ETV Bharat / bharat

'సవాళ్లను అధిగమించాం.. భవిష్యత్ యుద్ధాలకు భారత ఆర్మీ సంసిద్ధం'

author img

By

Published : Jan 15, 2023, 11:51 AM IST

75th-army-day-celebrations-in-karnataka-celebrities-wishes-to-soldier
కర్ణాటకలో ఘనంగా 75వ ఆర్మీడే వేడుకలు

సైనిక దినోత్సవాన్ని పురస్కరించుకుని పలువురు ప్రముఖులు.. జవాన్​లకు శుభాకాంక్షలు తెలియజేశారు. దేశానికి వారు చేస్తున్న సేవలను కొనియాడారు. కాగా, కర్ణాటక రాజధాని బెంగళూరులో 75వ ఆర్మీడే వేడుకలు ఘనంగా జరిగాయి. బెంగళూరులో నిర్వహించిన 75వ ఆర్మీడే పరేడ్‌కు హాజరైన ఆర్మీ చీఫ్‌ జనరల్‌ మనోజ్ పాండే.. సైన్యాన్ని ఉద్దేశించి మాట్లాడారు.

స్వాతంత్రం వచ్చిన తర్వాత తొలిసారి దేశరాజధాని దిల్లీ వెలుపల సైనిక దినోత్సవాన్ని నిర్వహించారు. బెంగళూరులో నిర్వహించిన 75వ ఆర్మీడే పరేడ్‌కు హాజరైన ఆర్మీ చీఫ్‌ జనరల్‌ మనోజ్ పాండే.. సైనికుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం బలగాలు చేసిన పలు విన్యాసాలను తిలకించారు. ఏటా జనవరి 15న జాతీయ సైనిక దినోత్సవాన్ని జరుపుకుంటారు. 1949లో బ్రిటిష్‌ వారి నుంచి భారత సైన్యం కమాండర్‌ ఇన్‌ చీఫ్‌గా ఫీల్డ్‌ మార్షల్‌ కేఎమ్​ కరియప్పా బాధ్యతలు స్వీకరించినందుకు గుర్తుగా ఈరోజును ఆర్మీ డే గా జరుపుకుంటున్నారు. పుణె కేంద్రంగా పనిచేస్తున్న సదరన్ కమాండ్ పర్యవేక్షణలో ఈ ఏడాది ఆర్మీడే వేడుకలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు దిల్లీ కంటోన్మెంట్‌లోని కరియప్పా పరేడ్‌ గ్రౌండ్‌లో సైనిక దినోత్సవం నిర్వహించేవారు.

"గత సంవత్సరం దేశ ఆర్మీ భద్రత పరమైన సవాళ్లను ఎదుర్కొంది. ఇప్పుడు ఆ సవాళ్లను పూర్తిగా అధిగమించాం. భవిష్యత్​లో రాబోయో యుద్ధాలను సమర్ధంగా ఎదుర్కొనేందుకు.. ఆర్మీని మరింతగా బలోపేతం చేస్తున్నాం" అని మనోజ్ పాండే అన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో జవానులు తమ ధైర్య సాహసాలను ప్రదర్శిస్తున్నారన్నారు. అక్కడ వారికి కావలసిన పరికరాలను, అన్ని రకాల సదుపాయలను ప్రభుత్వం అందిస్తోందని మనోజ్ పాండే తెలిపారు. స్థానిక ప్రభుత్వాల సాయంతో ఆ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

ఉత్తరాది సరిహద్దు ప్రాంతాల్లో ప్రస్తుతం సాధారణ పరిస్థితులే ఉన్నాయన్నారు మనోజ్ పాండే. అక్కడ శాంతిని నెలకోల్పేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎటువంటి అనుకోని ఘటనలు జరిగిన.. ఎదుర్కొనేందుకు సైన్యం సిద్ధంగా ఉందన్నారు. "జమ్ముకశ్మీర్​ ప్రజల్లో మార్పు కనిపిస్తోంది. వారంతా హింసను పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. పశ్చిమ సరిహద్దులోని ఎల్​ఓసీ వెంబడి కాల్పుల విరమణ కొనసాగుతోంది. ఆ ప్రాంతాంలో తీవ్రవాద కార్యకలపాలు ఇంకా అలాగే ఉన్నాయి. వాటిని రూపుమాపేందుకు నిరంతరం చర్యలు చేపడుతున్నాం" అని మనోజ్ పాండే అన్నారు.

జాతీయ సైనిక దినోత్సవం సందర్భంగా సైనికులకు రాష్ట్రపతి, ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. సరిహద్దుల్లో ఎల్లప్పుడూ సైనికులు గస్తీ కాస్తూ దేశాన్ని ముందుకు నడిపించారని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ కొనియాడారు. ఆర్మీ డే సందర్భంగా భారత సైన్యంలోని వీర జవాన్లు.. వారి కుటుంబాలకు సెల్యూట్‌ చేస్తున్నట్లు ముర్మూ ట్వీట్ చేశారు. సైనికులు, వారి కుటుంబాలకు ఆర్మీడే శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్వీట్ చేశారు. ప్రతీ భారతీయుడు సైన్యాన్ని చూసి గర్వపడుతున్నాడని.. సైనికులకు ఎల్లప్పుడూ కృతజ్ఞతలు తెలుపుతున్నారని తెలిపారు. నిత్యం దేశాన్ని సురక్షితంగా ఉంచుతూ.. సంక్షోభ సమయాల్లోనూ సేవ చేస్తున్నారని ప్రశంసించారు. సైనిక దినోత్సవాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ శుభాకాంక్షలు తెలిపింది. సైనికుల ధైర్యం, అంకితభావం, నిస్వార్థ త్యాగాలకు దేశ ప్రజలు ఎప్పటికీ రుణపడి ఉంటారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ట్వీట్ చేశారు. ప్రతీ సైనికుడు ధైర్యం, దేశభక్తి, త్యాగంతో నిండి ఉన్నారని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కొనియాడారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.