ETV Bharat / bharat

ఆగస్టు చివరి నాటికి 'ఏకే-203' రైఫిళ్ల ఒప్పందం!

author img

By

Published : Aug 14, 2020, 3:00 PM IST

AK 203 assault rifles deal
ఏకే-203 రైఫిల్

సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో రష్యాతో ఏకే-203 రైఫిల్ కొనుగోలు ఒప్పందాన్ని భారత్ వేగవంతం చేస్తోంది. ఈ నెల చివరి నాటికి రెండు దేశాల మధ్య అంతర ప్రభుత్వ ఒప్పందం (ఐజీఏ) ఖరారయ్యే అవకాశం ఉంది. 2018లో ప్రతిపాదించిన ఈ ఒప్పందం.. ధర, సాంకేతిక బదిలీ అంశాల్లో విభేదాల కారణంగా మరుగున పడిపోయింది.

వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఏసి) వెంబడి చైనాతో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. కశ్మీర్ నుంచి ఈశాన్య రాష్ట్రాల వరకూ ఉగ్రవాదుల చొరబాట్లతో సమస్యలు నెలకొన్నాయి. ఈ పరిస్థితుల్లో ఆయుధాల కొనుగోలు ఒప్పందాలపై భారత్ దృష్టి సారించింది.

రష్యాతో 2019 ఫిబ్రవరి 18న అంతర్​ ప్రభుత్వ ఒప్పందం (ఐజీఏ) జరిగిన ఏకే-203 రైఫిళ్ల కొనుగోలును వేగవంతం చేయాలని భారత్ భావిస్తోంది. ఆగస్టు చివరినాటికి రెండు దేశాల మధ్య ఒప్పందాన్ని అధికారికంగా ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయి.

అనుమతుల ప్రక్రియ పూర్తి..

రష్యాలో ఆగస్టు 23-29 మధ్య జరిగే 'ఆర్మీ-2020' కార్యక్రమానికి భారత రక్షణ శాఖ కార్యదర్శి వెళ్లనున్నారు. ఈ సమయంలోనే 'కొనుగోలు, తయారీ' మార్గంలో ఒప్పందంపై అధికారికంగా సంతకాలు చేసే అవకాశం ఉంది.

ఏకే 203 రైఫిళ్ల కొనుగోలును వేగవంతం చేసేందుకు కావాల్సిన అనుమతులకు రక్షణ శాఖ సమీకరణ మండలి (డీఏసీ) మంగళవారం పచ్చజెండా ఊపింది. ఈ కొనుగోలు ఒప్పందం పూర్తయితే అసాల్ట్ రైఫిళ్ల కోసం భారత్ సుదీర్ఘ నిరీక్షణ ​ఫలిస్తుంది.

ఆర్మీ-2020

ఆర్మీ- 2020.. రష్యా ప్రభుత్వం నిర్వహిస్తున్న అంతర్జాతీయ సైన్యం, సాంకేతిక ఫోరం ఇది. అంతర్జాతీయ సైన్యం, సాంకేతిక సహకారం బలోపేతంపై చర్చించేందుకు ఈ వేదికను ఏర్పాటు చేశారు. ఆర్మీ-2020తో పాటు 'అంతర్జాతీయ సైనిక క్రీడలు-2020'ను నిర్వహిస్తారు. ఈ సారి భారత్​ ఇందులో పాల్గొనటం లేదు.

ఒప్పంద ప్రక్రియలో మలుపులు..

రష్యాతో రూ.12,280 కోట్లతో 7.40 లక్షల రైఫిళ్ల కొనుగోలుకు భారత రక్షణ శాఖ 2018 ఫిబ్రవరి 13న అంగీకారం తెలిపింది. 2018 అక్టోబర్​లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన సందర్భంగా ఏకే 203 రైఫిళ్ల కొనుగోలుకు సిద్ధమని ప్రకటించింది.

2019 ఫిబ్రవరి 18 నాటి ఐజీఏ తర్వాత ఈ ఒప్పందంలో పురోగతి లేదు. రైఫిల్​ ధర, సాంకేతిక సహకారం బదిలీకి సంబంధించి రెండు దేశాల మధ్య ఏర్పడిన విభేదాలే ఇందుకు కారణం. ప్రస్తుతం ఈ విభేదాలు తొలగిపోయినట్లు తెలుస్తోంది.

రెండు దేశాల భాగస్వామ్యంతో..

ఒప్పందం కుదిరితే లక్ష రైఫిళ్లను రష్యా నుంచి నేరుగా కొనుగోలు చేస్తుంది భారత్. మిగితావి ఏడాదికి 75 వేల రైఫిళ్ల చొప్పున ఉత్తర్​ప్రదేశ్​ అమేఠీలోని కోర్వా కర్మాగారంలో ఉత్పత్తి చేస్తారు. వీటిని 'ఇండో రష్యా రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్'​ ఉత్పత్తి చేస్తుంది.

ఇందులో భారత్​లోని ఆర్డినెన్స్​ ఫ్యాక్టరీ బోర్డు 50.5 శాతం పెట్టుబడులు పెడుతుండగా.. కలాశ్​నికోవ్​ కాన్సర్న్​, రోసోబరోన్​ఎక్స్పోర్ట్ సంస్థలు వరుసగా 42 శాతం, 7.5 శాతం అందిస్తాయి. ఏకే 203 రైఫిళ్లకు సంబంధించి మరో దేశానికి రష్యా సాంకేతికత బదిలీ చేయటం ఇదే తొలిసారి.

ఇన్​సాస్​ స్థానంలో..

క్షేత్రస్థాయి సైనికుల అవసరాలను సమర్థమైన ఈ బేసిక్​ రైఫిళ్లు తీర్చనున్నాయి. ప్రస్తుతం సైనికుల వద్ద ఉన్న దేశీయంగా తయారు చేసిన ఇన్​సాస్​ రైఫిళ్లను ఇవి భర్తీ చేస్తాయి. ఇన్​సాస్​ పనితనంపై అనేక ఫిర్యాదులు వచ్చాయి.

ఏకే గన్స్​ శ్రేణిలో 203 మోడల్ చాలా అధునాతనమైనది. ప్రపంచవ్యాప్తంగా ఈ స్థాయి తుపాకుల్లో ఇదే అగ్రగామి. ఏకే 103, ఏకే 15 కన్నా భారత సైనికుల అవసరాలను తీర్చగల శక్తి ఏకే 203కు ఉందని విశ్లేషకులు అంటున్నారు. అయితే భారత్​ దిగుమతి చేసుకునే మోడల్​.. అసలు ఏకే 203 కన్నా కొద్దిగా భిన్నమైనదని తెలుస్తోంది.

ప్రత్యేకతలు..

4 కిలోల బరువు ఉండే ఈ ఏకే 203 గన్​.. ఆటోమేటిక్, సెమీ ఆటోమేటిక్ మోడ్​లలో పనిచేయగలదు. సెకనుకు 10 తూటాలను పేలుస్తుంది. దీని ప్రభావ పరిధి (ఎఫెక్టివ్ ఫైరింగ్ రేంజి) 500 మీటర్లు ఉంటుంది.

(రచయిత- సంజీవ్ బారువా)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.