ETV Bharat / bharat

సామాజిక మాధ్యమాలను హోరెత్తించనున్న భాజపా

author img

By

Published : May 28, 2020, 4:34 PM IST

ప్రధాని నేరంద్ర మోదీ రెండో దఫా అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా జూన్​ నుంచి నెలరోజుల పాటు ఉత్సవాలు నిర్వహించనుంది భాజపా. డిజిటల్​ ర్యాలీలతో సామాజిక మాధ్యమాలను హోరెత్తించనుంది. భాజపా ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్​ ఈ విషయాన్ని వెల్లడించారు.

BJP to hold month-long campaign
సామాజిక మాధ్యమాలను హోరెత్తించనున్న భాజపా

ఈ జూన్​కు​ ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్​ రెండోసారి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతుంది. ఈ సందర్భంగా భారీ ఎత్తున మోదీ 2.0 వార్షికోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించింది భాజపా. నెల రోజుపాటు డిజిటల్​ ర్యాలీలతో సామాజిక మాధ్యమాలను హోరెత్తించనుంది.

దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో భాజపా శ్రేణులు డిజిటల్ ర్యాలీలు నిర్వహిస్తాయని పార్టీ ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్​ వెల్లడించారు. కరోనా కష్టకాలంలో కమలం పార్టీ కార్యకర్తలు ఎన్నో సహాయక కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు అండగా నిలిచారని చెప్పారు. ఆకలితో ఉన్న వారికి 19 కోట్ల ఆహార పొట్లాలను అందజేశారని, 4 కోట్లకుపైగా రేషన్ ప్యాకెట్లను పంపిణీ చేశారని వివరించారు.

ఆహారం, రేషన్​ మాత్రమే కాకుండా 5 కోట్ల మాస్కులను భాజపా కార్యకర్తలు ప్రజలకు పంపిణీ చేశారని, ఆరోగ్య సేతు యాప్​పై అవగాహన కల్పించి పీఎం కేర్స్​కు విరాళాలు సమకూర్చేందుకు శ్రమించారని భూపేంద్ర అన్నారు. మోదీ 2.0 వార్షికోత్సవం సందర్భంగా భాజపా ఏడు శాఖలు 500 డిజిటల్​ ర్యాలీలను నిర్వహిస్తాయని చెప్పారు. పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఫేస్​బుక్​ లైవ్​లో కార్యకర్తలనుద్దేశించి ప్రసంగిస్తారని తెలిపారు.

'స్వావలంబన భారత్'​ పేరుతో ప్రభుత్వం సాధించిన ఘనతల గురించి మోదీ రాసిన లేఖను ప్రజలకు భాజపా చేరవేస్తుందని భూపేంద్ర​ పేర్కొన్నారు. 10 కోట్ల కుటుంబాలకు ఈ లేఖను పంపిణీ చేస్తామన్నారు.

బిహార్ అసెంబ్లీ ఎన్నికలపై స్పందిస్తూ.. భాజపా సన్నద్ధమవుతుందని, నూతన సాంకేతికతతో ప్రజలకు చేరువయ్యేలా ప్రచారం నిర్వహిస్తామని చెప్పారు​. ప్రస్తుతం ఆ రాష్ట్రానికి ఇంఛార్జ్​గా వ్యవహరిస్తున్నారు భూపేంద్ర యాదవ్.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.