Operators Stopped Supply of Ration Due To Server Problem : సర్వర్లు పని చేయక.. రేషన్ సరఫరాను నిలిపివేసిన ఆపరేటర్లు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 7, 2023, 1:51 PM IST
Operators Stopped Supply of Ration Due To Server Problem : ఇంటికే రేషన్ సరుకులు పంపించి పేదల ప్రయాసల్ని తగ్గిస్తున్నామంటూ సీఎం జగన్, మంత్రులు చెప్పే మాటలు క్షేత్రస్థాయిలో నెరవేరడం లేదు. వందల కోట్లు ఖర్చు చేసి జగన్ సర్కార్ వాహనాలు ప్రవేశపెట్టింది. కానీ ఎక్కడా కూడా సరుకులు ఇంటికి తెచ్చి ఇస్తున్న పరిస్థితి లేదు. మరోవైపు సర్వర్లు పని చేయకపోవడంతో ఆపరేటర్లు ప్రజల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో సర్వర్లు పనిచేయకపోవడంతో వినియోగదారులకు ఇంటి వద్దకు బియ్యం, ఇతర నిత్యావసరాలు అందించడంలో ఇబ్బందులు పడుతున్నామంటూ ఆపరేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన తమ ఆధీనంలో ఉన్న రేషన్ వాహనాలను తీసుకుని ముమ్మిడివరంలో జిల్లా పౌరసరఫరాల శాఖ కార్యాలయం వద్దకు తీసుకువచ్చి ఆపరేటర్లు నిలిపివేశారు. గత వారం రోజులుగా సర్వర్లు పనిచేయక గంటల తరబడి వేచి చూడవలసి వస్తుందని.. ప్రజల నుంచి తిట్లు తింటున్నామని అన్నారు. అధికారులు దృష్టి కి సమస్య తీసుకువెళ్లినా పట్టించుకోవడంలేదని ఆపరేటర్లు ఆందోళన వ్యక్తం చేశారు.