్​ రిజిజు, పార్టీ నేతలు భూపేందర్​ యాదవ్​, సంబిత్​ పాత్ర, ముఖ్యమంత్రి బీరెన్​ సింగ్​, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శర్ద దేవి, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

సోమవారం శాసనసభాపక్ష భేటీ

ఉత్తరాఖండ్​లో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించేందుకు సోమవారం దెహ్రాదూన్​లో భాజపా శాసనసభాపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకోనున్నారు నేతలు. దిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్​ షాతో రాష్ట్ర భాజపా నేతలు పుష్కర్​ సింగ్​ ధామీ, రమేశ్​ పోఖ్రియాల్​ నిశాంక్​, త్రివేంద్ర సింగ్​ రావత్​ భేటీ అయిన తర్వాత శాసనసభాపక్ష సమావేశాన్ని నిర్ణయించినట్లు రాష్ట్ర భాజపా అధ్యక్షుడు మదన్​ కౌశిక్​ తెలిపారు.

గోవాలోనూ భాజపా శాసనసభాపక్ష సమావేశం సోమవారం జరగనుందని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ప్రమోద్​ సావంత్​ తెలిపారు. ఈ సమావేశానికి భాజపా పరిశీలకులు హాజరవుతారని చెప్పారు. సోమవారం సాయంత్రం ప్రమాణ స్వీకారంపై నిర్ణయం వెలువడనుందన్నారు.

యూపీలో 24న..

ఉత్తర్​ప్రదేశ్​లో ప్రభుత్వ ఏర్పాటుపై ఈనెల 24న భాజపా శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ఆ మరుసటి రోజునే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఉన్న నేపథ్యంలో.. పార్టీ శాసనసభాపక్ష నేతగా యోగి ఆదిత్యనాథ్​ను అధికారికంగా ఎన్నుకోనున్నారు ఎమ్మెల్యేలు.

ఇవీ చూడండి: పతనం అంచుల నుంచి విజయతీరాలకు.. మణిపుర్​లో భాజపా మేజిక్!

జర్నలిస్ట్​ టు సీఎం.. వరుసగా ఐదోసారి విజయదుందుభి

Last Updated :Mar 20, 2022, 9:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.