కేరళలో ఏనుగు మృతి ఘటనపై ఓ వైపు విచారం, మరోవైపు తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుండగా.. అదే రాష్ట్రంలో మరో ఏనుగు మృతి తాజగా వెలుగులోకి వచ్చింది. అది కూడా ఏదో పేలుడు పదార్థం తినడం వల్లే మరణించి ఉండొచ్చని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. కొల్లం జిల్లా పతానపురం అటవీ ప్రాంతంలో ఏప్రిల్లో బలహీనంగా ఉన్న ఓ ఆడ ఏనుగును కనుగొన్నామన్నారు. దానికి వైద్యం చేయాలని ప్రయత్నించినా అది సహకరించకుండా కొద్ది దూరం నడిచివెళ్లినట్లు తెలిపారు. మరుసటి రోజు ఓ చోట పడి మరణించిందని స్పష్టం చేశారు.
పోస్టుమార్టం నివేదికలో ఏనుగు దవడ విరిగినట్లు తేలిందని చెప్పుకొచ్చారు అధికారులు. ఫలితంగా ఆ ఏనుగు కూడా ఏదో పేలుడు పదార్థం తినడం వల్లే చనిపోయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. వైద్య పరీక్షల ఫలితాల కోసం ఎదురుచూస్తున్నామని అధికారులు చెప్పారు.
ఆకలితో అలమటించిన ఆ ఏనుగు
సైలెంట్వ్యాలీలో ఓ గర్భంతో ఉన్న ఏనుగు నదిలో నిలబడి కన్నుమూసింది. అంతకుముందు ఆ ఏనుగు ఆకలిగా ఉండగా, చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అనసా పండు తినిపించారు. అందులో పేలుడు పదార్ధాలు ఉన్నందున ఆ ఏనుగు తీవ్రంగా గాయపడింది. ఆ నొప్పిని భరిస్తూనే అది సమీపంలోని ఓ నదిలోకి వెళ్లి ఉపశమనం పొందింది. ఈ క్రమంలోనే ఆకలితో అలమటించి నదిలోనే తుదిశ్వాస విడిచింది. ఓ అటవీ శాఖ అధికారి ఈ విషయాన్ని ఫేస్బుక్లో పోస్టు చేయడం వల్ల ఈ విషయం తెలిసింది. ఈ ఘటనపై జంతు ప్రేమికులతో పాటు పలువురు సెలబ్రిటీలు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: ఆ రెండేళ్ల చిన్నారికి గజరాజుతోనే దోస్తీ!