ETV Bharat / bharat

ఫేస్​బుక్ సీఈఓకు కాంగ్రెస్ లేఖ, శివసేన గరం!

author img

By

Published : Aug 18, 2020, 3:43 PM IST

భాజపాకు ఫేస్​బుక్ అనుకూలంగా వ్యవహరిస్తోందంటూ చెలరేగిన రాజకీయ దుమారం కొనసాగుతోంది. భారత ప్రజాస్వామ్య ఎన్నికల్లో ఫేస్​బుక్ జోక్యం చేసుకుందని ఆరోపిస్తూ కాంగ్రెస్.. ఆ సంస్థ సీఈఓకు లేఖ రాసింది. దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. మరోవైపు శివసేన సైతం దీనిపై స్పందించింది. ద్వేషాన్ని వ్యాప్తి చేసే వారిపై.. పార్టీలతో సంబంధం లేకుండా చర్యలు తీసుకోవాలని ఫేస్​బుక్​కు హితవు పలికింది.

Cong writes to Facebook CEO over alleged "bias"; Demands probe into the conduct of India leadership team
ఫేస్​బుక్ లొల్లిపై సీఈఓకు కాంగ్రెస్ లేఖ, శివసేన గరం!

సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్​బుక్.. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించిందంటూ వచ్చిన ఆరోపణలు పెద్ద ఎత్తున దుమారానికి దారితీస్తున్నాయి. ఈ విషయంలో భాజపాపై తీవ్రస్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టిన కాంగ్రెస్​.. ప్రజాస్వామ్య ఎన్నికల్లో ఫేస్​బుక్ జోక్యం చేసుకుందని ఆరోపించింది. తాజాగా ఆ​ సంస్థ సీఈఓ మార్క్​ జుకర్​బర్గ్​కు లేఖ రాశారు కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్​. ఈ విషయంపై వెంటనే విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. భారత్​లోని ఫేస్​బుక్​ నాయకత్వం, వారి కార్యకలాపాలపై విచారణ జరపాలని స్పష్టం చేశారు.

దర్యాప్తును ప్రభావితం చేయకుండా ఉండాలంటే భారత కార్యకలాపాలకు కొత్త బృందాన్ని ఎంచుకోవాలని వేణుగోపాల్ పేర్కొన్నారు.

"ఫేస్​బుక్ ఇండియా నాయకత్వం, వారి కార్యకలాపాలపై ఫేస్​బుక్ ప్రధాన కార్యాలయం ఉన్నత స్థాయి విచారణ జరపాలి. ఒకటి, రెండు నెలల్లో నివేదికను ఫేస్​బుక్ బోర్డ్​కు అందించాలి. ఈ నివేదికను ప్రజలకు బహిరంగంగా అందుబాటులో ఉంచాలి."

-కేసీ వేణుగోపాల్, కాంగ్రెస్ అధికార ప్రతినిధి

కాంగ్రెస్ వ్యవస్థాపక నాయకులు ప్రాణత్యాగం చేసి కాపాడిన విలువలు, హక్కులను అడ్డుకునే కార్యక్రమంలో ఫేస్​బుక్ పాల్గొనవచ్చని కేసీ వేణుగోపాల్ ఎద్దేవా చేశారు. 2014 నుంచి ఫేస్​బుక్​లో చేసిన విద్వేషపూరిత పోస్టులను బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

"ముగ్గురు రాజకీయ నేతల విద్వేష ప్రసంగాలకు ఫేస్​బుక్ ఇండియా కావాలనే అనుమతిచ్చిందని వాల్​స్ట్రీట్ జర్నల్​ కథనం పేర్కొంది. ఆగస్టు 14న ప్రచురించిన ఈ కథనం ఆశ్చర్యకరమైనదేమీ కాదు. చాలా మంది ఫేస్​బుక్, వాట్సాప్ ఎగ్జిక్యూటివ్​లు పక్షపాత వైఖరితో ఉన్నారన్న విషయాన్ని కాంగ్రెస్ చాలా సార్లు లేవనెత్తింది."

-కేసీ వేణుగోపాల్, కాంగ్రెస్ అధికార ప్రతినిధి

భారత పార్లమెంట్​లో ఈ సమస్యను ఇతర రాజకీయ పార్టీలు ప్రస్తావించాయని వేణుగోపాల్ గుర్తు చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య ఎన్నికల్లో ఫేస్​బుక్ జోక్యంపై పార్లమెంట్ కమిటీతో విచారణ జరిపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసిందని తెలిపారు.

శివసేన..

ఫేస్​బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో విద్వేషాలను వ్యాప్తి చేసి దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకునే వారిపై పార్టీలకతీతంగా చర్యలు తీసుకోవాలని శివసేన డిమాండ్ చేసింది. అధికార పార్టీకి చెందినవారైనంత మాత్రాన ద్వేషాన్ని వ్యాప్తి చేసే వారిని ఫేస్​బుక్ విస్మరించకూడదని స్పష్టం చేసింది. వ్యాపార నియమాలు, నైతికతను పాటించాలని కోరింది. ఈ మేరకు పార్టీ పత్రిక సామ్నాలో సంపాదకీయం రాసుకొచ్చింది.

"ఫేస్​బుక్​ వంటి వేదికల్లో చర్చలు జరగడంపై ఎలాంటి అభ్యంతరం లేదు. అయితే ద్వేషాన్ని వ్యాప్తి చేసే భాషను ఉపయోగిస్తే... పార్టీ అనుబంధంతో సంబంధం లేకుండా చర్యలు తీసుకోవాలి. సామాజిక మాధ్యమాల్లో ఒకరిని కించపరచడం ఓ వృత్తిగా మారింది. మీరు(ఫేస్​బుక్) భారత్​కు వ్యాపారం చేసుకునేందుకు వచ్చారు. కాబట్టి వ్యాపార నీతి, నియమాలను పాటించాల్సి ఉంటుంది."

-సామ్నా పత్రికలోని సంపాదకీయం

రాజకీయాలు చాలా వరకు ఫేస్​బుక్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాల్లోనే జరుగుతున్నాయని శివసేన చెప్పుకొచ్చింది. ప్రపంచమంతా ఒక్కచోటికి వచ్చినప్పటికీ.. ఇలాంటి వేదికలు సమాజాల మధ్య విభజనకు కారణవుతున్నాయని పేర్కొంది.

ఇదీ చదవండి- ఏ రాజకీయ పార్టీకి అనుకూలం కాదు: ఫేస్​బుక్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.