ETV Bharat / bharat

'80 ఏళ్లు దాటినా కొందరు రిటైర్ కారు- బాధ్యతలు మాకు అప్పగించొచ్చు కదా!'

author img

By PTI

Published : Jan 8, 2024, 7:59 AM IST

Ajit Pawar Sharad Pawar
Ajit Pawar Sharad Pawar

Ajit Pawar on Sharad Pawar Age : 80ఏళ్లు దాటినా కొంతమంది పదవీ విరమణ చేసేందుకు సిద్ధంగా లేరని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ వ్యాఖ్యానించారు. పరోక్షంగా శరద్ పవార్​ను విమర్శిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. పని చేసేందుకు తాము ఉన్నామని, గతంలోనూ ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం తమకు ఉందని చెప్పుకొచ్చారు.

Ajit Pawar on Sharad Pawar Age : ఎన్​సీపీ అధినేత శరద్‌ పవార్‌ లక్ష్యంగా మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ పరోక్ష విమర్శలు చేశారు. 80 ఏళ్లు పైబడినా కొంతమంది పదవీ విరమణ చేయడానికి సిద్ధంగా లేరని అజిత్ వ్యాఖ్యానించారు. 'మహారాష్ట్రలో ప్రభుత్వ ఉద్యోగులు 58 ఏళ్లకు పదవీ విరమణ చేస్తారు. సాధారణంగా చాలా మంది ఇతర ఉద్యోగులు 75 ఏళ్ల వయసులో వృత్తిపరమైన జీవితం నుంచి వైదొలుగుతారు. కానీ కొంతమంది 80 దాటి 84 ఏళ్లు (శరద్ వార్ వయసును ఉద్దేశిస్తూ) వచ్చినా రిటైర్ అయ్యేందుకు సిద్ధంగా లేరు. పని చేయడానికి మేం ఉన్నాం కదా. ఏదైనా తప్పు ఉంటే మాకు చెప్పొచ్చు. మాకు సత్తా ఉంది. ఇంతకుముందు నేను ఉప ముఖ్యమంత్రిగా పనిచేశా. అనేక పథకాలు విజయవంతం చేశాం' అని అన్నారు అజిత్ పవార్. ఠాణెలో నిర్వహించిన ఎన్​సీపీ సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇక, ఎన్​సీపీని చీల్చి బీజేపీ-శివసేన సర్కారుతో చేతులు కలపడాన్ని అజిత్ పవార్ సమర్థించుకున్నారు. తన నిర్ణయానికి కారణాలను చెప్పారు. ప్రజలకు సేవ చేయడం, వారి సమస్యలు పరిష్కరించడం కోసమే రాష్ట్ర ప్రభుత్వంతో కలిసినట్లు పవార్ వెల్లడించారు. అధికారం లేకపోతే ప్రజా సమస్యల పరిష్కారం సాధ్యం కాదన్నారు. మరాఠా రిజర్వేషన్ల కార్యకర్త మనోజ్ జరాంగేకు హెచ్చరికలు జారీ చేశారు. ముంబయికి భారీ ర్యాలీ నిర్వహిస్తామని జరాంగే ప్రకటించిన నేపథ్యంలో హెచ్చరిక స్వరం వినిపించారు. 'మరాఠా రిజర్వేషన్లపై గత కొద్దికాలంగా చర్చ నడుస్తోంది. తమ డిమాండ్​ను నెరవేర్చుకోవాలన్న లక్ష్యంతో కొంతమంది ముంబయికి వస్తామని అనుకుంటున్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే ప్రయత్నం చేయవద్దు. అలా చేస్తే ఎవరూ వదిలిపెట్టరు' అని అజిత్ హెచ్చరించారు.

గతేడాది ఎన్​సీపీ నాటకీయ పరిణామాలకు వేదికైంది. రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు శరద్ పవార్ మే నెలలో ప్రకటించారు. కొత్త తరానికి పార్టీని అప్పగిస్తున్నట్లు తెలిపారు. అధ్యక్షుడిని ఎన్​సీపీ సభ్యులు ఎన్నుకోవాలని సూచించారు. పార్టీ నేతలు, కార్యకర్తల నిరసనల నేపథ్యంలో తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఈ పరిణామాలు జరిగిన రెండు నెలలకే అజిత్ పవార్ పార్టీని చీల్చారు. తనకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలతో కలిసి జులైలో బీజేపీ-శివసేన కూటమితో కలిసి ప్రభుత్వంలో చేరారు. పార్టీ పేరు, గుర్తును తమ వర్గానికే కేటాయించాలని ఈసీని కోరారు.

శరద్ పవార్ మనవడి కంపెనీల్లో ఈడీ సోదాలు

Sharad Pawar Ajit Pawar : 'NCPలో చీలిక లేదు.. అజిత్​ మా నాయకుడే'.. సాయంత్రానికి శరద్​ పవార్ యూటర్న్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.