Prakasam District Missing boy Case ఇంకా లభించని చింతపాలెం చిన్నారి ఆచూకీ.. రంగంలోకి 16 బృందాలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 2, 2023, 10:32 PM IST
Prakasam District Missing boy Case ప్రకాశం జిల్లా చంద్రశేఖరపురం మండలం చింతపాలెంలో మూడు రోజుల క్రితం అదృశ్యమైన చిన్నారి ఆచూకీ ఇంకా లభించలేదు. తల్లి పక్కలో నిద్రిస్తోన్న ఏడాదిన్నరేళ్ల బాలుడు.. ఉదయం నిద్ర లేచే సరికి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే చుట్టు పక్కల అంతా వెతికారు. అయినా, చిన్నారి ఆచూకీ దొరకలేదు. భయాందోళనకు గురైన తల్లిదండ్రులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బాలుడి ఆచూకీ కోసం 16 బృందాలు.. చిన్నారి అదృశ్యంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. గత రెండు రోజులుగా బృందాలుగా ఏర్పడి చిన్నారి ఆచూకీ కోసం తెగ వెతుకుతున్నారు. అయినా కూడా చిన్నారి ఆచూకీ లభ్యంకాలేదు. ఈ క్రమంలో ఎస్పీ మల్లికాగార్గ్ బాలుడు అదృశ్యాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని..రంగంలోకి మరో 16 బృందాలను దింపారు. బాలుడి ఆచూకీ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. మరోవైపు చిన్నారి కనిపించక మూడు రోజులు గడవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. త్వరగా తమ కుమారుడిని వెతికి పట్టుకుని తమకు అప్పగించాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.