'ప్రత్యేక సేవలు' నిరాకరించిందని రిసెప్షనిస్ట్ హత్య.. భాజపా నేత కుమారుడి ఘాతుకం

author img

By

Published : Sep 24, 2022, 12:39 PM IST

Updated : Sep 24, 2022, 5:35 PM IST

Bulldozer ran at Pulkit Aryas resort

Uttarakhand resort murder: ఉత్తరాఖండ్​లో దారుణం జరిగింది. 19 ఏళ్ల యువతిని హత్య చేసి కాలువలో పడేశారు ముగ్గురు నిందితులు. హత్య కేసులో స్థానిక భాజపా నేత వినోద్‌ ఆర్య కుమారుడు... పుల్కిత్‌ ఆర్య సహా ముగ్గురిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్‌ చేయగా వారు నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. దీనిపై ప్రతిపక్షాలు ఆందోళనలకు సిద్ధమవుతున్న వేళ.. ముందుగానే అప్రమత్తమైన పుష్కర్‌ సింగ్‌ ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది.ఆమె తండ్రి మిస్సింగ్​ కేస్​ పెట్టడం వల్ల ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు 24 గంటల్లో కేసును ఛేదించి నిందితులను అరెస్టు చేశారు.

Ankita Bhandari murder: ఉత్తరాఖండ్‌లో 19 ఏళ్ల రిసెప్షనిస్ట్‌ హత్య కేసు తీవ్ర కలకలం సృష్టిస్తోంది. భాజపా నేత వినోద్‌ ఆర్య కుమారుడు పుల్కిత్ ఆర్యకు చెందిన వనతార రిస్టార్ట్‌లో రిసెప్షనిస్ట్‌గా పనిచేసే అంకితా భండారీ వారం క్రితం హత్యకు గురవ్వగా.. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ హత్య కేసులో.. పుల్కిత్‌ ఆర్యను సహా ముగ్గురిని పోలీసులు అరెస్ట్‌ చేయగా.. వారు నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. అంకితను కాలువలోకి తోసి హత్య చేసినట్లు నిందితులు తెలిపారని వివరించారు. నిందితులు ఇచ్చిన సమాచారంతో రిషికేశ్‌లోని చిల్లా కాలువలో.. అంకితా భండారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఉత్తరాఖండ్‌ విపత్తు ప్రతిస్పందన దళం తెలిపింది. ఆ మృత దేహం అంకితదేనని.. బంధువులు గుర్తించారు.

అసలేం జరిగింది:
హరిద్వార్​కు చెందిన భాజపా నేత వినోద్​ ఆర్య తనయుడు పుల్కిత్ ఆర్య యమకేశ్వర్​లో వనతార రిసార్ట్​ను నడుపుతున్నాడు. రిసార్ట్​లో పౌరి జిల్లా శ్రీకోట్ గ్రామానికి చెందిన అంకితా భండారీ అనే 19 ఏళ్ల యువతి రిసెప్షనిస్ట్​గా పని చేస్తుండేది. సెప్టంబర్​ 19న ఆమె ఇంటికి రాలేదని అంకిత తండ్రి ఉదయపుర్​ తల్లాలోని రాజస్వ చౌకీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇందులో రిసార్ట్​ యజమాని పుల్కిత్ ఆర్యతో పాటు రిసార్ట్​ మేనేజర్​ సౌరభ్​ భాస్కర్​, అసిస్టెంట్​ మేనేజర్​ అంకిత్​ గుప్తా ఉన్నారు. మొదట కేసు విషయంలో పోలీసులను తప్పుదోవ పట్టించాలని ప్రయత్నించిన నిందితులు.. పోలీసులు తమశైలిలో ప్రశ్నించేసరికి నిజాన్ని చెప్పేశారు.

అంకితా భండారీని ఎవరు లేని ప్రదేశానికి తీసుకెళ్లి మద్యం తాగించినట్లు నిందితులు తెలిపారు. మద్యం మత్తులో ఉన్న అంకితను హత్య చేసి మృతదేహాన్ని కాలువలో పడేశామని చెప్పారు. అంకితతో విభేదాలు రావడం వల్ల ఆమెను హత్య చేసినట్ల విచారణలో ఒప్పుకున్నారు. కాలువలో యువతి మృతదేహాన్ని గాలించేందుకు పోలీసులు ఓ టీమ్​ను పంపించారు. అంకిత కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా వారు ఆ మృతదేహం అంకితదే అని ధ్రువీకరించారు. కోటద్వార్ పోలీసులు ముగ్గురు నిందితులను విచారించి, 14 రోజుల జ్యుడీషియల్​ కస్టడీకి పౌరి జిల్లా జైలుకు తరలించారు.

ఆ సేవలు నిరాకరించిందనే..
అంకితా భండారీ స్నేహితులను పోలీసులు విచారించగా వారు సంచలన విషయాలను బయటపెట్టారు. రిసార్ట్ యజమానితో పాటు కొంతమంది ఉద్యోగులు ఆమెను అతిథులకు 'ప్రత్యేక సేవలు' అందించమని కోరేవారని దానికి ఆమె నిరాకరించడం వల్ల వేధింపులకు గురిచేసేవారని వివరించారు. మరోవైపు, అంకిత వాట్సాప్ చాట్ ద్వారా చాలా విషయాలు వెల్లడయ్యాయని పోలీసులు తెలిపారు.

