heart attack: గుండెపోటుకు ఆ గోల్డెన్ సమయమే శ్రీరామ రక్షా..
Dr Ramesh Babu On Heart Problems: ముందుగా గుర్తిస్తే గుండెజబ్బుల్ని 80 శాతం నివారించవచ్చని ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్ రమేశ్ బాబు అభిప్రాయపడ్డారు. గుంటూరు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో నిర్వహించిన నిరంతర వైద్యవిద్య కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రమేశ్ ఆస్పత్రి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా వైద్యవిద్యార్థులకు గుండెజబ్బులు, ఆధునికంగా వచ్చిన చికిత్సా విధానాలపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. కొద్దికాలంగా గుండె జబ్బులు పెరిగాయని... జబ్బును ముందుగా నివారించడం కీలకమని రమేశ్ బాబు చెప్పారు. ఛాతీనొప్పి వచ్చినప్పుడు గుండెనొప్పిగా సకాలంలో గుర్తించడం ముఖ్యమన్నారు.
యువకుల్లో సైతం గుండెజబ్బులు పెరుగుతున్నాయని ఆయన వెల్లడించారు. అమెరికా లాంటి దేశాల్లో గుండెజబ్బులను తగ్గించేందుకు మిలియన్ హార్ట్ ఎటాక్ కార్యక్రమాన్ని ప్రారంభించి గుండెపోటు మరణాలపై విసృతమైన అవగాహనా కల్పిస్తున్నారని పేర్కొన్నారు. ముందస్తుగా... వివిధ వైద్య పరీక్షల ద్వారా గుండెనొప్పిని గుర్తించే అవకాశాలు ఉన్నాయని, తద్వారా ప్రాణాపాయం నుంచి బయట పడవచ్చని డాక్టర్ రమేశ్ బాబు పేర్కన్నారు. కొన్ని సంద్భాల్లో ముందుగానే గుండె పోటును గుర్తించినా... ఆసుపత్రికి వెళ్లే లోపు జరిగే నష్టం జరుగుతుందని వెల్లడించారు. గోల్డెన్ అవర్లో రోగికి వైద్యచికిత్సలు అందిస్తే కోలుకుంటారని... గ్యాస్ నొప్పని అశ్రద్ధ చేయడం తగదని డాక్టర్ రమేశ్ బాబు సూచించారు.