ప్రజలు లేకపోతేం - మీడియా ఉందిగా! కర్నూలు జిల్లాలో వెలవెలబోయిన మంత్రుల బస్సు యాత్ర
Published: Nov 18, 2023, 8:11 PM

YCP Samajika Sadhikaratha Bus Yatra Updates: ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'సామాజిక సాధికార బస్సు యాత్ర'కు జనాలు రాక వెలవెలబోతుంది. కొన్ని చోట్ల మంత్రుల ప్రసంగాలు ప్రారంభం కాకముందే సభ నుంచి ప్రజలు వెళ్లిపోతున్నారు. మరికొన్ని చోట్ల ముఖ్య నాయకులు ప్రసంగిస్తుండగానే బారికేడ్లు తోసుకుంటూ వెళ్లిపోతున్నారు. ఈ క్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు చేపట్టిన బస్సు యాత్రకు ప్రజల నుంచి పెద్దగా స్పందన లభించకపోవడంతో.. చేసేదేమీ లేక మీడియా ముందు ప్రసంగిస్తున్నారు.
YCP Ministers Bus Yatra: కర్నూలు జిల్లా పత్తికొండలో వైసీపీ మంత్రులు ఆదిమూలపు సురేశ్, గుంపనూరు జయరాం, ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాష, ఉషశ్రీ చరణ్, పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవిలు చేపట్టిన 'సామాజిక సాధికార బస్సు యాత్ర' సభ వెలవెలబోయింది. సభలో మంత్రుల ప్రసంగం ప్రారంభించక ముందే జనం సభ నుంచి వెనుదిరగడం ఆరంభించారు. ముఖ్య నాయకులు ప్రసంగిస్తుండగానే మరికొంత మంది బారికేడ్లు తోసుకుంటూ వెళ్లిపోయారు. దాంతో సభ ప్రాంగణమంతా ఖాళీగా దర్శనమిచ్చింది. మరోవైపు గత రెండు రోజులుగా పట్టణ వాసులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన సామాజిక సాధికార బస్సు యాత్రకు.. ప్రజల నుంచి పెద్దగా స్పందన లభించలేదు. ఈ నేపథ్యంలో చేసేదేమీలేక మంత్రులు మీడియా ముందు ప్రభత్వం చేసిన అభివృద్ధిపై ప్రసంగించారు.