టిక్టాక్ సరదా ఐదుగురు పిల్లల నిండు ప్రాణాలు బలితీసుకుంది. ఈ విషాద ఘటన వారణాసిలో జరిగింది. ప్రమాదవశాత్తు గంగా నదిలో మునిగిన బాలుడిని కాపాడే ప్రయత్నంలో ఒకరి తరువాత ఒకరు నీట మునిగి ఐదుగురు చనిపోయారు. మృతులు 15 ఏళ్ల లోపు వారే కావడం వల్ల వారి కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
వారణాసికి చెందిన ఈ ఐదుగురు టిక్టాక్ వీడియోలు చేసేందుకు గంగా నది ఒడ్డుకు శుక్రవారం ఉదయం వెళ్లారు. ఒకరు నీటిలో మునిగి ఉంటే.. మరొకరు టిక్టాక్ వీడియో చేయాలనుకున్నారు. నదిలోతు గమనించని వారిలో ఒక బాలుడు ప్రమాదవశాత్తు నీటమునిగాడు. ఆ బాలుడిని కాపాడే ప్రయత్నంలో ఒకరి తరువాత మరొకరు నదిలో దూకి ప్రాణాలు పొగొట్టుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో ఐదుగురి మృత దేహాలను బయటకు తీశారు. పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాలను స్థానిక ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చూడండి:చైనాతో సరిహద్దుల వద్ద దూకుడుగానే సైన్యం!