ETV Bharat / bharat

పాక్‌లో బాంబు పేలితే ఇక్కడ ధర్నాలా?: సుప్రీం ఆగ్రహం

author img

By

Published : Feb 22, 2020, 6:32 AM IST

Updated : Mar 2, 2020, 3:38 AM IST

పాకిస్థాన్‌ స్కూల్‌లో బాంబు పేలింది అని.. నేపాల్‌లో భూకంపం వచ్చింది అని భారత్‌లో ధర్నాలు చేయడమేంటీ? అంటూ ఉత్తరాఖండ్‌లోని కొందరు న్యాయవాదులపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకో తెలుసుకోండి.

supreme-court-anger-on-dehradun-lawyers
పాక్‌లో బాంబు పేలితే ఇక్కడ ధర్నాలా?: సుప్రీం ఆగ్రహం

ఉత్తరాఖండ్‌లోని దెహ్రాదూన్‌, హరిద్వార్‌, ఉదమ్‌ సింగ్‌ నగర్‌లోని కొన్ని కోర్టుల్లో గత 35ఏళ్లుగా కొందరు న్యాయవాదులు ప్రతి శనివారం విచిత్ర కారణాలతో ధర్నాలు, విధుల బహిష్కరణకు దిగుతున్నారట. లా కమిషన్‌ చేపట్టిన ఓ అధ్యయనంలో ఈ విషయం తేలింది. లాయర్ల ధర్నాలు కోర్టుల పనితీరుపై తీవ్ర ప్రభావం చూపించడమేగాక, పెండింగ్‌ కేసులు నానాటికీ పెరిగిపోయాయి. దీంతో న్యాయ కమిషన్‌ ఈ విషయాన్ని ఉత్తరాఖండ్‌ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చింది. ఇందుకు సంబంధించి ఓ నివేదికను కూడా న్యాయస్థానానికి సమర్పించింది.

విచిత్ర కారణాలు..

2012-16 మధ్యకాలంలో దెహ్రాదూన్‌ జిల్లాలో న్యాయవాదులు మొత్తంగా 455 రోజులు ధర్నాలు చేయగా.. హరిద్వారా జిల్లాలో 515 రోజులు లాయర్లు విధులు బహిష్కరించి ఆందోళనలకు దిగినట్లు లా కమిషన్‌ నివేదికలో పేర్కొంది. ఇక న్యాయవాదుల ధర్నాకు గల కారణాలు ఇంకా విచిత్రంగా ఉన్నాయి. పాకిస్థాన్‌ స్కూల్‌లో బాంబు పేలిందని, శ్రీలంకలో రాజ్యాంగ సవరణలు చేశారని, నేపాల్‌లో భూకంపం వచ్చిందని, ఆ భూకంపంలో న్యాయవాదుల బంధువులు చనిపోయారని, భారీ వర్షాలు కురిశాయని, కవి సమ్మేళనాలు జరుగుతున్నాయని ఇలా అసంబద్ధ కారణాలతో లాయర్లు ఆందోళనలు చేపట్టినట్లు నివేదిక వెల్లడించింది.

చట్టవిరుద్ధం

నివేదికను పరిశీలించిన హైకోర్టు సదరు న్యాయవాదులపై ఆగ్రహించింది. ఇలాంటి ధర్నాలు చట్టవిరుద్ధమని తీర్పు వెలువరించింది. అయితే ఈ తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో అప్పీల్‌ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా, జస్టిస్‌ ఎంఆర్‌ షాలతో కూడిన ధర్మాసనం ధర్నాలపై విచారం వ్యక్తం చేసింది. ‘ఇలాంటివి దేశంలో చాలా చోట్ల జరుగుతున్నాయి. న్యాయవాదులు ప్రతి శనివారం ధర్నాలు చేయొచ్చని బార్‌ అసోసియేషన్‌ ఎలా చెబుతుంది? న్యాయవాదుల కుటుంబసభ్యులు చనిపోతే లాయర్లంతా ఎలా ఆందోళన చేస్తారు. ఇదేమైనా జోకా..? ఇలాంటి వాటిని మేం ఎన్నటికీ అనుమతించబోం. ఈ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు పూర్తిగా న్యాయపరమైనదే’ అని ధర్మాసనం స్పష్టం చేసింది.

Last Updated : Mar 2, 2020, 3:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.