Nara Lokesh Public Meeting in Gannavaram: "ఇసుక దందాలో జగన్ రోజూ రూ. 3 కోట్లు అక్రమంగా సంపాదిస్తున్నారు"
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 22, 2023, 10:07 PM IST
|Updated : Aug 23, 2023, 6:25 AM IST
Nara Lokesh Fires on CM Jagan in Public Meeting at Gannavaram : యువగళం చూసి సీఎం జగన్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. 191వ రోజు యువగళం పాదయాత్రలో భాగంగా గన్నవరంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొన్న లోకేశ్ యువగళానికి వస్తున్న స్పందన చూసి జగన్కు భయం పట్టుకుందన్నారు. పాదయాత్రను ఆపేందుకు ఎన్నో విధాలుగా ప్రయత్నించారని మండిపడ్డారు. కృష్ణా జిల్లాలో అక్రమంగా ఇసుక వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. ఇసుక దందాలో సీఎం జగన్.. రోజుకు 3 కోట్ల రూపాయలను అక్రమంగా సంపాదిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ ఆధికారంలోకి వచ్చిన తరువాత సిమెంట్, ఇసుక, ఐరన్ ఛార్జీలు తగ్గించి భవన నిర్మాణ కార్మికులను ఆదుకుంటామని లోకేశ్ హామీ ఇచ్చారు.
జిల్లాలో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు. ఆగిన బందరు పోర్టు పనులు తామే పూర్తి చేస్తామని అన్నారు. ఎస్సీలకు నిలిపివేసిన 27 సంక్షేమ కార్యక్రమాలు మళ్లీ అమలు చేస్తామని భరోసా కల్పించారు. మైనార్టీ సోదరులను వైసీపీ ప్రభుత్వం వేధిస్తోందని ఆరోపించారు. టీడీపీ నేతలు, కార్యకర్తలను వేధించిన ఏ ఒక్కరినీ వదలనని హెచ్చరించారు. గన్నవరంలో ఉన్నా.. విదేశాలకు పారిపోయినా.. ఎవరినీ వదలనని స్పష్టం చేశారు. చట్టాలు ఉల్లంఘించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని.. విచారణ జరిపించి జైళ్లకు పంపిస్తామని అన్నారు. అక్రమ కేసులు పెట్టిన అధికారుల పేర్లు రెడ్బుక్లో రాసుకున్నామని లోకేశ్ స్పష్టం చేశారు.
తాను పాదయాత్ర చేస్తుంటే సీఎం జగన్కు కాలునొప్పి వచ్చిందని లోకేశ్ ఎద్దేవా చేశారు. కొడాలి నాని, వంశీ తెలుగుదేశం వీడటంతో కృష్ణా జిల్లాకు దరిద్రం పోయిందని అన్నారు.