ETV Bharat / bharat

డాన్​ దావూద్​కు కరోనా పాజిటివ్​పై సోదరుడి క్లారిటీ!

author img

By

Published : Jun 6, 2020, 9:49 AM IST

Dawood
డాన్​ దావూద్​

పాకిస్థాన్​కు పారిపోయిన మోస్ట్ వాంటెడ్​ అండర్​వరల్డ్​ డాన్​ దావూద్​ ఇబ్రహీంకు కరోనా సోకలేదని అతని సోదరుడు అనీస్​ వెల్లడించాడు. ఓ వార్తాసంస్థతో ఫోన్​లో మాట్లాడిన అనీస్ ఇబ్రహీం.. అతని కుటుంబం క్షేమంగానే ఉన్నట్లు తెలిపాడు.

మోస్ట్​ వాంటెడ్​ క్రిమినల్​, అండర్​వరల్డ్​ డాన్​ దావూద్​ ఇబ్రహీంకు కరోనా పాజిటివ్​ అన్న వార్తలను అతని సోదరుడు అనీస్​ ఇబ్రహీం ఖండించాడు. దావూద్​తో పాటు అతని భార్యకు కరోనా సోకిందని, కరాచిలోని ఓ సైనిక ఆసుపత్రిలో చేరినట్లు నిఘా వర్గాలు నివేదించాయి. అతని సహాయకులు, భద్రతా సిబ్బంది క్వారంటైన్​లో ఉన్నట్లు తెలిపాయి.

అయితే ఈ వార్తలు అవాస్తమని దావూద్​ డీ-కంపెనీ అండర్​వరల్డ్​ కార్యాకలాపాలను నిర్వహించే అనీస్​ స్పష్టం చేశాడు. ఓ ఆంగ్ల వార్తా సంస్థతో ఫోన్​లో మాట్లాడిన అనీస్​ ఈ విషయాన్ని వెల్లడించాడు. ఇదే సమయంలో యూఏఈతోపాటు పాకిస్థాన్​లో వ్యాపారాన్ని నడుపుతున్నట్లు అంగీకరించాడు.

"భాయ్​ (దావూద్​) క్షేమంగా ఉన్నాడు. షకీల్​ కూడా బాగానే ఉన్నాడు. ఎవరికీ కరోనా వైరస్​ పాజిటివ్​గా తేలలేదు. కుటుంబంలో ఎవరూ ఆసుపత్రిలో చేరలేదు."

- ఫోన్​లో అనీస్​

డీ- కంపెనీకి చెందిన కీలక వ్యక్తి, షార్ప్ షూటర్​ చోటా షకీల్​ కూడా కరాచిలోనే ఉన్నాడు. అయితే అనీస్​ ఎక్కడినుంచి మాట్లాడుతున్నాడో మాత్రం చెప్పేందుకు నిరాకరించాడు.

కరాచిలోనే దావూద్​..

దావూద్​ ఇబ్రహీం కస్కడ్​ అనేక తీవ్ర కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. 1993 ముంబయి వరుస పేలుళ్లలో కీలక సూత్రధారిగా వ్యవహరించాడు. అయితే దావూద్​తో పాటు అతని కుటుంబాన్ని పాక్​ నిఘా సంస్థ ఐఎస్​ఐ ఆశ్రయం ఇచ్చి కరాచిలో దాచిపెట్టినట్టు భారత్​ ఆరోపిస్తోంది. అయితే పాక్​ మాత్రం వీటిని కొన్నేళ్లుగా ఖండిస్తోంది.

దావూద్​ కుటుంబం 1994 నుంచి కరాచీలోనే ఉంటోంది. దావూద్​ కుమార్తె మారుఖ్​ను పాక్​ ప్రముఖ క్రికెటర్​ జావేద్​ మియాందాద్​ కుమారుడికి ఇచ్చి వివాహం చేశాడు.

సంజయ్​ వివాదం నుంచి..

బాలీవుడ్​ నటుడు సంజయ్​ దత్​ నివాసం ఎదుట 1990లో ఆయుధాలతో నిండిన వాహనాన్ని పార్క్​ చేసినప్పటి నుంచి అనీస్​ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. దుబాయ్​ వేదికగా బాలీవుడ్​ చిత్రాలకు నిధులు సమకూర్చినట్లు, క్రికెట్​ బెట్టింగ్​లు.. ఇలా అతనిపై చాలా కేసులు ఉన్నాయి. భారత ఏజెన్సీల నుంచి తప్పించుకునేందుకు కొన్నేళ్ల కింద సౌదీ అరేబియాలో నిర్బంధంలో ఉన్నట్లు సమాచారం.

పాక్ కేంద్రంగా వ్యాపారాలు..

డీ-కంపెనీ కార్యకలాపాలు కరాచీ నుంచే జరుగుతున్నట్లు ఐరాసతోపాటు ఇంటర్​పోల్​కు భారత్​ నివేదించింది. కరాచీ విమానాశ్రయం నుంచి అఫ్గానిస్థాన్​కు రవాణా వ్యాపారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందించింది. ఇందులో పనిచేసే వ్యక్తులు హెరాయిన్​ వంటి మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్నట్లు ఆరోపించింది.

కొన్నేళ్లకు దావూద్​, అతని సోదరుడు పాకిస్థాన్​, యూఏఈలోని హోటల్​, రిసార్ట్​ వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టారు. సింధ్​ రాష్ట్రంలో దావూద్​కు షాపింగ్​ మాల్స్​ ఉన్నాయి. పాక్​లోని హైదరాబాద్​ సమీపంలో ఉన్న కొట్రి కాగితపు కర్మాగారం దావూద్​దేనని తెలుస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.