2022- 23 ఆర్థిక సంవత్సరంలో వైఎస్సార్సీపీకి రూ.68కోట్లు, టీడీపీ కి రూ.11.92 కోట్ల విరాళాలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 24, 2023, 11:03 AM IST
TDP and YCP Submitted Party Donation Details to EC: రాష్ట్రంలోని అధికారంలో ఉన్న వైసీపీకు 2022- 23 ఆర్థిక సంవత్సరంలో 68 కోట్ల 30 వేల రూపాయల విరాళాలు వచ్చాయి. ఇందులో ఎలక్టోరల్ బాండ్ల ద్వారా 52 కోట్లు రాగా.. ఫ్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్టు ద్వారా 16 కోట్లు వచ్చాయి. ఈ ట్రస్టు నుంచి 12 కోట్లు, 2 కోట్లు, కోటి చొప్పున రెండు సార్లు విరాళాలు అందాయి. కడపకు చెందిన పోచింరెడ్డి సుబ్బారెడ్డి అనే వ్యక్తి మాత్రమే వైసీపీకు 30 వేలు విరాళంగా ఇచ్చారు. మరే వ్యక్తిగత విరాళాలు వైసీపీకు రాలేదు.
ఇదే ఆర్థిక సంవత్సరంలో తెలుగుదేశం పార్టీకి 193 మంది వ్యక్తులు, సంస్థల నుంచి 11 కోట్ల 92 లక్షల 39 వేల 124 రూపాయల విరాళాలు వచ్చాయి. 20 వేలకు మించి విరాళాలు ఇచ్చిన వారి పేర్లను పార్టీ ఎన్నికల సంఘానికి సమర్పించిన నివేదికలో వెల్లడించింది. ఎలక్టోరల్ బాండ్లు, ఎలక్టోరల్ ట్రస్టు ద్వారా తెలుగుదేశం పార్టీకి ఎలాంటి విరాళాలు అందలేదు. ఈ మేరకు ఇరు పార్టీల నివేదికల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం తన సైట్లో అప్లోడ్ చేసింది.