పులికే పంజా విసిరి.. కుమారుడ్ని కాపాడుకున్న మహిళ..

author img

By

Published : Sep 5, 2022, 8:13 PM IST

Bandhavgarh Tiger Reserve

కన్న తల్లి ప్రేమ ఎంత గొప్పదో అని చెప్పేందుకు ఈ ఘటన ఓ ఉదాహరణ. మగువల తెగువ ఎంతటిదో తెలిపేందుకు ఈ ఘటన ఓ మచ్చుతునక. అద్భుత ధైర్య, సాహసాలతో పులికే పంజా విసిరి తన 15 నెలల చిన్నారిని కాపాడుకుంది ఈ తల్లి. అసలేం జరిగిందంటే..

Tiger Attack Mother Son : మహిళ అద్భుత తెగువ చూపించి పులి పంజా నుంచి తన పదిహేను నెలల కుమారుడిని కాపాడుకుంది. ఆ సమయంలో గాయలపాలైై ఇద్దరూ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్​ ఉమరియా జిల్లాలోని బాంధవ్​గఢ్​ టైగర్​ రిజర్వ్ ప్రాంతంలో జరిగింది.
ఇదీ జరిగింది.. రోహ్​నియా గ్రామానికి చెందిన భోలా ప్రసాద్​, అర్చన దంపతులకు 15 నెలల కుమారుడు ఉన్నాడు. ఆదివారం ఉదయం కాలకృత్యాలకై కుమారుడు రవిరాజును పొలానికి తీసుకెళ్లింది అర్చన. ఇంతలో అక్కడికి వచ్చిన పులి.. వారిపై దాడి చేసింది. బాలుడిని నోట్లో కరచుకుని వెళ్లబోయింది. చిన్నారిని కాపాడే సమయంలో పులి అర్చననూ గాయపరిచింది. అర్చన అవేవీ లెక్కచేయకుండా గట్టిగా అరుస్తూ పులిని అడ్డుకుంది.

Bandhavgarh Tiger Reserve
చికిత్స పొందుతున్న బాధితులు

అర్చన కేకలు విని కొంత మంది గ్రామస్థులు అక్కడికి చేరుకుని పులిని చెదరగొట్టారు. దీంతో పులి అడవిలోకి పారిపోయింది. గాయపడిన తల్లీ, కుమారుడిని వెంటనే మన్​పుర్​లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడి నుంచి ఉమరియా జిల్లా ఆస్పత్రికి తరలించారని ఫారెస్ట్​ గార్డ్​ రామ్​ సింగ్​ మార్కొ తెలిపారు.

Tiger Attack Mother Son
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు
అయితే అటవీ ప్రాంతంలో ప్రజల రక్షణను దృష్టిలో పెట్టుకుని.. ఆ పులి ఆచూకీ గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని అధికారులు తెలిపారు. గాయాలపాలైన తల్లి, కుమారుడ్ని ఆ జిల్లా కలెక్టర్.. ఆస్పత్రిలో​ పరామర్శించారు. తర్వాతి చికిత్స కోసం వారిని జబల్​పుర్​లోని ఆస్పత్రికి రిఫర్​ చేశామని పేర్కొన్నారు. అటవీ ప్రాంతాల్లో ఉంటున్న ప్రజల రక్షణ కోసం ఆటవీ శాఖతో సమావేశం నిర్వహించానని ఆయన తెలిపారు.

ఇవీ చదవండి: మళ్లీ బతికొస్తాడని ఉప్పులో మృతదేహం.. కొన్ని గంటల తర్వాత

యంగెస్ట్ మేయర్, ఎమ్మెల్యే వివాహం.. హాజరైన సీఎం విజయన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.