'అగ్నివీరులతో సాయుధ దళాలకు నయా టెక్ జోష్​'

author img

By

Published : Jan 16, 2023, 4:41 PM IST

pm modi virtual meeting on agniveers
అగ్నిపథ్​ పథకం ()

అగ్నిపథ్​ పథకం కింద తొలి విడతలో ఎంపికైన అభ్యర్థులకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ దిశానిర్దేశం చేశారు. సాంకేతికతపై పట్టున్న యువ అగ్నివీరుల రాకతో సాయుధ దళాలు మరింత బలోపేతం అవుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు.

అగ్నిపథ్‌ పథకం కింద సైనిక విభాగాల్లో ఎంపికైన తొలి విడత అగ్నివీరులను ప్రధాని నరేంద్ర మేదీ వర్చువల్‌గా కలుసుకున్నారు. త్రివిధ దళాల్లో స్వల్పకాలిక సైనిక సేవల కోసం ఎంపికైన అభ్యర్థులకు ప్రధాని దిశానిర్దేశం చేశారు. రాబోయే కాలంలో అగ్నివీర్​లు సాయుధ దళాల్లో కీలక పాత్ర పోషించి.. బలగాలను మరింత బలోపేతం చేస్తారని మోదీ అన్నారు. రాబోయే తరాలకు ఈ మొదటి​ అగ్నివీర్​ బ్యాచ్ మార్గనిర్దేశకులుగా ఉన్నందున వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కూడా పాల్గొన్నారు.

"విప్లవాత్మక మార్పునకు మార్గనిర్దేశకులుగా ఉన్నందుకు మీ అందరికీ అభినందనలు. అగ్నిపథ్​ పథకం పారదర్శకమైనది. యువ అగ్నివీర్​లు సాయుధ దళాలకు.. సాంకేతికపరంగా మరింత బలాన్ని చేకూరుస్తారు. సాంకేతిక పరిజ్ఞానం కలిగిన వీరు త్రివిధ దళాల్లో కీలక పాత్ర పోషిస్తారు. ఈ తరం యువతకు ఆ శక్తి,సామర్థ్యాలు ఉన్నాయి. రాబోయే కాలంలో అగ్నివీర్​లు బలగాల్లో ముఖ్యపాత్ర పోషిస్తారు. వీరి రాకతో సైన్యం మరింత చైతన్యంతో నిండిపోయింది. 21వ దశాబ్దంలో యుద్ధాలు జరిగే విధానం పూర్తిగా మారిపోతుంది. త్రివిధ దళాల్లో మహిళా అగ్నివీర్​లను చూడాలని ఎదురుచూస్తున్నాను. వారు వివిధ రంగాల్లో సాయుధ బలగాలకు నాయకత్వం వహిస్తున్నందున చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతం సియాచిన్​లో మహిళలు యుద్ధ విమానాలు నడుపుతున్నారు."
-- నరేంద్ర మోదీ, భారత ప్రధాని

pm modi virtual meeting on agniveers
వర్చువల్​గా అగ్నివీరులకు దిశానిర్దేశం చేసిన మోదీ

అగ్నివీర్​లు వివిధ ప్రాంతాలలో పోస్టింగ్ పొందడం వల్ల విభిన్న అనుభవాలను పొందేందుకు అవకాశం ఉంటుందని.. వివిధ బాషలు, సంస్కృతులు, జీవిన విధానాలను నేర్చుకోవాలని వారికి సూచించారు. బృందంగా కలిసి పనిచేస్తే, నాయకత్వం వహిస్తే వ్యక్తిత్వానికి కొత్త కోణం అంతుందని అన్నారు. వారు ఎంచుకున్న రంగాల్లో నైపుణ్యాలను మొరుగుపరచుకుంటూ.. కొత్త విషయాలు తెలుసుకునే ఆసక్తి కలిగి ఉండేలా వారిని ప్రోత్సహించారు.

pm modi virtual meeting on agniveers
మోదీ వర్చువల్ మీటింగ్​కు హాజరైన రక్షణమంత్రి రాజ్​నాథ్​ సింగ్​, సైనికాధికారులు

అగ్నిపథ్‌ పథకాన్ని గతేడాది జూన్‌ 14న కేంద్రం ప్రారంభించింది. సైన్యంలో యువశక్తిని పెంపొందించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రారంభించినట్లు కేంద్రప్రభుత్వం ప్రకటించింది. దీనిపై పెద్దఎత్తున ఆందోళనలు జరిగాయి. సైనిక సేవలను నాలుగేళ్లకు పరిమితం చేయడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుబట్టాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.