ఆరోజు జరిగిందిదే..
వనతార రిసార్ట్ ఉద్యోగి తెలిపిన వివరాల ప్రకారం..సెప్టెంబర్ 18న సాయంత్రం 6 గంటల సమయంలో పులకిత్​.. అంకిత గదిలోకి వెళ్లాడు. ఆ సమయంలో అంకిత ఏడుస్తూ సహాయం కోసం అరిచింది. కాసేపటికి పులకిత్​​తో పాటు మరో ఇద్దరు బైక్​లో ఆమెను రిషికేశ్​కు తీసుకెళ్లారు. తిరిగి వచ్చే సరికి అంకిత వారితో లేదని తెలిపారు. యువతి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. నిందితులను అరెస్టు చేశారు.

Bulldozer ran at Pulkit Aryas resort
రిసార్ట్ ధ్వంసం

కాగా, ఈ ఘటనపై రాష్ట్రంలో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. యువతి హత్యకు వ్యతిరేకంగా నిరసనలు మొదలవుతున్న క్రమంలో.. ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌ ధామి ఆదేశాలనుసారం బుల్డోజర్‌లు రంగంలోకి దిగాయి. అక్రమంగా నిర్మించారని చెప్పిన అధికారులు.. వనతార రిసార్టును కూల్చేశారు. ఈ తరహాలోనే ఉత్తరాఖండ్​లో అక్రమంగా నిర్మించిన అన్ని రిసార్టులపై చర్యలు తీసుకోవాలని అన్ని డిస్ట్రిక్ట్​ మెజిస్టేట్​లను సీఎం ఆదేశించారు. రిషికేశ్‌లో జరిగిన ఘటన చాలా బాధాకరమని సీఎం పుష్కర్‌ సింగ్‌ ధామీ అన్నారు. ఈ దారుణానికి పాల్పడిన వారు ఎవరైనా సరే కఠినంగా శిక్షిస్తామన్నారు. ఈ విషయంలో అంకితకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు.

Bulldozer ran at Pulkit Aryas resort
రిసార్ట్ ధ్వంసం

నేరస్థులకు కఠిన శిక్ష పడేలా చేసేందుకు, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పి. రేణుకా దేవి నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేస్తామని ధామీ తెలిపారు. ప్రస్తుతం, పులకిత్​ ఆర్య తండ్రి భాజపా ఓబీసీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు. దీంతో పాటు యూపీ కో-ఇన్‌చార్జ్‌గా కూడా ఉన్నారు. ఆయన రెండో కుమారుడు అంకిత్ ఆర్య, రాష్ట్ర మంత్రి హోదాలో ఉన్నారు.

ఎమ్మెల్యే కారుపై దాడి..
వనతార రిసార్ట్ కూల్చివేత అనంతరం పుల్కిత్‌ ఆర్యకు చెందిన రిసార్ట్‌ ముందు నిరసనకారులు ఆందోళన చేశారు. అనంతరం ఒక్కసారిగా రిసార్ట్‌లో మంటలు చెలరేగాయి. అయితే ఇవి నిరసనకారులు పెట్టిన మంటలు కాదని.. ఆధారాలను చెరిపేసేందుకు పుల్కిత్‌ ఆర్య సంబంధీకులే నిప్పు అంటించారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఘటనా స్థలానికి వచ్చిన స్థానిక ఎమ్మెల్యే రేణు బిషత్‌ను అడ్డుకున్న స్థానికులు ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆమె కారును ధ్వంసం చేశారు. పోలీసుల సాయంతో ఎమ్మెల్యే అక్కడి నుంచి బయటపడ్డారు.

పార్టీ నుంచి సస్పెండ్..
అంకిత భండారి హత్యతో భాజపా చర్యలకు ఉపక్రమించింది. ప్రధాన నిందితుడు పుల్కిత్ ఆర్య తండ్రి, మాజీ మంత్రి వినోద్ ఆర్యను పార్టీ నుంచి తొలగించింది. పార్టీ స‌భ్యుడిగా ఉన్న పుల్కిత్ ఆర్య సోద‌రుడు అంకిత్ ఆర్యను కూడా బ‌య‌టికి పంపింది. ఈ కేసులో నిందితుల‌ను కాపాడేందుకు భాజపా ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న ప్రతిపక్షాల ఆరోపణలతో ఈ చర్యలు తీసుకుంది.

ఇదీ చదవండి: ఆన్​లైన్​లో గ్యాంగ్​స్టర్ల రిక్రూట్​మెంట్​.. వాట్సాప్​ నెంబర్​తో ఫేస్​బుక్​ ప్రకటన

స్కూల్​కు వెళ్తున్న బాలికల కిడ్నాప్.. దిల్లీకి తీసుకెళ్లి రేప్.. యూపీలో లవ్ జిహాద్ కేసు

Last Updated :Sep 24, 2022, 5:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.