ETV Bharat / bharat

'కరోనా' భయం గుప్పిట్లో ఆ రాష్ట్ర ప్రజలు

author img

By

Published : Mar 13, 2020, 9:36 PM IST

కరోనా కేసుల సంఖ్య నానాటికి పెరుగుతున్న తరుణంలో కేరళ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వైరస్​ భయంతో కాలం వెళ్లదీస్తున్నారు. వైరస్​ బాధితులకు చికిత్స అందించే నర్సులను ఇల్లు ఖాళీ చేయాలని యజమానులు అంటున్నారంటే ప్రజలు ఎంతమేరకు భయపడుతున్నారో అర్థం చేసుకోవచ్చు.

Panic after neighbour of coronavirus patient dies in Kerala
కరోనా భయం గుప్పిట్లో ఆ రాష్ట్ర ప్రజలు

దేశంలోనే తొలి కరోనా కేసు నమోదైన కేరళలో ప్రస్తుతం ప్రజలు భయం గుప్పిట్లో రోజులు గడుపుతున్నారు. ఏ చిన్న వార్త వినిపించినా ఆందోళన చెందుతున్నారు. కరోనా బాధితులను కలిసిన వ్యక్తులు, వైద్యం అందించే డాక్టర్లు, నర్సులను చూస్తే ఆమడ దూరం పరిగెడుతున్నారు. కొట్టాయం జిల్లాలో నర్సులను ఇల్లు ఖాళీ చేయాలని యజమానులు అంటున్నారు. ప్రజల్లో భయానికి ఈ పరిస్థితి అద్దం పడుతోంది.

రాష్ట్రంలో ఇప్పటి వరకు 22 కేసులు నమోదయ్యాయి. 270 మంది నిర్బంధ కేంద్రాల్లో ఉన్నారు. 4,180 మందిని పరిశీలనలో ఉంచారు. 22 మందిని ప్రత్యేక వార్డుల్లో ఉంచి వైద్యం అందిస్తున్నారు.

పక్కింటి వ్యక్తి మరణంతో..

కేరళ కొట్టాయం జిల్లా చెంగళం గ్రామంలో కరోనా బాధితుడి పొరుగింటిలో ఉండే వ్యక్తి శుక్రవారం మరణించాడు. అతడ్ని కొన్ని రోజులుగా నిర్బంధంలో ఉంచగా శుక్రవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఆస్పత్రికి తరలించే క్రమంలో ప్రాణాలు కోల్పోయాడు. ఆ వ్యక్తి మరణంతో చెంగళం గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కరోనా మహమ్మారి తమ గ్రామాన్ని చుట్టుముడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అయితే.. చనిపోయిన వ్యక్తి కరోనాతో మరణించలేదని, గుండె పోటుతో మరణించినట్లు భావిస్తున్నామని జిల్లా పాలనాధికారి పీకే సుధీర్​బాబు వెల్లడించారు. శవ పరీక్ష, కరోనా నమూనా పరీక్షల ఫలితాల తర్వాతే అసలు విషయం తెలుస్తుందని.. అతని కుమారుడే కరోనా సోకిన వ్యక్తిని కలిశాడు కానీ అతను కాదని స్పష్టం చేశారు.

ఇల్లు ఖాళీ చేయించిన యజమాని...

కొట్టాయం వైద్య కళాశాల ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్న ముగ్గురు నర్సులకు చేదు అనుభవం ఎదురైంది. తాము అద్దెకు ఉంటున్న ఇల్లు ఖాళీ చేయాలని ఇంటి యజమాని అన్నారు. కరోనా సోకిన వ్యక్తులకు వైద్యం అందించటమే కారణంగా తెలుస్తోంది. ఈ విషయం జిల్లా పాలనాధికారికి చేరడం వల్ల వారికి వైద్య కళాశాల క్వార్టర్స్​లోనే ఏర్పాట్లు చేసినన్నట్లు తెలిపారు.

కొట్టాయం వైద్య కళాశాలలో ప్రస్తుతం ముగ్గురు పాజిటివ్​ కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.

తగ్గిన తాకిడి..

కేరళ శబరిమలలోని అయ్యప్ప ఆలయం ప్రత్యేక పూజల కోసం ఈ రోజు తెరుచుకుంది. ఈనెల 18 వరకు భక్తుల దర్శనానికి అవకాశం కల్పించనున్నారు. అయితే.. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో ఆలయానికి భక్తుల తాకిడి తగ్గనుంది. శుక్రవారం చాలా కొద్ది మంది మాత్రమే స్వామివారి దర్శనానికి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. అందులోనూ ఎక్కువ మంది ఇతర రాష్ట్రాలకు చెందినవారేనని పేర్కొన్నారు. ఆలయానికి వచ్చిన వారికి పంబలోనే పరీక్షలు నిర్వహించి కరోనా లక్షణాలు లేవని నిర్ధరించిన తర్వాతే అనుమతించనున్నారు.

ఇదీ చూడండి: సుప్రీంలో ఇకపై అత్యవసర కేసులు మాత్రమే విచారణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.