ETV Bharat / bharat

భింద్రన్‌వాలే స్వగ్రామంలోనే అమృత్​పాల్​ అరెస్ట్.. పోలీసులు పట్టుకున్నారా?.. లొంగిపోయాడా?

author img

By

Published : Apr 23, 2023, 11:46 AM IST

Updated : Apr 23, 2023, 3:20 PM IST

amritpal-singh-arrest-punjab-igp-press-meet-ofter-amritpal-arrest
అమృతపాల్ సింగ్ అరెస్ట్

అమృత్‌పాల్‌ సింగ్‌ను పంజాబ్‌లో ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. అరెస్ట్​ అనంతరం పంజాబ్​ పోలీసు ఐజీపీ మీడియాతో మాట్లాడి పలు విషయాలను తెలిపారు. కాగా అమృత్​పాల్​ సమాచారాన్ని అతడే పోలీసులకు ఇచ్చుకొన్నాడన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఖలిస్థానీ వేర్పాటువాది జర్నైల్‌ సింగ్‌ భింద్రన్‌వాలే స్వగ్రామంలో అమృత్​పాల్​ అరెస్ట్​ కావడం గమనార్హం.

ఖలిస్థానీ వేర్పాటువాద నేత అమృత్‌పాల్‌ సింగ్​ను పంజాబ్‌లోని మోగా జిల్లాలో ఆదివారం ఉదయం పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం అసోంలోని డిబ్రూగఢ్‌ జైలుకు తరలించారు. ప్రస్తుతం అమృత్​పాల్​ అనుచరులు కూడా అదే జైల్లో ఉన్నారు. అయితే అరెస్టు కావడానికి ముందు.. మోగా జిల్లాలోని రోడె గ్రామంలోని ఓ గురుద్వారాలో అమృత్‌పాల్‌ ప్రసంగించినట్లు అధికారులు గుర్తించారు. అందులో ఇది ఏమాత్రం ముగింపు కాదని అతడు వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ఖలిస్థానీ వేర్పటువాది జర్నైల్‌ సింగ్‌ భింద్రన్‌వాలే స్వగ్రామం కూడా రోడె కావడం గమనార్హం.

అమృత్‌పాల్‌ను నేషనల్‌ సెక్యూరిటీ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసి అరెస్ట్​ చేశారు. ప్రస్తుతం అతడిని బఠిండా వాయుసేన కేంద్రానికి పోలీసులు తరలించారు. అక్కడి నుంచి నేరుగా అసోంకు తీసుకువెళ్లారు. వాస్తవానికి ఏప్రిల్‌ 14వ తేదీనే తల్వండిలోని దమ్‌దమ్‌ సాహెబ్‌ వద్ద పోలీసులకు.. అమృత్‌పాల్‌ లొంగిపోతాడనే ప్రచారం జరిగింది. కానీ, ఆ ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించడం వల్ల అతడి పథకం సఫలం కాలేదు. మరోవైపు స్వర్ణదేవాలయం వద్ద కూడా పోలీసు బలగాలు అధికంగా ఉండటం కారణంగా.. అమృత్​పాల్​ రోడెను ఎంచుకొన్నట్లు తెలుస్తోంది.

అతడే సమాచారం ఇచ్చుకున్నాడా?
అమృత్‌పాల్‌ అరెస్టుపై పలు విభిన్న కథనాలు వెలువడుతున్నాయి. అతడ్ని పోలీసులే అరెస్టు చేశామని చెబుతుండగా.. మరో వైపు రోడెవాల్‌ గురుద్వారాలోని జ్ఞానీ జస్బీర్‌ సింగ్‌ అనే వ్యక్తి మాత్రం మరో విధంగా చెబుతున్నారు. అమృత్‌పాల్‌ శనివారం రాత్రి గురుద్వారాకు వచ్చాడని ఓ ఆంగ్లవార్త సంస్థకు జస్బీర్‌ వెల్లడించారు. అతడు ఎక్కడ ఉన్నాడో పోలీసులుకు అమృత్‌పాలే స్వయంగా ఫోన్‌ చేసి సమాచారం ఇచ్చాడని తెలిపారు. ఆదివారం గురుద్వారాలో ప్రార్థనలు ముగిసిన అనంతరం ఉదయం 7 గంటలకు.. అమృత్​పాల్​ లోంగిపోనున్నట్లు జస్బీర్‌ పేర్కొన్నారు. ఉదయం 7గంటల సమయంలో ఇంటెలిజెన్స్‌ ఐజీ నేతృత్వంలోని పోలీసులు అక్కడకు చేరుకొని.. అమృత్​పాల్​ని అరెస్టు చేసి తీసుకెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది.

