ETV Bharat / bharat

హోమియోపతి, వైద్య మండలి బిల్లులకు ఆమోదం

author img

By

Published : Sep 18, 2020, 3:40 PM IST

హోమియోపతి, భారతీయ కేంద్ర వైద్య మండలి సవరణ బిల్లులకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఈ రెండు బిల్లులకు ఈనెల 15నే లోక్​సభ ఆమోదించగా.. ఏప్రిల్​లో తీసుకొచ్చిన ఆర్డినెన్స్​ల స్థానంలో అమలులోకి రానున్నాయి. వీటితో పాటు ఎంపీలు, మంత్రుల జీతాల్లో కోత విధించేందుకు తీసుకొచ్చిన బిల్లులకు మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది ఎగువసభ.

central councils for homoeopathy, Indian medicines
హోమియోపతి, భారతీయ కేంద్ర వైద్య మండలి బిల్లులకు ఆమోదం

హోమియోపతి, భారతీయ కేంద్ర వైద్య మండళ్లకు సంబంధించిన ఆర్డినెన్స్​ల స్థానంలో తీసుకొచ్చిన రెండు బిల్లులకు రాజ్యసభ శుక్రవారం ఆమోదం తెలిపింది. ఈ రెండు బిల్లులను ఈనెల 15న మంగళవారమే లోక్​సభ ఆమోదించింది.

హోమియోపతి కేంద్ర మండలి సవరణ బిల్లు-2020, భారతీయ కేంద్ర వైద్య మండలి సవరణ బిల్లు-2020ను రాజ్యసభలో గురువారం ప్రవేశపెట్టారు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్​ జోషి. బిల్లులపై చర్చ సందర్భంగా.. ప్రతి పౌరుడికి చౌకగా, సులభంగా వైద్య సౌకర్యాలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్​. ఆ దిశగానే ఏప్రిల్​ 24న ఆర్డినెన్స్​లు తీసుకొచ్చినట్లు చెప్పారు.

హోమియోపతి కేంద్ర మండలి(సవరణ) బిల్లు-2020.. మండలి గడువు రెండేళ్ల కాలం పూర్తయిన ఏడాదిలోపు తిరిగి ఏర్పాటు చేయాలని సూచిస్తోంది. భారతీయ కేంద్ర వైద్య మండలి(సవరణ) బిల్లు-2020.. కేంద్ర వైద్య మండలిని ఏడాదిలోపు పునర్నిర్మించాలని సూచిస్తోంది. అప్పటి వరకు కేంద్రం ఏర్పాటు చేసే బోర్డ్​ ఆఫ్​ డైరెక్టర్స్​కు ఆ అధికారాలు ఉంటాయి.

ఎంపీల జీతాల కోత బిల్లుకు ఆమోదం..

ఎంపీలు, మంత్రుల జీతాల్లో ఏడాది పాటు 30 శాతం కోత విధించే బిల్లులకు రాజ్యసభ​ ఆమోదం తెలిపింది. పార్లమెంట్​ సభ్యుల జీతభత్యాలు, పెన్షన్ (సవరణ) బిల్లు-2020ని గత మంగళవారమే లోక్​సభ ఆమోదించింది.

ఇదీ చూడండి: రెండు వ్యవసాయ బిల్లులకు లోక్​సభ ఆమోదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.