ETV Bharat / bharat

కరోనాతో ఖైదీలకు పెరోల్​.. సుప్రీం కీలక సూచనలు

author img

By

Published : Mar 23, 2020, 5:12 PM IST

SC directs states, UTs to set up panel to consider release of prisoners on parole
పెరోల్​పై ఖైదీల విడుదలకు సుప్రీం సన్నద్ధం

కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా కారాగారాల్లో ఖైదీల రద్దీని తగ్గించేందుకు సిద్ధమైంది సుప్రీంకోర్టు. పెరోల్​పై ఖైదీలను విడుదల చేసే అంశంపై అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పలు మార్గదర్శకాలను జారీ చేసింది అత్యున్నత న్యాయస్థానం. ఇందుకోసం రాష్ట్రాల పరిధిలో ఉన్నత స్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించింది.

కరోనా విజృంభిస్తున్న వేళ దేశవ్యాప్తంగా జైళ్లలోని ఖైదీల ఆరోగ్య దృష్ట్యా వారి సంఖ్యను తగ్గించేందుకు నడుం బిగించింది సుప్రీంకోర్టు. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పలు సూచనలు జారీ చేసింది. ఖైదీల మధ్య సామాజిక దూరాన్ని పెంచేందుకు కొందరిని నాలుగు నుంచి ఆరు వారాల పాటు పెరోల్‌పై పంపాలని ఆదేశించింది. ఈ మేరకు చీఫ్​ జస్టిస్​ ఎస్​ఏ బోబ్డె నేతృత్వంలోని ధర్మాసనం కీలక నిర్ణయం తీసుకుంది.

పెరోల్‌పై బయటకు పంపే ఖైదీలను గుర్తించేందుకు రాష్ట్రాల పరిధిలో ఉన్నత స్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించింది. ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడిన వారికి పెరోల్‌ ఇవ్వవచ్చని తెలిపింది. పెరోల్‌పై ఖైదీల విడుదలకు సంబంధించి రాష్ట్ర న్యాయ సేవ అథారిటీతో కలిసి ఉన్నతస్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలని పేర్కొంది.

"ప్రతి రాష్ట్రంలో హోంశాఖ కార్యదర్శి, ఛైర్మన్, రాష్ట్ర న్యాయ సేవ అథారిటీతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలి. వీరు నాలుగు నుంచి ఆరు వారాల పాటు పెరోల్‌పై ఏఏ ఖైదీలను విడుదల చేయాలనేది నిర్ణయిస్తారు."

- సుప్రీంకోర్టు

మరోవైపు వైరస్​ కారణంగా కేసుల విచారణను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది సుప్రీం. అత్యవసర కేసుల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపడుతుందని స్పష్టం చేసింది.

ఇదీ చూడండి : లాక్​డౌన్​ దిశగా సుప్రీం- ఇక అత్యవసర విచారణలు మాత్రమే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.