ETV Bharat / bharat

'భాజపా పాలిత రాష్ట్రాల్లోనే దాక్కోవడం ఎందుకు?'

author img

By

Published : Jul 18, 2020, 5:56 PM IST

ఆడియో టేపుల ఉదంతం రాజస్థాన్​ రాజకీయాల్లో కాంగ్రెస్​, భాజపాల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. ఆ ఆడియో టేపులు నకిలీవని వాదిస్తున్న భాజపా.. ఈ రికార్డింగ్‌ ఘటన ద్వారా కాంగ్రెస్‌ ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడినట్లు తెలుస్తోందని ఆరోపించింది. దీనిపై స్పందించిన కాంగ్రెస్​.. ఆడియో టేపులు నకిలీవే అయితే, అసలు ఫోన్‌ ట్యాపింగ్‌ అంశం ఎందుకు తలెత్తిందని ప్రశ్నించింది. ​మరోవైపు సచిన్‌ పైలట్‌, ఆయనకు మద్దతుగా నిలిచిన ఎమ్మెల్యేలపైనా కాంగ్రెస్‌ ఈ సందర్భంగా విమర్శలు గుప్పించింది.

రాజస్థాన్‌ రాజకీయాల్లో ఆడియోటేపుల ఉదంతం కాంగ్రెస్‌, భాజపా మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది. ఓవైపు ఆడియో టేపులు నకిలీవని వాదిస్తున్న భాజపా.. ఈ రికార్డింగ్‌ ఘటన ద్వారా కాంగ్రెస్‌ ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడినట్లు స్పష్టమవుతోందని ఆరోపించింది. దీనిపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్‌ చేసింది. భాజపా ఆరోపణలపై స్పందించిన కాంగ్రెస్‌.. ఆడియో టేపులు నకిలీవే అయితే, అసలు ఫోన్‌ ట్యాపింగ్‌ అంశం ఎందుకు తలెత్తిందని ప్రశ్నించింది. దీంతో ఆడియో టేపుల్లో ఉన్నట్లుగా ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నించినట్లు భాజపా అంగీకరించిందని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి పవన్‌ ఖేరా ఆరోపించారు.

సచిన్‌ పైలట్‌, ఆయనకు మద్దతుగా నిలిచిన ఎమ్మెల్యేలపైనా కాంగ్రెస్‌ ఈ సందర్భంగా విమర్శలు గుప్పించింది. రాజస్థాన్‌ పోలీసుల కంటే సచిన్‌ పైలట్‌ హరియాణా పోలీసుల్నే ఎందుకు విశ్వసిస్తున్నారని పవన్‌ ఖేరా ప్రశ్నించారు. సొంత ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన తర్వాత సచిన్‌ పైలట్‌ వర్గం హరియాణాలోని మానేసర్‌లో ఉన్న ఓ హోటల్‌లో మకాం వేసింది.

దేశంలోనే తొలిసారి..

దేశ చరిత్రలో మొట్టమొదటిసారి ఒక రాష్ట్ర పోలీసు విభాగం విచారణకు వచ్చిన ఇంకో రాష్ట్ర పోలీసుల్ని అడ్డుకుందని పవన్‌ ఖేరా ఆరోపించారు. ఆడియో టేపుల ఆధారంగా ఎమ్మెల్యేల వాయిస్‌ శాంపిల్స్ తీసుకోవడానికి వచ్చిన రాజస్థాన్‌ పోలీసుల్ని హరియాణా పోలీసు విభాగం అడ్డుకుందన్నారు. అక్కడి నుంచి ఆ శాసనసభ్యులంతా తప్పించుకోవడానికి సహకరించిందని ఆరోపించారు. మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ నేతృత్వంలోని హరియాణా ప్రభుత్వ యంత్రాంగాన్ని భాజపా దుర్వినియోగపరుస్తోందన్నారు.

ఆ రాష్ట్రాల్లో ఉండాల్సిన అవసరమేంటి?

మరోవైపు రాజస్థాన్ హైకోర్టులో సచిన్‌ వర్గాన్ని కాంగ్రెస్‌ పార్టీ వారుగా భాజపా న్యాయవాదులు వాదిస్తున్నారని పవన్‌ ఖేరా తెలిపారు. అలాంటప్పుడు భాజపా అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో తలదాచుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఆడియో టేపుల ఆధారంగా నమోదైన ఎఫ్‌ఐఆర్‌లో పేర్లు లేని ఎమ్మెల్యేలు కూడా హోటల్‌ వెనకద్వారం నుంచి పారిపోయారని ఆరోపించారు. దీన్ని బట్టి ఇది భాజపా కుట్రేనని స్పష్టమవుతోందన్నారు.

పక్కదారి పట్టించేందుకే..

ప్రభుత్వాన్ని కూలదోసేందుకు యత్నించారని ఈ చర్యలతో వారు అంగీకరిస్తున్నారన్నారు. అందుకే ఆడియో రికార్డింగ్‌ ఎలా జరిగింది.. ఎందుకు జరిగిందంటూ అసలు విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. మరో భాజపా పాలిత రాష్ట్రమైన కర్ణాటకకు పైలట్‌ వర్గాన్ని తరలించేందుకు యత్నిస్తున్నట్లు తమకు సమాచారం ఉందన్నారు.

మానేసర్‌లో ఉన్న సచిన్‌ పైలట్‌ వర్గపు ఎమ్మెల్యేల్ని విచారించేందుకు శుక్రవారం రాజస్థాన్‌ స్పెషల్‌ ఆపరేషన్‌ గ్రూప్‌(ఎస్‌వోజీ) పోలీసులు వెళ్లారు. అయితే, అక్కడ వారిని హరియాణా పోలీసులు అడ్డుకున్నారు. ఈలోగా వారంతా హోటల్‌ వెనుకవైపు నుంచి వెళ్లిపోయారని ఓ కాంగ్రెస్‌ నేత తెలిపారు. దీంతో ఈరోజు ఎస్‌వోజీ పోలీసులు ఎలాంటి ఫలితం లేకుండానే రాజస్థాన్‌ తిరిగి వెళ్లినట్లు తెలిపారు.

ఇదీ చూడండి: 'భారత జీవన విధానాన్ని ప్రోత్సహించాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.