ఉపాధ్యాయ వృత్తిపై మక్కువతో 1200 కి.మీ. దూరాన్ని తన భర్తతో కలిసి స్కూటీపై ప్రయాణించిన గర్భిణి ఉదంతం అదానీ ఫౌండేషన్ని కదిలించింది. రైళ్లు, బస్సులు అందుబాటులో లేకపోయినా ఎలాగైనా 'డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్' (డీఎడ్) ద్వితీయ సంవత్సర పరీక్షలు రాయాలని పట్టుబట్టి ఆమె రోడ్డు ప్రయాణాన్ని ఎంచుకుని గమ్యాన్ని చేరుకుంది.
ఝార్ఖండ్ నుంచి మధ్యప్రదేశ్లోని పరీక్షా కేంద్రానికి ఆమె చేరుకున్న తీరును ప్రసార మాధ్యమాల ద్వారా ఆ ఫౌండేషన్ తెలుసుకుంది. ధనంజయ్ కుమార్ (27), సోని హేమ్బ్రమ్ (22) గిరిజన దంపతులు ఈ నెల 16న తిరుగు ప్రయాణమయ్యేందుకు విమాన టికెట్లను సమకూర్చింది. స్కూటీని స్వస్థలానికి పంపించడానికి ఏర్పాట్లు చేసింది. నేరుగా విమానాలు లేకపోవడంతో గ్వాలియర్ నుంచి హైదరాబాద్కు, అక్కడి నుంచి రాంచీకి ఆ దంపతులు చేరుకోనున్నారు.
తాను చదువుకున్నది ఎనిమిదో తరగతి అయినా భార్యను ఉపాధ్యాయురాలిగా చూడాలని తపించిన ధనంజయ్కు గ్వాలియర్ యంత్రాంగం బస సదుపాయం కల్పించింది. దారి ఖర్చుల కోసం నగ తాకట్టు పెట్టి రూ.10,000 తీసుకున్నట్లు తెలిశాక దానిని విడిపించడానికి ముంబయికి చెందిన ఓ బాలిక ఆ మొత్తాన్ని కుమార్ ఖాతాలో జమ చేసింది.
ఇదీ చూడండి: కడుపులో బిడ్డతో స్కూటీపై 1150 కి.మీ ప్రయాణం