పుల్వామా ఉగ్రదాడి, కశ్మీర్ స్వయం ప్రతిపత్తి ఉపసంహరణ వంటి పరిణామాల తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. అధికరణ 370 రద్దుపై అక్కసును వెళ్లగక్కుతూ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ యుద్ధ భాషణ చేస్తున్నారు. ఈ పరిణామాల వల్ల యుద్ధం మొదలైతే అది అణుసంగ్రామానికి దారి తీస్తుందని హెచ్చరించారు.
యుద్ధం వస్తే...
ఈ నేపథ్యంలో ఒకవేళ ఇరు దేశాల మధ్య అణు యుద్ధం సంభవిస్తే.. అన్న ప్రశ్నకు సమాధానం వెతికారు అమెరికాలోని రట్గర్స్ విశ్వవిద్యాలయం విద్యార్థులు. ఈ వివరాలను జర్నల్ సైన్స్ అడ్వాన్సెస్లో ప్రచురించారు.
"2025లో భారత్, పాక్ మధ్య యుద్ధం సంభవిస్తే.. సుమారు 10 కోట్ల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతారు. ఆ సమయానికి ఇరు దేశాల వద్ద 400 నుంచి 500 మధ్య అణ్వాయుధాలు ఉండే అవకాశముంది."
-అలాన్ రోబాక్, పరిశోధన విద్యార్థి
కలిగే నష్టాలు
ఈ అణ్వాయుధాల విస్ఫోటం వల్ల కలిగే పర్యవసానాలను తమ అధ్యయనంలో పొందుపరిచారు.
⦁ కొన్ని వారాల్లోనే సుమారు 16 నుంచి 36 మిలియన్ టన్నుల పొగ ప్రపంచ వాతావరణాన్ని కప్పేస్తుంది. ఈ పొగ 10 ఏళ్లు దాటినా వాతావరణాన్ని వీడదు.
⦁ సూర్యుని నుంచి రేడియేషన్ గ్రహించి గాలిని వేడెక్కిస్తుంది.
⦁ భూమిని చేరే సూర్యుని కాంతి 20-35 శాతం క్షీణిస్తుంది. ఫలితంగా 2-5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు పడిపోతాయి.
⦁ వర్షపాతం 15 నుంచి 30 శాతం క్షీణిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 15-30 శాతం విస్తీర్ణంలో వృక్ష సంపద నశిస్తుంది.
⦁ సముద్రాల నుంచి ఆహారోత్పత్తి 5 నుంచి 15 శాతం తగ్గిపోతుంది.
⦁ రెండు దేశాల్లో చూస్తే 50 నుంచి 125 మిలియన్ల ప్రజలు మరణించే అవకాశం ఉంది. ప్రపంచంపై పడే ఈ యుద్ధ ప్రభావంతో ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుంది.
ప్రపంచంలో 9 దేశాల వద్ద అణ్వాయుధాలు ఉన్నాయి. అయితే భారత్, పాక్ మాత్రమే వేగంగా వీటి సంఖ్యను పెంచుకుంటున్నాయని రోబాక్ పేర్కొన్నారు. కశ్మీర్ విషయంలో ఇరుదేశాల మధ్య యుద్ధం తలెత్తే పరిస్థితి ఏర్పడితే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయన్నారు. వీటిని రెండు దేశాలు గుర్తించాలని సూచించారు.
పరిశోధకుల అంచనా ప్రకారం.. 2025 నాటికి ప్రపంచంలో అణ్వాయుధాలు 15 వేల టన్నుల సామర్థ్యానికి చేరుకుంటాయి.
ఇదీ చూడండి: పాక్ ఆధారిత ఉగ్రసంస్థలతో భారత్కు ముప్పు: అమెరికా