ETV Bharat / bharat

తెలంగాణ హైకోర్టుకు జడ్జి నియామకంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు

author img

By

Published : Sep 5, 2021, 4:06 PM IST

supreme court
సుప్రీంకోర్టు

ఇటీవలే భారీ స్థాయిలో హైకోర్టు జడ్జీల నియామకం(judges appointment news) చేపట్టిన సుప్రీంకోర్టు.. ఆ ప్రక్రియ అంతా సీనియారిటీ, అర్హతను దృష్టిలో పెట్టుకునే సాగినట్టు స్పష్టం చేసింది. తెలంగాణ హైకోర్టులో రిజిస్ట్రార్​ జనరల్​ను న్యాయమూర్తిగా సిఫార్సు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్​పై ఈ వ్యాఖ్యలు చేసింది. ఆ వ్యాజ్యాన్ని కొట్టివేసి పిటిషనర్​కు రూ. 5లక్షల జరిమానా విధించింది.

హైకోర్టు జడ్జీల నియామకంలో సీనియారిటీ, అర్హతకే పెద్దపీట వేసినట్టు సుప్రీంకోర్టు ఉద్ఘాటించింది(judges appointment news). న్యాయమూర్తుల సిఫార్సుల కోసం కొలీజియం అన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న తర్వాతే నిర్ణయం వెల్లడించిందని స్పష్టం చేసింది(high court judges list).

ఆగస్టు 17న సమావేశమైన సుప్రీంకోర్టు త్రిసభ్య కొలీజియం.. తెలంగాణ హైకోర్టుకు జడ్జీలుగా ఆరుగురు న్యాయశాఖ అధికారులు పదోన్నతినిచ్చింది. ఆ ఆరుగురిలో హైకోర్టు రిజిస్ట్రార్​ జనరల్​ ఏ వెంకటేశ్వర్​ రెడ్డి కూడా ఉన్నారు. ఆయన పదోన్నతిని అడ్డుకోవాలని సుప్రీంకోర్టులో పిటిషన్​ వేశారు న్యాయవాది శైలేశ్​ సక్సేనా. పిటిషన్​లో వెంకటేశ్వర్​పై అనేక ఆరోపణలు చేశారు. ఆయనకు రాజకీయ నేతలతో సంబంధాలున్నాయన్నారు. తనను హింసించేందుకే గతంలో తనపై ఉద్దేశపూర్వకంగా ఎఫ్​ఐఆర్​ నమోదు చేయించారని పేర్కొన్నారు.

ఈ పిటిషన్​ను జస్టిస్​ ఎస్​కే కౌల్​, జస్టిస్​ ఎంఎం సుంద్రేశ్​కు చెందిన ధర్మాసనం కొట్టివేసింది. ఎఫ్​ఐఆర్​ నమోదు చేయాలన్న హైకోర్టు ఆదేశాలనే వెంకటేశ్వర్​ రెడ్డి అమలు చేయించారని స్పష్టం చేసింది. న్యాయవాదిపై దర్యాప్తు జరుగుతోందని, దానిని పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని గతంలో హైకోర్టు చేసిన వ్యాఖ్యలను గుర్తుచేసింది. పదోన్నతి అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారనే కారణంతో న్యాయవాది శైలేశ్​కు రూ. 5లక్షల జరిమానా కూడా విధించింది. ​

హైకోర్టులకు జడ్డీలు...

న్యాయమూర్తుల ఖాళీల భర్తీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ(supreme court chief justice) వాయు వేగాన్ని ప్రదర్శిస్తున్నారు. ఆయన నేతృత్వంలోని కొలీజియం ఇటీవల సుప్రీంకోర్టుకు ఒకేసారి అత్యధికంగా 9 మంది న్యాయమూర్తుల నియామకం చేపట్టిన విషయం తెలిసిందే. తాజాగా.. అదే ఒరవడిలో దేశంలోని 12 హైకోర్టులకు ఒకేసారి 68 మంది పేర్లను సిఫార్సు చేసి చరిత్ర సృష్టించింది. వీరిలో పది మంది మహిళలు ఉన్నారు.

ఆగస్టు 25, సెప్టెంబరు ఒకటో తేదీల్లో సమావేశమైన జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ యు.యు.లలిత్‌, జస్టిస్‌ ఎ.ఎం.ఖాన్విల్కర్‌ నేతృత్వంలోని కొలీజియం మొత్తం 113 మంది పేర్లను పరిశీలించింది. వారిలో 82 మంది న్యాయవాదులు కాగా 31 మంది జ్యుడీషియల్‌ సర్వీస్‌ అధికారులు. సునిశిత పరిశీలన అనంతరం 44 మంది న్యాయవాదులు, 24 మంది జ్యుడీషియల్‌ సర్వీసెస్‌ అధికారులను హైకోర్టు న్యాయమూర్తి పదవులకు సిఫార్సు చేయాలని కొలీజియం నిర్ణయించింది.

గువాహటి హైకోర్టుకు షెడ్యూల్డ్‌ తెగలకు చెందిన మహిళా జ్యుడీషియల్‌ అధికారి మరాలి వంకుంగ్‌ పేరును కొలీజియం సిఫార్సు చేసింది. ఇందుకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తే మిజోరం నుంచి వచ్చిన తొలి హైకోర్టు న్యాయమూర్తిగా ఆమె రికార్డులకెక్కుతారు.

ఆగస్టు 31న సుప్రీంకోర్టు చరిత్రలోనే తొలిసారి 9 మంది న్యాయమూర్తులు(Supreme Court Judges) ఒకేసారి ప్రమాణస్వీకారం చేశారు. సీజేఐ జస్టిస్ ఎన్​వీ రమణ వీరితో ప్రమాణం చేయించారు. సుప్రీం అదనపు భవనం ఆడిటోరియంలో మంగళవారం ఉదయం 10:30 గంటలకు ఈ కార్యక్రమం జరిగింది. సీజేఐ(CJI Justice NV Ramana) సహా 9 మంది కొత్త న్యాయమూర్తులతో సుప్రీంకోర్టులో జడ్జిల సంఖ్య 33కు చేరింది.

ఇదీ చూడండి:- హైకోర్టులకు 68 మంది జడ్జిలను సిఫారసు చేసిన కొలీజియం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.