గాల్వన్​ లోయకు ఆ పేరెలా వచ్చిందో తెలుసా?

author img

By

Published : Jun 16, 2020, 6:08 PM IST

Updated : Jun 16, 2020, 7:24 PM IST

Why is the Galwan valley in Ladakh named after a Kashmiri?

భారత్​-చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ అందరి దృష్టి వాస్తవాధీన రేఖకు సమీపంలోని గాల్వన్​ లోయపైనే ఉంది. అసలింతకీ.. ఈ ప్రాంతానికి గాల్వన్​ అన్న పేరు ఎలా వచ్చింది? అసలు దీని చరిత్ర ఏంటి?. స్థానిక పూర్వీకులు, చరిత్రకారులను సంప్రదించి 'ఈటీవీ భారత్'​ సమాచారం సేకరించింది. అదేంటంటే?

గాల్వన్​ లోయ.. భారత్​-చైనా సరిహద్దు ఉద్రిక్తతల నడుమ ప్రస్తుతం ఈ ప్రాంతం చర్చనీయాంశంగా మారింది. వాస్తవాధీన రేఖ (ఎల్​ఏసీ) వద్ద ఉన్న ఈ వ్యాలీలోనే సోమవారం రాత్రి ఘర్షణ చెలరేగి ముగ్గురు భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. పరిస్థితులు ఇలానే కొనసాగితే.. రెండు అణ్వాయుధ దేశాల మధ్య ఘర్షణ ఎటు దారితీస్తుందో అన్న ఆందోళన నెలకొంది. ​ఈ ఘర్ణణకు నెలవైన ఈ ప్రాంతానికి గాల్వన్​ అన్న పేరు ఎలా వచ్చిందో కనుక్కుంది ఈటీవీ-భారత్​. ఇందుకోసం పలువురు చరిత్రకారులు, స్థానిక పూర్వీకులను సంప్రదించింది.

'గాల్వన్'​ ఓ కశ్మీరీ ఇంటిపేరు

ఎల్​ఏసీ సమీపంలోని ఈ వ్యాలీ వద్ద గాల్వన్​ అనే నది ప్రవహిస్తుంది. హిమాలయాల్లోని కారాకోరంలో పుట్టి అక్సాయిచిన్​ గుండా ఉత్తరదిశగా 80 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది గాల్వన్​. అనంతరం తూర్పు లద్దాక్​​లోని షయోక్​ నదిలో కలుస్తుంది. 1962లో భారత్​-చైనా యుద్ధ సమయంలోనూ ఈ గాల్వన్​ లోయ గురించి చర్చ జరిగింది. ఓ కశ్మీరీ ఇంటిపేరు అయిన గాల్వన్.. ఆ తర్వాత ఈ ప్రాంతం పేరుగా రూపాంతరం చెందినట్లు 'ఈటీవీ భారత్'​ రిపోర్టులో తేలింది.

​ 'గులాం రసూల్​ షా' అనే కశ్మీరీ ఇంటిపేరున గాల్వన్​ రూపాంతరం చెందినట్లు అతని మనవడు అయిన మహమ్మద్​ అమిన్​ గాల్వన్​.. ఈటీవీ-భారత్​కు వెల్లడించారు. గులాం రసూల్​ షానే.. గాల్వన్​ అని కూడా పిలిచేవారని అమిన్​ స్పష్టం చేశారు. డోగ్రా పాలకుల భయంతో గాల్వన్ ముత్తాత కర్రా గాల్వన్​ కశ్మీర్​ను విడిచిపెట్టి బాల్టిస్థాన్​లో స్థిరపడినట్లు చెప్పాడు అమిన్​.

" గులాం రసూల్​ 1878లో లేహ్​లో జన్మించారు. 12 ఏళ్ల వయసులో బ్రిటిష్​ ప్రయాణికులు, అన్వేషకులకు లద్దాఖ్​, హిమాలయాల గుండా మధ్య ఆసియాకు వెళ్లేందుకు మార్గనిర్దేశం చేసేవాడు. రసూల్​ కుటుంబమంతా లేహ్​లోనే స్థిరపడింది. అయితే డోగ్రా పాలకుల భయంతో కర్రా గాల్వన్​ కశ్మీర్​ను విడిచి బాల్టిస్థాన్​లో స్థిరపడ్డారు."

- మహమ్మద్​ అమిన్​, గాల్వన్​ వంశీయుడు

గతకొద్ది రోజులుగా భారత్​-చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులతో ప్రజలు ఆందోళన చెందుతున్నారని చెప్పారు అమిన్​.

"కొన్నివారాలుగా వాస్తవాధీన రేఖ వైపుగా భారత బలగాల మోహరింపు కూడా ఎక్కువైంది. ఏది ఏమైనా లద్దాఖ్​ ప్రజలందరూ భారత సైన్యానికే మద్దతుగా ఉంటారు. ఎలాంటి సాయం కావాలన్నా చేసేందుకు సిద్ధంగా ఉన్నారు."

- మహమ్మద్​ అమిన్​, గాల్వన్​ వంశీయుడు

గాల్వన్​ ప్రాంత చరిత్రను తెలుసుకునేందుకు రెండు వారాల క్రితం చరిత్రకారుడైన గని షేక్​నూ సంప్రదించింది ఈటీవీ భారత్​. ఆయన కూడా అమిన్​ చెప్పిన కథనే చెప్పారు.

Last Updated :Jun 16, 2020, 7:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.