ETV Bharat / bharat

'సర్కార్లను కాపాడుకునేందుకు 'అవినీతి' విపక్షాల పాట్లు.. వారి వల్లే మణిపుర్ ఘటన'

author img

By

Published : Aug 9, 2023, 6:22 PM IST

Updated : Aug 9, 2023, 7:20 PM IST

amit-shah-speech-today-no-confidence-motion
amit-shah-speech-today-no-confidence-motion

Amit Shah Speech Today No Confidence Motion : విపక్ష కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం ప్రజా ఆకాంక్షకు ప్రతిబింబం కాదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. తమ ప్రభుత్వాలను కాపాడుకునేందుకు విపక్షాలు అవినీతికి పాల్పడుతున్నాయని ఆరోపించారు. మణిపుర్ ఘటనపై అమిత్ షా సుదీర్ఘ వివరణ ఇచ్చారు. శరణార్థులు భారీగా వలస రావడం వల్ల స్థానికుల్లో అభద్రతా భావం నెలకొందని తెలిపారు.

Amit Shah Speech Today No Confidence Motion : ప్రభుత్వాలను కాపాడుకోవడానికి విపక్ష కూటమి పార్టీలు అవినీతికి పాల్పడ్డాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. దీన్ని బట్టే ఆ పార్టీల నిజస్వరూపం అందరికీ అర్థమైందని అన్నారు. విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై మాట్లాడిన ఆయన.. 1999లో అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్​పేయీ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు అవినీతికి పాల్పడలేదని, బదులుగా రాజీనామా చేసేందుకే మొగ్గు చూపారని తెలిపారు. కాంగ్రెస్ మాత్రం.. ఎంపీలకు లంచాలు ఇచ్చి ప్రభుత్వాలను నిలబెట్టుకుందని విమర్శించారు.

"1993లో ప్రధానమంత్రి పీవీ నరసింహరావు అవిశ్వాస తీర్మానం ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు.. ఎట్టి పరిస్థితుల్లో అధికారంలో కొనసాగాలని కాంగ్రెస్ భావించింది. పీవీ అవిశ్వాస తీర్మానాన్ని గెలిచారు. కానీ, ఝార్ఖండ్ ముక్తి మోర్చా ఎంపీలు జైలుకు వెళ్లాల్సి వచ్చింది. తర్వాత పీవీ సైతం జైలుకు వెళ్లారు. ఈ రోజు జేఎంఎం, కాంగ్రెస్ విపక్షంలో కూర్చున్నాయి. 2008లో మన్మోహన్ సింగ్​ విశ్వాస తీర్మానాన్ని తీసుకొచ్చారు. ఆ సమయంలో అత్యంత అవమానకరమైన ఘటనలు ఈ సభలో జరిగాయి. ఎంపీలకు కోట్ల రూపాయల లంచాలు ఇచ్చి ప్రభుత్వాన్ని కాపాడుకున్నారు. యూపీఏ స్వభావం ఇది."
-అమిత్‌ షా, కేంద్ర హోంమంత్రి

Amit Shah on Manipur Violence :
మణిపుర్​లో హింసాకాండపైనా అమిత్ షా మాట్లాడారు. మణిపుర్​లో హింసాత్మక ఘటనలు జరిగాయన్న విషయాన్ని తాను అంగీకరిస్తున్నట్లు చెప్పారు. అలాంటి ఘటనలకు ఎవరూ మద్దతివ్వరని స్పష్టం చేశారు. ఇలాంటి వాటిపై రాజకీయాలు చేయడమే అవమానకరమని విపక్షాలనుద్దేశించి విమర్శలు గుప్పించారు. సమావేశాల మొదటి రోజు నుంచి మణిపుర్ అంశంపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు అమిత్ షా చెప్పారు. విపక్షాలే చర్చను జరగనీయలేదని ఆరోపించారు. హింసలో పాల్గొన్న మైతేయీ, కుకీ తెగలతో తాను వేర్వేరుగా చర్చలు జరుపుతున్నానని అమిత్ షా వివరించారు. ఇరువర్గాలు శాంతియుతంగా ఉండాలని పిలుపునిచ్చారు. చర్చలే సమస్యకు పరిష్కారమని స్పష్టం చేశారు.

  • #WATCH | Union Home Minister Amit Shah gives a detailed response on what led to violence in Manipur and the measures taken by the government to control the situation in the state pic.twitter.com/PKscrHIyGn

    — ANI (@ANI) August 9, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"నేను మణిపుర్ అంశంపై మాట్లాడకూడదని విపక్షాలు కోరుకున్నాయి. కానీ వారు నన్ను నిశబ్దంగా ఉంచలేరు. 130 కోట్ల మంది ప్రజలు మమ్మల్ని గెలిపించారు. కాబట్టి వారు తప్పక వినాల్సిందే. గడిచిన ఆరేళ్లలో మణిపుర్​లో కర్ఫ్యూ విధించే అవసరమే రాలేదు. భారత్‌, మయన్మార్‌ మధ్య సరిహద్దుల్లో ఎలాంటి కంచె లేకపోవడం వల్ల మయన్మార్‌ నుంచి శరణార్థులు స్వేచ్ఛగా వస్తున్నారు. సైనికుల పహారాతో మణిపుర్‌లో పరిస్థితులు చక్కబడ్డాయి. వేలాదిగా వలసలు రావడం వల్ల స్థానికుల్లో అభద్రతా భావం నెలకొంది. 1993లో 700 మంది ప్రజలు నాగా-కుకీ ఘర్షణల్లో చనిపోయారు. అప్పుడు ప్రధాని, హోంమంత్రి కాకుండా.. హోంశాఖ సహాయ మంత్రి పార్లమెంట్​లో ప్రకటన చేశారు. నెహ్రూ, ఇందిర, రాజీవ్ గాంధీ హయాంలోనే మతపరమైన అల్లర్లు ఎక్కువ జరిగాయి.

