ETV Bharat / bharat

'అమృత్​పాల్ అరెస్ట్.. ఫేక్ ఎన్​కౌంటర్​లో హత్యకు ప్లాన్'.. కోర్టులో లొంగిపోయిన బాబాయ్

author img

By

Published : Mar 20, 2023, 10:40 AM IST

Updated : Mar 20, 2023, 11:56 AM IST

amritpal-singh-latest-news
amritpal-singh-latest-news

వివాదాస్పద మత బోధకుడు అమృత్​పాల్ సింగ్​ను అరెస్ట్ చేశారని ఓ న్యాయవాది ఆరోపించారు. అతడిని ఎన్​కౌంటర్ చేసేందుకు పోలీసులు ప్లాన్ చేస్తున్నారని అన్నారు. మరోవైపు, అమృత్​పాల్ బాబాయ్ కోర్టులో లొంగిపోయాడు.

ఖలిస్థానీ అనుకూల నాయకుడు, 'వారీస్ పంజాబ్ దే' చీఫ్ అమృత్​పాల్ సింగ్ అరెస్ట్ విషయం చర్చనీయాంశంగా మారింది. అతడు చిక్కినట్టే చిక్కి తప్పించుకున్నాడని పోలీసులు చెబుతుండగా.. వారీస్ పంజాబ్ దే లీగల్ అడ్వైజర్ మాత్రం వాటిని ఖండిస్తున్నారు. అమృత్​పాల్​ను పోలీసులు అరెస్ట్ చేశారని న్యాయవాది ఇమాన్ సింగ్ ఖారా ఆరోపింస్తున్నారు. షాకోఠ్ పోలీస్ స్టేషన్​ వద్ద అతడిని అరెస్ట్ చేసినట్లు చెబుతున్నారు. అమృత్​పాల్​ను చంపేందుకు పోలీసులు ప్లాన్ వేస్తున్నారని ఆదివారం పేర్కొన్నారు ఇమాన్ సింగ్. ఫేక్ ఎన్​కౌంటర్​ నిర్వహించి అతడిని మట్టుబెట్టాలని యత్నిస్తున్నారని అన్నారు. అమృత్​పాల్ ప్రాణాలకు ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేస్తూ పంజాబ్, హరియాణా హైకోర్టును ఆశ్రయించారు.

"హైకోర్టులో నేను రిట్ పిటిషన్ వేశా. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ఏ వ్యక్తినీ పోలీసులు కొట్టకూడదు. అమృత్​పాల్​ను షాకోఠ్ పోలీస్ స్టేషన్ వద్ద అరెస్ట్ చేశారు. అతడి ప్రాణాలకు ముప్పు ఉంది. ఇదే విషయం హైకోర్టు పిటిషన్​లో ప్రస్తావించా. ఎవరినైనా అరెస్ట్ చేస్తే.. 24 గంటల లోపు వారిని కోర్టులో ప్రవేశపెట్టాలి. ఇది పోలీసుల విధి. కానీ, ఇప్పటివరకు అమృత్​పాల్​ను కోర్టుకు తీసుకురాలేదు. పోలీసులకు ఏదో దురుద్దేశం ఉన్నట్లు కనిపిస్తోంది. పోలీసులు ఫేక్ ఎన్​కౌంటర్​లో అతడిని చంపేయవచ్చు. తమకు దొరికిన ఈ టైమ్​ను ఉపయోగించుకొని ఏదైనా పథకం రచించే ఛాన్స్ ఉంది."
-ఇమాన్ సింగ్ ఖారా, వారీస్ పంజాబ్ దే లీగల్ అడ్వైజర్

ఇదిలా ఉండగా.. అమృత్​పాల్ సింగ్ బాబాయ్ హర్జీత్ సింగ్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అమృత్​పాల్ డ్రైవర్ హర్​ప్రీత్ సింగ్ సైతం జలంధర్​లోని మెహ్తాపుర్ పోలీస్ స్టేషన్​కు వెళ్లి లొంగిపోయినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. అమృత్​పాల్ కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని చెప్పారు. ఇప్పటివరకు 112 మంది అమృత్​పాల్ అనుచరులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

ఇంటర్నెట్​పై ఆంక్షలు కొనసాగింపు..
రాష్ట్రంలో అంతర్జాలంపై ఆంక్షలను పంజాబ్ ప్రభుత్వం మరో 24 గంటలు పొడగించింది. మంగళవారం మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్నెట్​పై సస్పెన్షన్ కొనసాగుతుందని స్పష్టం చేసింది. శనివారం నుంచి రాష్ట్రంలో మొబైల్ ఇంటర్నెట్, ఎస్ఎంఎస్ సేవలు నిలిచిపోయాయి. వాయిస్ కాల్స్ మాత్రమే కొనసాగిస్తూ.. ఎస్ఎంఎస్, ఇంటర్నెట్ సేవలను నిలిపివేయాలని తాజా ఆదేశాల్లో మొబైల్ కంపెనీలకు స్పష్టం చేసింది. వైద్య, బ్యాంకింగ్ అవసరాల నిమిత్తం బ్రాడ్​బ్యాండ్ సేవలు యథావిధిగా కొనసాగనున్నాయి.

రంగంలోకి ఎన్ఐఏ?
అమృత్​పాల్ ప్రయాణించిన ఓ కారును ఆదివారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఖరీదైన ఆ కారు యజమానిని గుర్తించారు. అది ఓ డ్రగ్ స్మగ్లర్ సోదరుడి కారు అని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ కేసును ఎన్ఐఏ విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏ సమయంలోనైనా ఈ కేసును చేపట్టే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

వివాదాస్పద మత బోధకుడైన అమృత్​పాల్ సింగ్​పై నిఘా వర్గాలు కన్నేశాయి. అతడి కార్యకలాపాలను గమనించి ఓ నివేదిక తయారు చేసినట్లు సమాచారం. మాదకద్రవ్యాల నుంచి విముక్తి కల్పిస్తామని పేర్కొంటూ.. యువతను తప్పుదోవ పట్టిస్తున్నారని నివేదికలో పేర్కొన్నారు. వ్యసన విముక్తి కేంద్రాలు, ఒక గురుద్వారాను అడ్డుపెట్టుకొని యువతను ఆత్మాహుతికి సిద్ధం చేస్తున్నాడని వివరించారు. యువతను మభ్యపెట్టి మానవబాంబులుగా మార్చేస్తున్నట్లు పేర్కొన్నారు. బలగాల చేతిలో ఉగ్రవాదులు హతమైతే.. వారిని పోరాట యోధులు అంటూ కీర్తిస్తుండేవాడని నివేదికలో అధికారులు వివరించారు.

Last Updated :Mar 20, 2023, 11:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.