SC ST Employees JAC ప్రమోషన్ల రివైజ్ పేరుతో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల జీవితాలతో చెలగాటం..!
SC ST Employees Chalo Vijayawada On July 23 : రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన ప్రమోషన్లను రివైజ్ చేయాలని వేసిన మిడిల్ లెవెల్ ఆఫీసర్స్ కమిటీ ఇచ్చిన నివేదికను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆమోదించడంపై ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కమిటీ ఆమోదాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. నివేదికను అమలు చేస్తే ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రెండు లక్షల మంది తీవ్ర ఇబ్బందులు పడతారని, వారి జీవితాలతో ప్రభుత్వ చెలగాటం ఆడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్లకు కొందరు తూట్లు పొడుస్తున్నారని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల జేఏసీ కన్వీనర్ శీను బాబు మండిపడ్డారు. తక్షణమే కమిటీ నివేదికను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. జులై 23 వ తేదీన నివేదిక ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు జేఏసీ ఆధ్వర్యంలో చలో విజయవాడ నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు.