ETV Bharat / bharat

అతీక్ అహ్మద్​ పోస్ట్​మార్టం రిపోర్ట్​లో షాకింగ్ నిజాలు.. సిట్ ఏర్పాటు

author img

By

Published : Apr 17, 2023, 1:31 PM IST

గ్యాంగ్‌స్టర్‌, మాజీ ఎంపీ అతీక్ అహ్మద్ పోస్టుమార్టం పరీక్షల నివేదికలో విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి. అతీక్ తలకు ఒక బుల్లెట్ తగలగా.. ఛాతి, శరీరం వెనుక భాగంలో కలిపి మరో 8 బుల్లెట్లు ఉన్నట్లు తెలుస్తోంది. అతీక్ సోదరుడు అష్రఫ్ శరీరం నుంచి 5 బుల్లెట్లను వైద్యులు తీసినట్లు సమాచారం. నిందితులు పేరు కోసమే కాల్పులకు పాల్పడినట్లు చెబుతున్నప్పటికీ.. ఘటన వెనక మరో కోణం ఉందనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు అతీక్ సోదరుల హత్యపై యూపీ పోలీసులు సిట్​ను ఏర్పాటు చేశారు.

atiq ahmed encounter
atiq ahmed encounter

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్, ఆయన సోదరుడు అష్రఫ్‌ను కాల్చిచంపిన ఘటన కలకలం రేపింది. వైద్య పరీక్షల కోసం అతీక్, అష్రఫ్‌ను ఆస్పత్రికి తీసుకొచ్చిన సమయంలో పాత్రికేయుల ముసుగులో వచ్చిన ముగ్గురు దుండగులు వారిపై కాల్పులు జరిపారు. పాయింట్‌ బ్లాంక్‌లో కాల్చడం వల్ల ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో నిందితులు మొత్తం 20 రౌండ్లకుపైగా కాల్పులు జరిపినట్లు పోలీసులు ప్రాథమికంగా వెల్లడించారు. అయితే తాజాగా అతీక్‌ అహ్మద్‌, అష్రఫ్‌ శవపరీక్షలో బుల్లెట్లకు సంబంధించి వివరాలు బహిర్గతమయ్యాయి.

అతీక్ తలకు ఒక బుల్లెట్ తగలగా.. ఛాతి, శరీరం వెనుక భాగంలో కలిపి మరో 8 బుల్లెట్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన సోదరుడు అష్రఫ్ శరీరం నుంచి 5 బుల్లెట్లను తీసినట్లు సమాచారం. అందులో ఒకటి తలలో మిగిలిన నాలుగు బుల్లెట్లు శరీరం వెనుక భాగంలో లభ్యమయ్యాయని తెలుస్తోంది. కేసు తీవ్రత దృష్ట్యా పోస్టుమార్టం పరీక్షను వీడియో తీశారు.

కాల్పుల ఘటన జరిగిన వెంటనే ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి మూడు నకిలీ ఐడీ కార్డులు, మెక్రోఫోన్లు, కెమెరాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను లవ్లీశ్ తివారీ, సన్నీ సింగ్, అరుణ్ మౌర్యగా గుర్తించారు. నిందితుల్లో ఒకడైన లవ్లీశ్‌కు బుల్లెట్‌ గాయం కావడం వల్ల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పేరు కోసమే కాల్పులకు పాల్పడినట్లు నిందితులు చెబుతున్నప్పటికీ.. కాల్పులు జరిపిన తీరును చూస్తే అనేక అనుమానాలకు తావిస్తున్నట్లు విపక్ష నేతలు అంటున్నారు.

అతీక్‌, అష్రఫ్‌ కాల్పుల ఘటనపై ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం, పోలీసులపై విమర్శలు వచ్చాయి. ఖైదీలకు సరైన భద్రత కల్పించలేదంటూ పలువురు నేతలు బహిరంగంగానే యోగి ఆదిత్యనాథ్ సర్కార్‌పై విమర్శలు చేశారు. ఈ ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్‌ జ్యుడీషియల్‌ విచారణకు ఆదేశించారు. రెండు నెలల్లో నివేదిక సమర్పించాలని సూచించారు.

సిట్​ ఏర్పాటు..
అతీక్ అహ్మద్, సోదరుడు అష్రఫ్ హత్య కేసు దర్యాప్తు చేసేందుకు సిట్​ను ఏర్పాటు చేశారు ఉత్తర్​ప్రదేశ్​ పోలీసులు. ​ముగ్గురు సభ్యులతో కూడిన సిట్​ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ బృందంలో ప్రయాగరాజ్​ అడిషనల్ డీజీపీ( డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్​), ప్రయాగరాజ్ కమిషనర్​, లఖ్​నవూలోని ఫోరెన్సిక్ లేబొరేటరీ డైరెక్టర్ ఉంటారని తెలిపారు. ఈ సిట్ బృందానికి ప్రయాగరాజ్​ అడిషనల్ డీజీపీ నేతృత్వం వహిస్తారని వెల్లడించారు.

అతీక్ సోదరుల హత్య..
ఉత్తర్​ప్రదేశ్‌ గ్యాంగ్‌స్టర్‌ మాజీ ఎంపీ అతీక్‌ అహ్మద్‌.. అతని సోదరుడు అష్రఫ్‌ అహ్మద్‌ను దుండగులు శనివారం రాత్రి 10 గంటల సమయంలో కాల్చి చంపారు. ప్రయాగ్‌రాజ్‌లోని వైద్య కళాశాలకు పరీక్షల కోసం తరలిస్తుండగా.. వారిని మీడియా ప్రతినిధులు అనుసరిస్తూ ప్రశ్నలు వేస్తున్నారు. ఈ సమయంలోనే జర్నలిస్టుల్లా వచ్చిన ముగ్గురు వ్యక్తులు అతీఖ్‌ ఆహ్మద్‌, అష్రఫ్‌ అహ్మద్‌పై అతి దగ్గర నుంచి కాల్పులు జరిపారు. మొదట అతీఖ్‌ అహ్మద్‌ కణితిపై గురిపెట్టి కాల్చిన నిందితులు.. వారిద్దరూ కింద పడిపోగానే విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. అతీఖ్‌ అహ్మద్ తలపై ఒక వ్యక్తి తుపాకీతో కాల్పులు జరపగా ఆయన వెంటనే కిందపడిపోయారు. ఈ కాల్పులు జరుపుతున్న సమయంలో అతిఖ్‌ అహ్మద్‌.. అష్రఫ్‌ అహ్మద్‌ చేతులకు సంకెళ్లు వేసి ఉన్నాయి. ఆ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.