ఎస్బీఐలో 7కిలోల నగలు మాయం - ఆందోళనలో ఖాతాదారులు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 2, 2023, 1:38 PM IST
Jewelry theft in SBI: బ్యాంకులో దాచుకున్న నగలు మాయమవడంతో ఖాతాదారులు ఆయోమయానికి గురవుతున్నారు. ఒకటి, రెండు కాదు ఏకంగా 7కిలోల ఆభరణాలు కనిపించకుండా పోవడంతో ఆందోళన చెందుతున్నారు. బ్యాంకులో భద్రపరిస్తే సురక్షితంగా ఉంటాయనుకున్న నగలు మాయం కావడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఖాతాదారుల వివరాల ప్రకారం శ్రీకాకుళం జిల్లా గార స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలో ఏడు కిలోల బంగారు ఆభరణాలు మాయమయ్యాయి. ఈ ఘటనపై ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు.
ఇటీవల డిప్యూటీ మేనేజర్ స్వప్న ప్రియ ఆత్మహత్య చేసుకుని చనిపోవడంతో ప్రస్తుతం ఆభరణాల మాయం అంశం వెలుగులోకి వచ్చింది. నగలు కనిపించకుండా పోవడంతో తాకట్టు పెట్టిన ఖాతాదారులకు విషయం తెలిసి బ్యాంకు వద్ద నిరసనకు దిగారు. తమకు న్యాయం చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బ్యాంకులో దాచుకున్న సొమ్ముకు సైతం భద్రత కరువైతే ఇంక ఎవరిని ఆశ్రయించాలని నిస్సహాయతను వ్యక్తం చేశారు. బ్యాంకు ప్రాంతీయ అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.