JADA SRAVAN KUMAR: అంబేడ్కర్ విగ్రహం.. ప్రభుత్వం రాజకీయం చేస్తోంది: జడ శ్రవణ్ కుమార్
Jada Sravan On Ambedkar Statue: విజయవాడ స్వరాజ్య మైదానంలో అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహ ఏర్పాటును.. వైసీపీ ప్రభుత్వం రాజకీయంగా వినియోగించుకుంటోందని జై భీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జడ శ్రవణ్ కుమార్ తెలిపారు. జూన్ 24వ తేదీన స్వరాజ్య మైదానం వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహం వద్ద జై భీమ్ భారత్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపడుతున్నట్లు.. ఆదేరోజు విజయవాడ అంబేడ్కర్ విగ్రహం నుంచి అమరావతిలోని అంబేడ్కర్ స్మృతివనం వరకు పాదయాత్ర నిర్వహిస్తున్నామన్నారు. అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహ ఏర్పాటును వైసీపీ ప్రభుత్వం రాజకీయంగా వినియోగించుకుంటుందని విమర్శించారు. ఈ విగ్రహ ఏర్పాటును ఒక్క ఏడాదిలో పూర్తి చేయాలని ఉన్నా కూడా.. మూడేళ్ల నుంచి నిర్మాణాన్ని సాగదీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహ ఏర్పాటులో అలసత్వంపై వైసీపీలో ఉన్న అంబేడ్కర్ వాదులు జగన్ను గట్టిగా అడగాలని సూచించారు. విగ్రహ ఏర్పాటులో పూర్తిగా నిధుల దుర్వినియోగం జరిగిందని ఆరోపించారు.