ZPTC Resignation Issue in Guntur District: వైసీపీ జడ్పీటీసీ రాజీనామా ప్రకటన.. మంత్రి అంబటి వారించినా..
ZPTC Resignation Issue in Guntur District:ఉమ్మడి గుంటూరు జిల్లా.. సర్వసభ్య సమావేశంలో తాడికొండ మండలం వైసీపీ జడ్పీటీసీ గుడిమెట్ల జ్యోతి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం కలకలం రేపింది. మండలం పరిధిలో ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపట్టే కార్యక్రమాలకు తనను కనీసం ఆహ్వానించడం లేదని, ఎస్సీ కులానికి చెందిన తనను చిన్నతనంగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు సైతం తనకు కనీస గౌరవం ఇవ్వడం లేదని వాపోయారు. గడపగడపకు కార్యక్రమానికి కూడా తనను పిలవలేదని ఆమె తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాలకు పిలవనప్పుడు జడ్పీటీసీగా ఉండి ఏం ప్రయోజనం అని ప్రశ్నించారు. దీంతో రాజీనామా చేసి వెళ్లిపోతానని ఆమె పోడియం వద్దకు వచ్చారు. వెంటనే మంత్రి అంబటి రాంబాబు జోక్యం చేసుకొని రాజీనామా చేయవద్దని.. దీనిపై విచారణ చేసి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం ఆమె సమావేశం నుంచి వెళ్లిపోయారు. మంత్రి అంబటి రాంబాబు పది రోజులలో తన సమస్యను పరిష్కరిస్తామని చెప్పారని.. తనకు కనీస గౌరవం ఇవ్వకపోవడం వలనే రాజీనామా వరకూ పరిస్థితి వచ్చిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.