నలుగురు మైతేయీల దుష్ప్రవర్తనతో మణిపుర్ (వైరల్ వీడియో) ఘటన జరిగింది. ఏ నాగరిక మహిళలకూ అలా జరిగి ఉండకూడదు. వీడియోలోని వ్యక్తులను ఫేస్‌ రికగ్నైజేషన్‌తో గుర్తించి అరెస్టు చేశాం. మణిపుర్‌ అల్లర్లలో 152 మంది చనిపోయారు. హింసాత్మక ఘటనల్లో 14,898 మంది అరెస్టయ్యారు. 1106 కేసులు నమోదయ్యాయి. మణిపుర్‌ ఘటనలో సీఎస్‌, డీజీపీని బదిలీ చేశాం. పరిస్థితిని చక్కదిద్దేందుకు మణిపుర్‌ సీఎం సహకరిస్తున్నారు. ఏదైనా రాష్ట్ర ముఖ్యమంత్రి సహకరించకపోతేనే మార్చాల్సిన అవసరం ఏర్పడుతుంది. మణిపుర్‌లో పరిస్థితులు క్రమంగా అదుపులోకి వస్తున్నాయి. పరిస్థితులు చక్కబడుతున్నప్పుడు మీరు పెట్రోల్‌ చల్లొద్దు. మణిపుర్‌ పర్యటనలో రాహుల్‌ గాంధీ నాటకాలు ఆడారు. రాహుల్‌ పర్యటన కోసం హెలికాప్టర్‌ ఏర్పాటు చేస్తే.. రోడ్డుమార్గంలోనే వెళ్తానని పట్టుబట్టారు. సాధ్యమైనంత త్వరలో మణిపుర్‌లో శాంతిని పునరుద్ధరిస్తాం."
-అమిత్ షా, కేంద్ర హోంమంత్రి

'విజయవంతమైన ప్రధాని మోదీ'
Successful PM of India : దేశ ప్రజల్లో భ్రమను కల్పించేందుకే ప్రతిపక్ష ఇండియా కూటమి కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిందని షా విమర్శించారు. ఎన్​డీఏ ప్రభుత్వాన్ని ప్రజలు రెండుసార్లు గెలిపించారని గుర్తు చేసిన ఆయన.. మోదీ అత్యంత విజయవంతమైన ప్రధాని అని కొనియాడారు. దేశ ఖ్యాతిని పెంచేందుకు మోదీ పనిచేశారని వ్యాఖ్యానించారు.

"అవిశ్వాసంపై చర్చ సందర్భంగా అన్ని ప్రసంగాలు శ్రద్ధగా విన్న తర్వాత నేను ఓ నిర్ణయానికి వచ్చాను. ఈ అవిశ్వాస తీర్మానం కేవలం భ్రమ కల్పించడానికే తీసుకొచ్చారు. ఇది ప్రజా ఆకాంక్షకు ప్రతిబింబం కాదు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ప్రధాని మోదీ ప్రభుత్వం మాత్రమే ఎక్కువ మంది ప్రజల విశ్వాసాన్ని గెలుచుకుంది. ప్రజల్లో అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడు ప్రధాని మోదీ. ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా రోజుకు 17 నుంచి 18 గంటలు నిరంతరం పని చేసే ప్రధానమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది నరేంద్ర మోదీ మాత్రమే. మోదీ ఓ నినాదం ఇచ్చారు. అవినీతిపరులారా క్విట్‌ ఇండియా. వారసత్వ రాజకీయ నేతలారా క్విట్‌ ఇండియా. బుజ్జగింపు రాజకీయాలు క్విట్‌ ఇండియా అని మోదీ చెప్పారు. ప్రధాని మోదీపై విపక్షాలకు విశ్వాసం లేకపోవచ్చు. భారత ప్రజలకు విశ్వాసం ఉంది."
-అమిత్‌ షా, కేంద్ర హోంమంత్రి

'మణిపుర్​లో భరతమాత హత్య.. అందుకే ఆ రాష్ట్ర పర్యటనకు మోదీ దూరం'

'భరతమాత' వ్యాఖ్యలపై స్మృతి ఇరానీ ఫైర్​.. రాహుల్ 'ఫ్లయింగ్ కిస్​'పై దుమారం

అప్పుడు హగ్ ఇచ్చి, కన్ను కొట్టి.. ఇప్పుడు ఫ్లయింగ్ కిస్.. రాహుల్ గాంధీపై మహిళా ఎంపీల ఫిర్యాదు

Last Updated :Aug 9, 2023, 7:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.