Illegal Soil Mining: బత్తులవారిగూడెంలో జోరుగా అక్రమ మట్టి తవ్వకాలు.. గ్రామస్థుల ఆందోళన
Illegal Soil Mining in Battuvarigudem : ఏలూరు జిల్లా నూజివీడు మండలం బత్తులవారిగూడెం గ్రామంలోని స్థానిక కొత్త చెరువులో మట్టిని తవ్వేసి జోరుగా అమ్మకాలు కొనసాగిస్తున్నారని, అక్రమంగా మట్టి తవ్వి బహిరంగ మార్కెట్లో ట్రక్కు 600, 700 రూపాయలకు యథేచ్ఛగా అమ్మేస్తున్నారని గ్రామస్థులు ఆరోపించారు. కొత్తగా ఇళ్లు నిర్మించుకునే వారికి, పాత ఇళ్ల మరమ్మతులకు మట్టి అందించడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. అధికార వైఎస్సార్సీపీలోని ఒక వర్గానికి మాత్రమే మట్టి అందేలా స్థానిక వైసీపీ నేత శంకరం వ్యవహరిస్తున్నట్లు మరో వర్గం వారు పేర్కొన్నారు. తమ ఇళ్ల నిర్మాణాలకు మట్టి కావాలని డిమాండ్ చేస్తూ స్థానిక ప్రజలు చెరువు గట్టుపై ఆందోళనకు దిగారు. అక్రమ మట్టి అమ్మకాలను నిలిపివేయాలని... స్థానిక లబ్ధిదారులకే మట్టి అందించాలని నినాదాలు చేస్తూ గ్రామస్థులు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న నూజివీడు సబ్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్ర ఆదేశంతో మండల తహసీల్దార్ ఎల్లారావు పర్యవేక్షణలో రెవెన్యూ శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని అక్రమ మట్టి తవ్వకాలను నిలిపివేశారు.