ETV Bharat / bharat

ఆయుధాలతో ఇంట్లోకి ఏడుగురు దొంగలు.. స్మార్ట్​ఫోన్​తోనే చుక్కలు చూపించిన యజమాని

author img

By

Published : Jan 14, 2023, 5:12 PM IST

ఇంట్లోకి చొరబడిన ఏడుగురు దోపిడీ దొంగలకు చుక్కలు చూపించాడు ఓ వ్యక్తి. కేవలం చేతిలో ఉన్న స్మార్ట్​ ఫోన్​ను ఉపయోగించి దొంగలను పోలీసులకు పట్టించాడు. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగింది.

bengaluru dacoity case
bengaluru dacoity case

తెల్లవారుజామున నీళ్లు తాగుదామని లేచేసరికి.. ఇంట్లో ఏదో అలజడి. అనుమానం వచ్చి చూసేసరికి వంటింట్లో ఏడుగురు దోపిడీ దొంగలు.. కిచెన్​లోకి అడుగు పెట్టగానే దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ సన్నివేశాన్ని చూసిన ఎవరైనా భయపడి హడావుడి చేస్తారు. కానీ వీరిని గమనించిన ఆ ఇంటి యజమాని ధైర్యంగా, చాకచక్యంగా వ్యవహరించాడు. కేవలం చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్​ను ఉపయోగించి దొంగలకు చుక్కలు చూపించాడు. సమయస్ఫూర్తితో మెలిగి పోలీసులకు సమాచారం అందించి దోపిడీ దొంగల ఆట కట్టించాడు. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగింది.

అజయ్​ బాలగోపాల్​ అనే వ్యక్తి.. కుమారులు రాహుల్​, సమీర్​తో కలిసి రఘువనహళ్లి సమీపంలోని నారాయణనగర్​ 1 బ్లాక్,​ విశ్రాంతి లేఅవుట్​లో నివసిస్తున్నారు. 27 ఏళ్ల రాహుల్​ ఓ ఆటోమోటివ్స్​ సంస్థలో మేనేజర్​గా విధులు నిర్వర్తిస్తున్నాడు. రోజులాగే బుధవారం ఉదయాన్నే లేచి ​నీళ్లు తాగేందుకు వెళ్లగా.. వంటింట్లో ఏదో అలజడి వినిపించింది. "మా నాన్న లేదా సోదరుడు ఉన్నారు అనుకున్నాను. కానీ కొద్దిసేపయ్యాక వారు కాదని అర్థమైంది. వెంటనే నా ఫోన్​ సహాయంతో ఇంట్లోని సీసీటీవీ కెమెరాల లైవ్​ ఫుటేజీ చూశాను. ఫర్నీచర్​ వెనక ఇద్దరు వ్యక్తులు దాక్కున్నారని గమనించాను." అని రాహుల్ వివరించాడు.

ఇంట్లోకి దొంగలు ప్రవేశించారని గుర్తించిన రాహుల్​.. మెల్లగా పైకెళ్లి తండ్రిని లేపాడు. ఇంట్లో ఉన్న లైసెన్స్​డ్​ డబుల్​ బ్యారెల్​ తుపాకీ తీసుకుని కిందకు వచ్చాడు. మరోసారి సీసీటీవీ కెమెరాల ఫుటేజీ చూడగా.. కిచెన్​లో మరో ఐదుగురు దొంగలు దాక్కున్నారని గమనించాడు. దొంగల చేతుల్లో పదునైన ఆయుధాలు, రాడ్లు, పైపులు ఉన్నాయని.. తాము వస్తే దాడి చేసేందుకే వారు ఎదురుచూస్తున్నారని రాహుల్​కు అర్థమైంది. వెంటనే అప్రమత్తమై పక్కింటి వాచ్​మన్​ సాయంతో పోలీసులకు సమాచారం అందించాడు. తుపాకీతో కిందకు వచ్చిన రాహుల్​, అతడి తండ్రి.. ఫర్నీచర్​ వెనుక దాక్కున్న ఇద్దరికి గురిపెట్టి, వారిని బంధించారు. కేవలం 12 నిమిషాల్లోనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. దుండగుల చేతిలో ఆయుధాలను గమనించిన పోలీసులు.. లోపలకు వెళ్లకుండా ఆగారు. దొంగలు పారిపోకుండా ఇంటి బయటే తలుపుల వద్ద కాపు కాశారు. స్టేషన్​కు ఫోన్​ చేసి అదనపు బలగాలను పంపించాలని కోరారు.

మేడపై ఉన్న ఇద్దరు దొంగలు.. పోలీసుల కదలికలను గమనించారు. అక్కడి నుంచి దూకి పరారయ్యారు. వెంటనే స్మార్ట్​ ఫోన్​లోని యాప్ ఉపయోగించి ఇంట్లో ఉన్న లైట్లన్నీ ఆన్​ చేశాడు రాహుల్​. దీంతో తాము దొరికిపోయామని అర్థం చేసుకున్న దొంగలు ఇంట్లోనే దాక్కున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు బృందం గంటకుపైగా శ్రమించి ఐదుగురు దొంగలను బంధించింది. మేడపై నుంచి దూకి పారిపోయిన మరో ఇద్దరిని 9 గంటల్లోనే అనేకల్​ బస్టాండ్​లో పట్టుకున్నారు. ఘటనా స్థలంలో ఆయుధాలతో పాటు కారంపొడి ప్యాకెట్లు, తాళ్లు లభ్యమయ్యాయి.

నిందితులంతా 2018లో ముంబయిలో ఓ బార్​లో పనిచేసేవారని పోలీసులు గుర్తించారు. కొవిడ్​ లాక్​డౌన్​ సమయంలో ఉద్యోగాలు కోల్పోయి బెంగళూరుకు తిరిగి వచ్చారని డీసీపీ పీ.కృష్ణకాంత్​ తెలిపారు. నిందితులను బిహార్​కు చెందిన మహ్మద్​ నియాజ్​, ఉత్తర్​ ప్రదేశ్​కు చెందిన మహ్మద్ ఇమ్రాన్​, సైయ్యద్​ ఫైజల్​ అలీ, రాజస్థాన్​కు చెందిన రామ్​ బిలాస్​, మధ్యప్రదేశ్​కు చెందిన సునీల్​ దాంగి, ఒడిశాకు చెందిన రజత్​ మాలిక్​గా గుర్తించారు. రాహుల్​ కుటుంబం ఎలక్ట్రానికి సిటీలో ఓ సంస్థను నిర్వహిస్తోందని.. వారు ఖరీదైన కార్లలో తిరగడం చూసిన నిందితులు వారింట్లో చోరీ చేసేందుకు ప్లాన్ చేశారని డీసీపీ చెప్పారు.

ఇవీ చదవండి: కాంగ్రెస్ ఎంపీ మృతికి మోదీ సంతాపం.. భారత్ జోడో యాత్ర వాయిదా

'అలా చేయకపోతే ఆయన్ను చంపేస్తాం!'.. నితిన్​ గడ్కరీ ఆఫీస్​కు బెదిరింపు కాల్స్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.