ETV Bharat / bharat

ఎన్నికలు జరిగే 4 రాష్ట్రాలపై వరాల జల్లు

author img

By

Published : Feb 1, 2021, 2:43 PM IST

త్వరలో ఎన్నికలు జరగనున్న తమిళనాడు, బంగాల్‌, అసోం, కేరళ రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి నిధుల వరద పారనుంది. ఆ నాలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ.2.5 లక్షల కోట్లతో జాతీయ రహదారులను అభివృద్ధి చేయనున్నట్లు వార్షిక బడ్జెట్​లో భాగంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు.

Union Budget
ఎన్నికలు జరిగే 4 రాష్ట్రాలపై వరాల జల్లు

త్వరలో ఎన్నికలు జరగనున్న తమిళనాడు, బంగాల్​, కేరళ, అసోంపై వార్షిక బడ్జెట్​లో ప్రధానంగా దృష్టి సారించింది కేంద్రం. ఆయా రాష్ట్రాలకు జాతీయ రహదారుల మౌలిక సదుపాయాల ప్రణాళికను ప్రకటించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​. నాలుగు రాష్ట్రాల్లో దాదాపు 7 వేల కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణానికి.. రూ. 2.5 లక్షల కోట్లకుపైగా నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు.

రాష్ట్రాల వారీగా..

  • తమిళనాడులో 3,500 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి రూ.1.03 లక్షల కోట్లు
  • కేరళలో 1,500 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి రూ.65 వేల కోట్లు
  • బంగాల్​లో 675 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి రూ.95వేల కోట్లు
  • అసోంలో 1,300 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి రూ.3,400 కోట్లు

రూ.5.35 లక్షల కోట్ల విలువైన భారత్​మాల ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే 13వేల కిలోమీటర్ల రోడ్లు నిర్మాణం పూర్తయినట్లు చెప్పారు నిర్మల. 2022 నాటికి మరో 8,500 కిలోమీటర్ల రోడ్లు కేటాయించనున్నట్లు చెప్పారు. జాతీయ రహదారి కారిడార్​లో భాగంగా అదనంగా 11,000 కిలోమీటర్లు నిర్మించనున్నట్లు తెలిపారు. రూ.5వేల కోట్ల విలువైన ఐదు ఆపరేషనల్​ రోడ్డు ప్రాజెక్టులను జాతీయ రహదారి ప్రాధికార సంస్థ (ఎన్​హెచ్​​ఏఐ)కి బదిలీ చేయనున్నట్లు తెలిపారు ఆర్థిక మంత్రి. సుమారు రూ.7వేల కోట్లు విలువైన విద్యుత్తు ట్రాన్స్​మిషన్​ ఆస్తులు.. జాతీయ పవర్​ గ్రిడ్​ కార్పొరేషన్​కు అప్పగిస్తామన్నారు.

టైర్​-2, టైర్​-3 పట్టణాల్లోని విమానాశ్రయాలను ప్రైవేటీకరిస్తామని తెలిపారు ఆర్థిక మంత్రి. పబ్లిక్​-ప్రైవేటు భాగస్వామ్య విధానంలో 2021-22 ఏడాదికి గాను రూ.2 వేల కోట్ల విలువైన ఏడు నౌకాశ్రయ ప్రాజెక్టులను ప్రధాన పోర్టుల్లో చేపట్టనున్నామని వెల్లడించారు.

టీ-కార్మికుల సంక్షేమానికి రూ.వెయ్యి కోట్లు

ఎన్నికలు జరగనున్న అసోం, బంగాల్​ రాష్ట్రాల్లోని తేయాకు పరిశ్రమ కార్మికుల సంక్షేమం కోసం రూ. 1000 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​. వారికోసం ప్రత్యేక పథకాన్ని తీసుకొస్తున్నట్లు చెప్పారు. ప్రత్యేకంగా మహిళలు, వారి పిల్లల సంక్షేమానికి పెద్దపీట వేయనున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి: కరెంట్​, గ్యాస్​ విషయంలో సామాన్యుడికి కొత్త శక్తి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.