'పచ్చళ్లతో తినండి లేదంటే చెత్తకుప్పలో పడేయండి' - అర్ధాకలితో గురుకుల విద్యార్థుల అవస్థలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 7, 2023, 3:09 PM IST
Students Facing Problems in Tribal Welfare Residential Schools: పేద విద్యార్థులకు ఉచితంగా కార్పొరేట్ స్థాయిలో విద్య అందించి, కడుపునిండా ఆహారం పెట్టాలనే ఉద్దేశంతో గురుకులాలు ప్రారంభించారు. కానీ జగన్ హయాంలో విద్యార్థులు పస్తులు ఉండాల్సిన దుస్థితి నెలకొంది. అన్నంలోకి సరిపడా కూర ఎందుకు వండలేదని ప్రశ్నిస్తే 'పచ్చడితో తినండి లేదంటే చెత్త కుప్పలో పడేయండి' అని సిబ్బంది ఇచ్చిన సమాధానం నిర్ఘాంత పరుస్తుంది. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలోని గిరిజన గురుకుల పాఠశాలలో తాజాగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
Residential School Students are Starving in Palnadu:పల్నాడు జిల్లాలో గిరిజన బాలికల గురుకుల విద్యాలయం(Girls Tribal Welfare Residential School)లో విద్యార్థులు మంగళవారం ఉదయం మెనూ ప్రకారం పెట్టాల్సిన ఇడ్లీ, చట్నీ, గుడ్డుకు బదులుగా అన్నం, సాంబారు పెట్టారు. విద్యార్థులకు ఆహారం సరిపడక 'ఎందుకు తక్కువ వండారని' సిబ్బందిని ప్రశ్నించగా 'పచ్చళ్లు తినండి లేకపోతే చెత్తకుప్పలో వేసేయమని/ సిబ్బంది ఇచ్చిన సమాధానంతో ఒట్టి అన్నం తిని కొందరు, అర్ధాకలితో మరికొందరు సరిపెట్టుకుంటున్నారు.
విద్యార్థులు ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో బుధవారం గురుకులానికి వచ్చారు. అధికారులు బాలికలను విచారించి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రోజూ ఆహార పదార్థాలు ఆలస్యంగా వండుతున్నారని, దీంతో తరగతిగదికి సమయానికి చేరుకోలేకపోతున్నామని, కొన్ని సార్లు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న తినుబండారాలతో కడుపునింపుకుంటున్నామని విద్యార్థులు అధికారులకు వెల్లడించారు. ఇకమీదట ఎలాంటి ఇబ్బంది జరగకుండా చూసుకుంటామని, అక్కడ పనిచేసే వంటవారిని వెంటనే తొలగిస్తామని అధికారులు విద్యార్థులకు తెలిపారు.