అరెస్ట్​ అనంతరం మాట్లాడిన ఐజీపీ!
అమృత్​పాల్​ అరెస్ట్ అనంతరం పంజాబ్​ ఇన్స్​స్పెక్టర్​ ఆఫ్​ జనరల్​ సుఖ్‌చైన్ సింగ్ గిల్.. మీడియాతో మాట్లాడారు. అమృత్​పాల్​ అరెస్ట్​ కోసం నేషనల్​ సెక్యురిటీ ఎజెన్సీ వారంట్​ జారీ చేసిందని.. ఆదివారం అది అమలు జరిగిందని ఆయన వెల్లడించారు. పోలీసు ప్రధాన కార్యాలయంలో మాట్లాడిన ఆయన.. పంజాబ్​ పోలీసులు, నిఘా వర్గాల సంయుక్తంగా ఈ ఆపరేషన్​ చేపట్టాయని తెలిపారు. ​

"గత 35 రోజులుగా పంజాబ్ పోలీసులపై విపరీతమైన ఒత్తిడి ఉంది. ఈ ఆపరేషన్‌ కోసం అన్ని పంజాబ్‌ పోలీస్‌ విభాగాలు సమన్వయంతో పనిచేశాయి. అమృత్‌పాల్‌పై గతంలో జాతీయ భద్రతా చట్టం వారెంట్లు జారీ కాగా ఇవాళ అరెస్ట్ చేశాం. ఈ కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతుంది. పంజాబ్ ప్రజలు శాంతిని కలిగి ఉండండి. ఈ సయమంలో పంజాబ్‌లో మతపరమైన శాంతి, సామరస్యాలను పాటించినందుకు ప్రజలకు పోలీసులు, ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు. పంజాబ్‌లో శాంతిభద్రతల పట్ల పోలీసులు చిత్తశుద్ధితో ఉన్నారు. పుకార్లు వ్యాప్తి చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీచేస్తున్నాం"

-సుఖ్‌చైన్ సింగ్ గిల్‌, పంజాబ్ ఐజీపీ

అమృత్​పాల్​ సింగ్​ను ఆదివారం ఉదయం రొడే గ్రామంలో.. దాదాపు 6.45 గంటల సమయంలో అరెస్ట్​ చేశామని సుఖ్‌చైన్ సింగ్ గిల్‌ తెలిపారు. గురుద్వారా పవిత్రతను కాపాడేందుకు మా పోలీసులెవ్వరు అందులోకి అడుగు పెట్టలేదని వెల్లడించారు. అతడిని అరెస్ట్ చేసిన వెంటనే.. మొదట బఠిండాలోని ఎయిర్​ ఫోర్స్ స్టేషన్​కు తీసుకువెళ్లామని.. తరువాత అతడ్ని అసోంలోని డిబ్రూగఢ్​ జైలుకు తరలిస్తామని పంజాబ్​ ఇన్స్​స్పెక్టర్​ ఆఫ్​ జనరల్​ సుఖ్‌చైన్ సింగ్ గిల్ తెలిపారు.

అయితే శనివారం ఉదయం జరిగిన ఓ కార్యక్రమంలో.. అమృత్‌పాల్‌ గురించి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాని విలేకర్లు ప్రశ్నించారు. దీనికి అమిత్​షా స్పందిస్తూ.. "అది ఎప్పుడో అప్పుడు జరగాల్సిందే. గతంలో అమృత్‌పాల్‌ స్వేచ్ఛగా తిరిగేవాడు. ఇప్పుడు అతడి కార్యకలాపాలకు అడ్డుకట్ట పడింది" అని తెలిపారు. అమృత్​పాల్​పై హోంశాఖ మంత్రి కీలక వ్యాఖ్యలు చేసిన కొద్ది గంటల్లోనే అతడిని అరెస్టు చేశారు.

'చట్టాన్ని అతిక్రమిస్తే వదలం'
ఖలిస్థానీ తిరుగుబాటు నేత అమృత్‌పాల్‌ సింగ్ అరెస్ట్‌పై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్ స్పందించారు. చట్టాన్ని అతిక్రమించి.. శాంతి, భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులు ఎవరైనా.. చట్టప్రకారం చర్యలు తప్పవని స్పష్టం చేశారు. నెలరోజులకు పైగా అమృత్‌పాల్‌ కోసం గాలింపు చేపట్టిన వేళ.. శాంతి, భద్రతలకు సహకరించిన 3.5 కోట్ల పంజాబ్ ప్రజలకు భగవంత్ మాన్‌ ధన్యవాదాలు తెలిపారు. తాము అమాయకులెవరినీ ఇబ్బంది పెట్టమని తెలిపిన పంజాబ్ ముఖ్యమంత్రి.. ప్రతీకార రాజకీయాలు చేయమని వెల్లడించారు.

Last Updated :Apr 23, 2023, 3:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.