ETV Bharat / bharat

ఫ్రెండ్స్​తో స్నాక్స్​ ఛాలెంజ్​.. 150 మోమోస్​ తిని యువకుడు మృతి!

author img

By

Published : Jul 15, 2023, 7:56 PM IST

Updated : Jul 16, 2023, 6:39 AM IST

Bihar youth dies in momos eating challenge with friends
స్నేహితులతో 'మోమోస్​' బెట్టింగ్​​.. 150 మోమోస్​ తిని చనిపోయిన యువకుడు..

స్నేహితులతో కట్టిన 'మోమోస్​' తినే బెట్టింగ్​లో ఓ 25 ఏళ్ల యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఒకేసారి ఏకంగా 150 మోమోస్​ తిన్నాక తీవ్ర అస్వస్థతకు గురై మరణించాడు. ఈ ఘటన బిహార్​లో జరిగింది.

స్నేహితులతో కాసిన ఓ పందెం 25 ఏళ్ల యువకుడి నిండు ప్రాణాలను తీసింది. 'మోమోస్​' ఛాలెంజ్​లో భాగంగా ఏకంగా 150 మోమోస్​ను తిన్నాడు బిహార్​కు చెందిన ఓ యువకుడు. దీంతో ఆరోగ్యం క్షీణించడం వల్ల అతడు ప్రాణాలు విడిచాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని అనుమానస్పదస్థితిలో గోపాల్​గంజ్​, సివాన్​ జిల్లాల సరిహద్దుల్లోని రోడ్డు పక్కన స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మృతదేహానికి పోస్ట్​మార్టం పరీక్షలు నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
మృతుడు విపిన్​ కుమార్​(25)ను బిహార్​ తూర్పు చంపారన్​ జిల్లాలోని సిహోర్వా గ్రామానికి చెందిన యువకుడిగా గుర్తించారు పోలీసులు. విపిన్​ కుమార్​ సివాన్​ జిల్లాలోని గ్యానీ మోర్​ సమీపంలో ఓ మొబైల్​ రిపేర్​ షాప్​ను​ నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో ఇద్దరు గుర్తుతెలియని యువకులు షాపులో ఉన్న విపిన్​ను పిలుచుకొని బయటకు తీసుకెళ్లారని.. ఎంతకీ అతడు తిరిగి రాలేదని మృతుడి తండ్రి చెప్పినట్లుగా పోలీసులు తెలిపారు. మరోవైపు విపిన్​ కుమార్​ను తన స్నేహితులు కావాలనే విషం పెట్టి చంపారని అతడి తండ్రి విష్ణు మాంఝీ ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్ట్​మార్టం రిపోర్ట్​ వచ్చాకే విపిన్​ మరణానికి గల కారణాలు తెలుస్తాయని వెల్లడించారు.

"కొందరు స్థానికులు రోడ్డుపై పడి ఉన్న తన కుమారుడి మృతదేహాన్ని గమనించి మాకు సమాచారం ఇచ్చారు. వెంటనే మేము ఘటనాస్థలికి చేరుకొని బధారియా పోలీసులకు సమాచారం అందించాం. కానీ, వారు ఈ కేసు తమ పోలీస్ స్టేషన్​ పరిధిలోకి రాదని.. థావే పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందని చెప్పడం వల్ల మేము సంబంధిత పోలీసులకు సమాచారం ఇచ్చాం. దీంతో వారు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్​మార్టం పరీక్షలు నిర్వహించి మాకు అప్పగించారు." అని విపిన్​ కుమార్​ తండ్రి విష్ణు మాంఝీ తెలిపారు.

"సివాన్ జిల్లా బధారియా పోలీస్ స్టేషన్ పరిధిలోని గియాని మోర్‌లో విపిన్​ కుమార్​ తన స్నేహితులతో కలిసి మోమోస్​ తినే పందెం కాశాడు. ఈ క్రమంలో అతడి ఫ్రెండ్స్​ మోమోస్​ తినమని అతడిని కోరారు. దీంతో అతడు 150 వరకు మోమోస్​ తిని తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతడు అక్కడే ప్రాణాలు విడిచాడు. అంత పెద్ద మొత్తంలో ఒకేసారి మోమోస్​ తినడం వల్లే విపిన్​ ఆరోగ్యం క్షీణించి మరణించాడని భావిస్తున్నాం. అయితే పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాతే మరణానికి గల కారణాలు తెలుస్తాయి."

- శశిరంజన్, థావే పోలీసు స్టేషన్​ చీఫ్

Last Updated :Jul 16, 2023, 6:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.