ETV Bharat / bharat

'ఆ వ్యూహాల అమలుతోనే కరోనాపై విజయం'

author img

By

Published : May 11, 2020, 8:31 PM IST

కరోనాను భారత్​ ఎదుర్కొంటున్న తీరుకు అంతర్జాతీయ గుర్తింపు లభిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్​లో పాల్గొన్న మోదీ... కరోనాపై పోరులో రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తోన్న కృషిని ప్రశంసించారు. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధానికి పలు సలహాలిచ్చారు.

modi
మోదీ

కరోనా వైరస్​తో పోరాటానికి సమతుల్యమైన వ్యూహాలన్ని రూపొందించి.. వాటిని అమలు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రమాదకరమైన ఈ వైరస్ గ్రామీణ భారతంలో వ్యాప్తి చెందకుండా చేయడమే అతిపెద్ద సవాల్ అని వ్యాఖ్యానించారు.

వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మోదీ.. కరోనాను భారత్​ ఎదుర్కొంటున్న తీరుకు అంతర్జాతీయ గుర్తింపు లభిస్తోందన్నారు. వైరస్​పై పోరులో రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కృషిని ప్రశంసించారు మోదీ. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని ముఖ్యమంత్రులకు పిలుపునిచ్చారు.

భౌతిక దూరం వంటి నిబంధనలు లెక్కచేయని సమయంలోనే వైరస్ తీవ్రతరమవుతోందని మోదీ తెలిపారు. పలు ప్రాంతాల్లో లాక్​డౌన్​ను సమర్థంగా అమలు చేయడంలో పేలవంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.

ఇప్పుడు క్లారిటీ వచ్చింది!

భారత్​లోని వివిధ ప్రాంతాల్లో కరోనా వ్యాపి విషయాలపై ప్రస్తుతం స్పష్టమైన అవగాహన వచ్చిందని మోదీ వెల్లడించారు. ఇలాంటి సంక్లిష్ట సమయంలో ఏం చేయాలో గత కొద్ది వారాల్లో అధికార యంత్రాంగానికీ అర్థమైందని వ్యాఖ్యానించారు.

"ఇకపై మరింత స్పష్టమైన లక్ష్యాలతో, అప్రమత్తతతో కరోనాపై పోరును కొనసాగించాల్సిన అవసరముందని మనం అర్థం చేసుకోవాలి. కరోనా వైరస్ వ్యాప్తిని తగ్గించడమే లక్ష్యంగా మనం ముందుకు సాగాలి. 'రెండు గజాల దూరం' నినాదంతో ప్రజలంతా విధిగా భౌతిక దూరం నిబంధనలు పాటించేలా చూడాలి." -నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

ఎకానమీ ఓకే.. కరోనాపైనే దృష్టి

దేశంలోని అనేక ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలు క్రమంగా ప్రారంభం అవుతున్నాయని, రానున్న రోజుల్లో ఈ ప్రక్రియ మరింత ముమ్మరం అవుతుందని చెప్పారు మోదీ. కరోనా పోరుపైనే ప్రస్తుతం పూర్తిగా దృష్టి సారించాలని ఉద్ఘాటించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్​లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్​నాథ్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సీఎంల గళం

వీడియో కాన్ఫరెన్స్​లో భాగంగా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధాని వద్ద పలు విషయాలు ప్రస్తావించారు. చెన్నైలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో రైలు ప్రయాణాలను అనుమతించవద్దని తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి కోరారు.

ఆర్థిక కార్యకలాపాల విషయంలో తీసుకోవాల్సిన నిర్ణయాలను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేయాలని ఛత్తీస్​గఢ్​ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ అభ్యర్థించారు.

ప్రజల జీవితాలతో పాటు జీవనోపాధిని కాపాడుకునే విధంగా రూపొందించిన వ్యూహాత్మక విధానాలను అనుసరించి లాక్​డౌన్​ను పొడగించాలని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

కంటైన్​మెంట్ ​జోన్లు మినహా మిగిలిన ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభించేందుకు అనుమతించాలని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అభ్యర్థించారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ప్యాసింజర్ రైళ్ల సేవలను తిరిగి ప్రారంభించవద్దని తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కోరారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.