Flood victim నిన్న అలా.. నేడు ఇలా! గవర్నమెంట్ అన్ని సౌకర్యాలు చేస్తున్నారని నేను వింటున్నాను! మాట మార్చిన వరద బాధితురాలు..
Konaseema Woman changing statement: రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న కుండపోత వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రధాన రహదారులు సైతం జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కొన్ని ప్రాంతాల్లోని ఇళ్లలోకి కూడా మోకాళ్ల లోతు వరద చేరిపోయింది. దీంతో ప్రజలు ఇంట్లో ఉండలేక, బయటకు రాలేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. తిందామంటే తిండి కూడా దొరకట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో గోదావరి ఉద్ధృతి తగ్గినా కోనసీమ లంకగ్రామాల్లో వరద వెంటాడుతూనే ఉంది. దీంతో అక్కడి ప్రజలు రాకపోకలకు పడవలను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో విపత్తు నిర్వహణను వైసీపీ సర్కారు గాలికొదిలేసిందంటూ పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అప్పనరామునిలంకను వరద ముంచెత్తింది. వరద పోటుతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నా ప్రభుత్వం నుంచి కనీస సాయం అందలేదని గ్రామానికి చెందిన పాపాయమ్మ.. సోమవారం ఈటీవీ ముందు వాపోయారు. ఇదే వార్త మంగళవారం ఈనాడు పత్రికలోనూ ప్రచురితమైంది. వెంటనే అధికారులు ఆమెతో మాట్లాడారు. అంతే.. తాను ప్రభుత్వాన్ని తప్పుబట్టలేదంటూ పాపాయమ్మకు సంబంధించిన ఓ వీడియో బయటికి వచ్చింది.