ETV Bharat / bharat

భాజపా-జేడీయూ మధ్య 'అశోక' వివాదం.. నేతల మాటల యుద్ధం

author img

By

Published : Jan 17, 2022, 8:46 PM IST

Asoka controversy: బిహార్​లో మరోమారు అధికారం చేపట్టిన మిత్రపక్షాలు జేడీయూ-భాజపా మధ్య కొత్త వివాదం రాజుకుంటోంది. 'కింగ్​ అశోక'పై వివాదాస్పద వ్యాఖ్యల అంశంలో ఇరు పార్టీల నేతలు మాటల యుద్ధానికి దిగారు. తాజాగా.. జేడీయూ నేతలు వారి పరిమితుల్లో ఉండాలంటూ ఫేస్​బుక్​లో రాసుకొచ్చారు రాష్ట్ర భాజపా అధ్యక్షుడు సంజయ్​ జైశ్వాల్​. ఆ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

Bihar ruling allies BJP, JD(U)
భాజపా-జేడీయూ మధ్య 'అశోక' వివాదం

Asoka controversy: బిహార్​లోని అధికార మిత్రపక్షాలు భాజపా, జేడీయూ మధ్య కొత్త వివాదం తలెత్తింది. 'కింగ్​ అశోక'పై వివాదాస్పద వ్యాఖ్యల అంశంపై మాటల యుద్ధానికి దిగారు నేతలు. తాజాగా.. హద్దులు దాటుతున్నారంటూ ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్​ పార్టీకి హెచ్చరికలు చేశారు రాష్ట్ర భాజపా అధ్యక్షుడు సంజయ్​ జైశ్వాల్​. రాష్ట్రంలోని 76 లక్షల మంది భాజపా కార్యకర్తలు తగిన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ట్విట్టర్​ గేమ్స్​ ఆడుతున్నారంటూ.. తన ఫేస్​బుక్​ పోస్ట్​ ద్వారా జేడీయూపై విమర్శలు గుప్పించారు​.

ఇటీవల.. కింగ్​ అశోకపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ప్రముఖ నాటక రచయిత దయా ప్రకాశ్​ సిన్హా. ఈ క్రమంలో ఆయనకు ఇచ్చిన పద్మ శ్రీ అవార్డును వెనక్కి తీసుకోవాలని ప్రధాని మోదీకి లేఖ రాశారు జేడీయూ పార్లమెంటరీ బోర్డు ఛైర్మన్​ ఉపేంద్ర కుశ్వాహ. అయితే.. కుశ్వాహ, జేడీయూ జాతీయ అధ్యక్షుడు రాజీవ్​ రంజన్​ పేర్లను పేర్కొనకుండానే విమర్శలు చేశారు జైశ్వాల్​.

రచయిత దయా ప్రకాశ్​ సిన్హా.. అశోక, మొఘల్ రూలర్​ ఔరంగాజేబ్​లను ఒకే విధంగా చిత్రించటంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు జైశ్వాల్​. సిన్హాను అరెస్ట్​ చేయాలని కోరాల్సింది పోయి.. అవార్డును వెనక్కి తీసుకోవాలని నితీశ్​ కుమార్​ పార్టీ నేతలు కోరటమేంటని ప్రశ్నించారు. ఇలాంటిది గతంలో ఎప్పుడూ జరగలేదని దుయ్యబట్టారు.

"ఈ నేతలు నన్ను, కేంద్ర నాయకత్వాన్ని ట్యాగ్​ చేస్తూ ప్రశ్నిస్తున్నారు. కూటమిలో అందరూ తమ పరిధిలో ఉండాలి. నేను ఎప్పటికీ ఏకపక్షంగా ఉండను. ప్రధాని మోదీతో ట్విట్టర్​-ట్విట్టర్​ ఆట ఆడకూడదనేది ఈ పరిమితిలోని తొలి షరతు. మీరు ఇలాగే చేస్తూ.. ప్రశ్నలు లేవనెత్తితే.. బిహార్​లోని 76 లక్షల భాజపా కార్యకర్తలు దీటైన సమాధానం ఇస్తారు. భవిష్యత్తులో మీరు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నా. అవార్డులు వెనక్కి తీసుకోవాలని ప్రధానిని కోరటం కన్నా అవివేకం మరొకటి లేదు. "

- సంజయ్​ జైశ్వాల్​, బిహార్​ భాజపా అధ్యక్షుడు.

కూటమిలోని భాగస్వాములు తలెత్తిన వివాదాలను కూర్చుని పరిష్కరించుకోవాలని సూచించారు జైశ్వాల్. '2005కి ముందు జరిగినట్లు ముఖ్యమంత్రి నివాసం మరోమారు హత్యలు, అపహరణలు, దోపిడీలకు అడ్డా కావాలని కోరుకోవటం లేదు' అని పేర్కొన్నారు. ఆర్​జేడీ పాలన సమయంలో కూటమి కూలిపోవటం వల్ల ఏం జరిగిందో తెలుసుకోవాలని గుర్తు చేశారు.

వెనక్కి తగ్గేదే లే..

సంజయ్​ జైశ్వాల్​ విమర్శలపై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు ఉపేంద్ర కుశ్వాహ. తమ డిమాండ్​పై వెనక్కి తగ్గేదే లేదని తేల్చి చెప్పారు. అవార్డు వెనక్కి తీసుకునే వరకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు.

నితీశ్​ కుమార్ సారథ్యంలోని జేడీయూ, భాజపా కూటమి 2020లో జరిగిన బిహార్​ అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి అధికారాన్ని చేజిక్కించుకున్నాయి. కానీ, జేడీయూతో పోల్చితే భాజపా ఎక్కువ సీట్లు సాధించటంతో పరిస్థితులు మారిపోయాయి. మిత్రపక్షాలు గతంలో అనేక విషయాలపై వాగ్వాదానికి దిగాయి. తాజాగా అశోక రాజు వివాదం ఇరు పార్టీల మధ్య చిచ్చు రేపుతోంది.

ఇదీ చూడండి: 'ముఖ్యమంత్రి గారూ.. మీ ఆరోగ్యం ఎలా ఉంది?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.