ETV Bharat / bharat

దోషికి బదులు నిర్దోషి అరెస్ట్.. ఏడాది పాటు కస్టడీ.. పోలీసులకు భారీ జరిమానా!

author img

By

Published : Dec 2, 2022, 4:28 PM IST

Etv Bharat
Etv Bharat

అత్యాచారం కేసులో నిందితుడి బదులు అదే పేరుతో ఉన్న వేరే వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. నిర్దోషిని అరెస్ట్ చేసి ఏడాదిపాటు జ్యుడిషియల్ కస్టడీలో ఉంచిన ఇద్దరు మహిళా పోలీసులకు రూ.5 లక్షల జరిమానా విధించింది దక్షిణ కన్నడ జిల్లా రెండో అడిషనల్ ఎఫ్​టీఎస్​సీ పోక్సో కోర్టు. మరోవైపు, సోదరికి బౌన్స్ అయిన చెక్​ను ఇచ్చిన ఘటనలో ఓ వ్యక్తికి నాలుగు నెలల జైలు శిక్ష విధించింది కోర్టు.

అత్యాచారం కేసులో నిందితుడికి బదులు అదే పేరున్న మరొక వ్యక్తిని అరెస్ట్ చేసినందుకు ఇద్దరు మహిళా పోలీసులకు రూ.5 లక్షల జరిమానా విధించింది కోర్టు. ఈ జరిమానాను వారి వ్యక్తిగత ఖాతాల నుంచి నిర్దోషికి చెల్లించాలని ఆదేశించింది. ఈ ఇద్దరు మహిళా పోలీసులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేసింది. కర్ణాటక దక్షిణకన్నడ జిల్లా రెండో అడిషనల్ ఎఫ్​టీఎస్​సీ పోక్సో కోర్టు ఈ తీర్పునిచ్చింది.

ఇదీ జరిగింది..
మైనర్​పై నవీన్​ అనే వ్యక్తి కొన్నాళ్ల క్రితం అత్యాచారానికి పాల్పడ్డాడని మంగళూరు రూరల్ పోలీస్ స్టేషన్​లో కేసు నమోదైంది. బాధితురాలి వాంగ్మూలం ప్రకారం మంగళూరు మహిళా సబ్‌ఇన్‌స్పెక్టర్‌ రోసమ్మ.. నవీన్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదుచేశారు. తదుపరి విచారణ కోసం పోలీసు ఇన్‌స్పెక్టర్ రేవతికి అప్పగించారు. కేసు దర్యాప్తులో భాగంగా నవీన్​కు బదులు నవీన్‌ సిక్వేరాను అరెస్టు చేసి.. కోర్టు ఎదుట హాజరుపరిచారు. నవీన్‌పై ఛార్జీషీటు సైతం దాఖలు చేశారు. నిర్దోషి అయిన నవీన్​ సంవత్సరం పాటు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడు.

నిందితుల తరఫు న్యాయవాదులు కోర్టుకు సమర్పించిన పత్రాల్లో.. నిందితుడి పేరు నవీన్ అని మాత్రమే బాధితురాలి వాంగ్మూలంలో ఉందని కోర్టుకు తెలిపారు. నిందితుడి వయసు 25 లేదా 26 అని ఛార్జిషీటు​లో ఉందని కోర్టుకు వెల్లడించారు. అయితే జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న వ్యక్తి పేరు నవీన్ సిక్వేరా అని.. అతడి వయసు (47) అని కోర్టుకు తెలిపారు. నిర్దోషిని అరెస్టు చేసి సంవత్సరంపాటు జ్యుడిషియల్ కస్టడీలో ఉంచారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నవీన్ సిక్వేరా నిర్దోషి అని దక్షిణ కన్నడ జిల్లా రెండవ అదనపు ఎఫ్​టీఎస్​సీ పోక్సో కోర్టు న్యాయమూర్తి రాధాకృష్ణ తీర్పునిచ్చారు. నవీన్​ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచిన సబ్‌ఇన్‌స్పెక్టర్‌ రేవతి, ఇన్‌స్పెక్టర్ రోసమ్మ తమ వ్యక్తిగత నిధుల నుంచి నవీన్​కు రూ.5లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించారు.

చెక్​బౌన్స్ కేసులో జైలు శిక్ష..
చెక్​బౌన్స్ కేసులో ఉత్తరాఖండ్ కాశీపుర్​కు చెందిన ఓ వ్యక్తికి నాలుగు నెలల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. బౌన్స్ అయిన చెక్​ను సోదరికి ఇచ్చి మోసానికి పాల్పడ్డాడని బల్వంత్ సింగ్ అనే వ్యక్తికి అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్​ రుచికా గోయల్ ఈ శిక్ష విధించారు. నిందితుడికి రూ.6 లక్షలు జరిమానాను సైతం విధించింది. అది కట్టకపోతే మరో నెల జైలు శిక్ష విధించాలని ఆదేశించింది.
నిందితుడు బల్వంత్ సింగ్ తన సోదరి నిర్మల వద్ద 2018వ సంవత్సరంలో రూ.6 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. కొన్నాళ్ల తర్వాత నిర్మల తన సోదరుడికి డబ్బులు ఇవ్వాలని కోరింది. 2019 ఆగస్టు 27న బౌన్స్ అయిన చెక్​ను ఆమెకు అందించాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.